బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసిన ఇస్లాం ఖాన్‌

8 May, 2020 18:36 IST|Sakshi

న్యూఢిల్లీ : తనపై నమోదైన దేశ ద్రోహ కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ ఢిల్లీ మైనార్టీ కమిషన్‌ చైర్మన్‌ జఫారుల్‌ ఇస్లాం ఖాన్‌ శుక్రవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన ల్యాప్‌టాప్‌, ఫోన్‌‌ను పోలీసులు స్వాధీనం చేసుకోవద్దని కోరారు. తాను ఎలాంటి నేరం చేయలేదని, తనను బెదిరించి బయపెట్టాలనే ఉద్దేశంతోనే పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే తాను ప్రభుత్వ ఉద్యోగిని అని, 72 సంవత్సరాల వయస్సు కలిగిన సీనియర్ ‌సిటిజన్‌ అనే కారణాలతో ఖాన్‌ ముందుస్తు బెయిల్‌ కోరారు. గుండె జబ్బులు, రక్తపోటు సమస్యలతో బాధపడుతున్నట్లు అలాగే కోవిడ్‌-19  వచ్చే అవకాశం ఎక్కువ ఉందని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ఆమోదయోగ్యం కాని కేసు నుంచి తనకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని ఖాన్‌ తరఫు న్యాయవాదులు వ్రిందా గ్రోవర్‌, రత్న అప్పెండర్‌, సౌతిక్‌ బెనర్జీ పిటిషన్‌ దాఖలు చేశారు. (ఢిల్లీ మైనారిటీస్‌ కమిషన్‌ చైర్మన్‌పై దేశద్రోహం కేసు)

కాగా ఏప్రిల్‌ 28న జఫారుల్‌ ఇస్లాం తన సోషల్‌ మీడియా ఖాతా ద్వారా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు అతనిపై దోశ ద్రోహ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఖాన్‌ వ్యాఖ్యలు మత భవాలను రెచ్చగొట్టే విధంగా, సమాజానికి విఘాతం కలిగించేలా ఉన్నాయని వసంత్‌ కంజ్‌ ప్రాంతానికి చెందిన నివాసితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జఫారుల్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ మేరకు సెక్షన్‌ 124 ఏ(దేశద్రోహం), సెక్షన్‌ 153ఏ (జాతి వివక్ష వ్యాఖ్యలు) కింద ఢిల్లీ పోలీస్‌ స్పెషల్‌ సెల్‌ కేసులు నమోదు చేసింది. (జులై 1 నుంచి సీబీఎస్‌ఈ పరీక్షలు)

మరిన్ని వార్తలు