పన్నీర్‌లో ప్లాస్టిక్‌.. జొమాటో క్షమాపణలు!

20 Jan, 2019 18:25 IST|Sakshi

ముంబై : జొమాటో డెలివరీ చేసిన పన్నీర్‌ చిల్లీలో ప్లాస్టిక్‌ ఫైబర్‌ను గుర్తించిన ఓ వినియోగదారుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో చోటుచేసుకుంది. గత శుక్రవారం ఔరంగాబాద్‌కు చెందిన సచిన్ జామ్‌దారే  జొమాటోలో పన్నీర్ చిల్లీ, పన్నీర్ మసాలా’ను ఆర్డర్ చేశాడు. దాన్ని కుటుంబ సభ్యులతో కలిసి తింటుండగా.. సచిన్‌ కుమార్తె అది తన పళ్లకు అంటుకుంటోందని, గట్టిగా చూయింగం ఉందని,  పేర్కొంది. దీంతో దానిని పరీక్షించిన సచిన్ అందులో ఫైబర్ ఉన్నట్టు గుర్తించాడు. వెంటనే ఆ ఆహారం సరఫరా చేసిన రెస్టారెంట్‌కు వెళ్లి ఫిర్యాదు చేసాడు. వారు పట్టించుకోకపోగా, జొమాటో డెలివరీ బాయ్ ఏదో చేసి ఉంటాడని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. ఈ సమాధానంతో కంగుతిన్న సచిన్ వెంటనే పోలీసుకు ఫిర్యాదు చేశాడు. రెస్టారెంట్ సరఫరా చేసిన ఆహారం తినడానికి ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

రూ.150 ఆహారంలోనే కల్తీ చేస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్న ఇలాంటి సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ తరహా మోసంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సచిన్‌ డిమాండ్‌ చేశాడు. ఇక ఈ ఆహారాన్ని పరీక్షలకు పంపించామని, నివేదిక అనంతరం దానిని సరఫరా చేసిన రెస్టారెంట్‌పై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ ఘటన పట్ల విచారం వ్యక్తం చేస్తూ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో  ఆ వినియోగదారుడికి క్షమాపణలు తెలిపింది. ఆ ఆహారాన్ని అందించిన రెస్టారెంట్‌ను తమ ప్లాట్‌ఫాం నుంచి తొలగించినట్టు ప్రకటించింది. గతంలో కూడా ఓ జొమాటో డెలివరీ బాయ్‌ కస్టమర్‌ ఆర్డ్‌ర్‌ చేసిన ఫుడ్‌ని కొద్దిగా కొద్దిగా తిని.. తిరిగి ప్యాక్‌ చేసి డెలివరీ చేయడం వివాదస్పదమైన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు