సమస్యను తప్పుగా చిత్రీకరించారు: జొమాటో సీఈఓ

14 Aug, 2019 15:27 IST|Sakshi

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో జొమాటో డెలివరీబాయ్‌ల నిరసనల నేపథ్యంలో సంస్థ సీఈఓ దీపిందర్‌ గోయల్‌..  డెలీవరీ బాయ్స్‌కు  లేఖ రాశారు. తమ మత విశ్వాసాలకు విరుద్ధంగా ఉండే ఆహారాన్ని సరఫరా చేయబోమని చెబుతూ హిందూ, ముస్లిం ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌ సోమవారం నుంచి సమ్మె చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారికి లేఖ రాసిన సీఈఓ.. ఈ నిరసన అంతా ఇటీవల ధరల మార్పును తీసుకొచ్చిన తర్వాత ప్రారంభమైందని, ఇది కంపెనీ నిబంధనలలో భాగమని తెలిపారు. అయితే కొంతమంది డెలీవరీ బాయ్స్‌ దీనిని అర్థం చేసుకోకుండా కావాలనే ఉద్దేశపూర్వకంగా సమస్యను తప్పుగా చిత్రీకరించారని లేఖలో పేర్కొన్నారు.

కంపెనీ ఎవర్నీ ఏదీ చేయమని ఇబ్బంది పెట్టదని, ఇది కేవలం కొంతమంది డెలీవరీ భాగస్వాములకు మాత్రమే సంబంధించినదని పేర్కొన్నారు. ఈ నిరసన కేవలం హౌరాలోని పరిమిత ప్రాంతానికి సంబంధించినదని, రాష్ట్రం మొత్తానికి సంబంధించినది కాదని స్పష్టం చేశారు. బీఫ్‌, ఫోర్క్‌కు సంబంధించి గత మూడు నెలల నుంచి హౌరాలో ఒక్క ఆర్డర్‌ కూడా రాలేదని, కేవలం ఒక్క ఆర్డర్‌ బీఫ్‌ నుంచి వస్తే దాన్ని అమలు చేయకముందే కస్టమర్‌ రద్దు చేశారని దీపీందర్‌ గోయల్‌ వివరించారు.

మరిన్ని వార్తలు