లాక్‌డౌన్‌: పానీ పూరీపై జొమాటో ట్వీట్‌!

30 Mar, 2020 11:12 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మహమ్మారి కరోనా వైరస్‌(కోవిడ్‌-19) వ్యాప్తిని అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. దీంతో నిత్యావసర సరుకులు, అత్యవసర సేవల నిమిత్తం మినహా కాలు బయటపెట్టే పరిస్థితి లేదు. ఈ క్రమంలో చాలా మంది ఇంట్లోనే ఉంటూ కరోనా ఇచ్చిన సమయాన్ని కుటుంబంతో గడుపుతూ సద్వినియోగం చేసుకుంటున్నారు. సెలబ్రిటీలు సైతం గరిటె చేతబట్టి వంటలు చేస్తూ తమ వారికి సరికొత్త రుచులను పరిచయం చేస్తున్నారు. కాగా లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నప్పటికీ ఫుడ్‌ హోం డెలివరీ సర్వీసులకు మినహాయింపునిచ్చిన విషయం తెలిసిందే. (లాక్‌డౌన్‌లోనూ అందుబాటులో ఉండే సేవలు)

ఈ క్రమంలో ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థ తన కస్టమర్లు, నెటిజన్లతో సోషల్‌ మీడియాలో టచ్‌లో ఉంటూ తనదైన ట్వీట్లతో అలరిస్తోంది. ఇంట్లో అమ్మ చేతి వంటకు మించిన రుచికరమైన భోజనం లేదని ఇటీవల పేర్కొన్న జొమాటో... తాజాగా భారతీయుల్లో చాలా మందికి ఎంతో ప్రియమైన పానీపూరి గురించి తనదైన స్టైల్లో ట్వీట్‌ చేసింది. ‘‘ ప్రతీ ఒక్కరూ పానీపూరీ లేకుండా బాగానే ఉంటున్నారని ఆశిస్తున్నాం. అయితే ఇలాంటి సమయాల్లో మనం ధైర్యంగా ఉండక తప్పదు’’ అని నెటిజన్లలో ధైర్యం నింపింది. ఇందుకు స్పందనగా... ‘‘ఇదిగో గోల్‌గప్పా(పానీ పూరీ) లేకుంటే పరిస్థితి ఇలాగే ఉంటుంది. అయినా మర్చిపోవాలని ప్రయత్నిస్తుంటే మళ్లీ ఎందుకు గుర్తుచేస్తున్నారు’’ అంటూ నెటిజన్లు మీమ్స్‌ షేర్‌ చేస్తున్నారు. (కరోనా: కదలనున్న పార్సిల్‌ రైళ్లు.. )

మరిన్ని వార్తలు