సాక్షి, హైదరాబాద్: నల్లగొండ, సూర్యాపేట జిల్లా కేంద్రాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన వైద్య కళాశాలల్లో 1,036 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. 132 అసిస్టెంట్ ప్రొఫెసర్, 904 పారా మెడికల్ పోస్టుల భర్తీకి అనుమతిస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో 656 స్టాఫ్ నర్సు పోస్టులున్నాయి. డిపార్ట్మెంటల్ సెలక్షన్ కమిటీ ద్వారా ఈ నియామకాలు జరపాలని రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు.. వైద్య, ఆరోగ్య సంక్షేమ శాఖకు సూచించారు. ఈ పోస్టుల భర్తీ కోసం డిపార్ట్మెంటల్ సెలక్షన్ కమిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. నల్లగొండ, సూర్యాపేట వైద్య కళాశాలలు ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కానున్నాయి.