‘సర్కారీ’ వైద్యం విస్తృతం

19 Jan, 2018 10:13 IST|Sakshi

జనరల్‌ ఆస్పత్రిలో ఆన్‌లైన్‌ సేవలు

వార్డులోనే రక్త పరీక్షలు, ఎక్స్‌రే విభాగాలు

ప్రతి విభాగానికి రిజిస్ట్రేషన్‌ కౌంటర్‌, పేషెంట్‌కు ఓ నెంబర్‌..

ఆస్పత్రిలో ఎక్కడి నుంచైనా వివరాలు తెలుసుకోవచ్చు

త్వరలోనే అందుబాటులోకి.. 

జనరల్‌ ఆస్పత్రిలో వైద్య సేవలు మరింత మెరుగు పడనున్నాయి. రోగులకు ఆన్‌లైన్‌ వసతులు అందుబాటులోకి రానున్నాయి. త్వరలోనే అన్ని విభాగాల వైద్యసేవలు ఆన్‌లైన్‌లో కొనసాగనున్నాయి. వార్డుల్లోనే రక్త పరీక్షలు, ఎక్స్‌రేలు తీస్తారు.

నిజామాబాద్‌అర్బన్‌: రాష్ట్రంలోనే ఈ–ఆస్పత్రి విధానం లో సేవలందిస్తున్న ఏకైక దవాఖానా మన జిల్లా ఆస్పత్రే. గతేడాది నుంచి ‘ఈ– విధానం’ అందుబాటులోకి రాగా, ఈ సేవలను మరింత విస్తరించనున్నారు. మొన్నటివరకు రోగులు కేవలం గ్రౌండ్‌ ఫ్లోర్‌లోనే రిజిస్ట్రేషన్‌ చేసుకునేవారు. రిజిస్ట్రేషన్‌ ఒకచోట, వైద్య సేవలు మరో చోట అందిస్తుండ గా, ప్రస్తుతం ఆ పద్ధతి మార నుంది. ఇప్పు డు అన్ని విభాగాల్లో రిజిస్ట్రేషన్‌ చేసుకొనే అవకాశం కలగనుంది.

ప్రతి విభాగంలో ..
ఏడంతస్తుల ఆస్పత్రిలో ఒక్కో అంతస్తులో ఒక్కో విభా గంలో సేవలందిస్తున్నారు. మొదటి అంతస్తులో గైనిక్, కంటి విభాగాలు, రెండో అంతస్తులో జనరల్‌ మెడిసిన్, చిన్న పిల్లల వార్డు, మానసిక వైద్య నిపుణులు, టీకాల విభాగం, మూడో ఫ్లోర్‌లో జనరల్‌ సర్జరీ, ఆర్థోపెడిక్, నాలుగో ఫ్లోర్‌ లో టీబీ, ఆయుర్వేదిక్, నాచురోపతి, ఐదో అంతస్తులో ఏఆర్‌టీ సెంటర్, ఆరో ఫ్లోర్‌లో చెవి, దంత వైద్య విభాగాలు, ఏడో ఫ్లోర్‌లో బ్లడ్‌ బ్యాంక్, సెంట్రల్‌ ల్యాబ్‌ ఉన్నాయి. అయితే, ఆయా విభాగాలన్నింటికీ గతంలో ఒక్కచోటే రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉండేది.  త్వరలోనే అన్ని విభాగాల వద్ద రిజిస్ట్రేషన్‌ కౌంటర్లు ఏర్పాటు కానున్నాయి. రోగి నేరుగా తమకు కావాల్సిన విభాగానికి వచ్చి పేర్లు నమోదు చేసుకుంటే, ఆ వెంటనే వైద్యసేవలు అందిస్తారు.

అంతా ఆన్‌లైన్‌లోనే..
రోగి సంబంధిత విభాగంలో పేరు నమోదు నుంచి చికిత్సల వరకు మొ త్తం వివరాలన్నీ ఆన్‌లైన్‌లో నమోదవు తాయి. ఆస్పత్రికి వచ్చినప్పటి నుంచి అతనికి అందించిన వైద్య సేవలు, వివిధ పరీక్షల వివరాలు వెంటవెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. పేషెంట్‌కు కేటాయించే నెంబర్‌ ఆధా రంగా ఆస్పత్రిలో ఎక్కడి నుంచైనా ఆయా వివరాలు తెలుసుకోవచ్చు. గతంలో మాదిరిగా రక్త పరీక్షలకు, ఎక్స్‌రేకు ఆయా విభాగాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. దీని కోసం ఆస్పత్రిలో లోకల్‌ ఏరియా నెట్‌వర్క్‌ (లాన్‌)ను ఏర్పాటు చేస్తున్నారు. ఇక, ఆస్పత్రిలో ఆయా విభాగాలు ఎక్కడ ఉన్నాయో రోగికి తెలిసేలా ప్రవేశ మార్గంలోనే సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే, గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఇన్ఫర్మేషన్‌ కౌంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో నలుగురు సిబ్బంది రోగులకు అవసరమైన సమాచారాన్ని అందిస్తారు.

త్వరలో అందుబాటులోకి..
త్వరలోనే అన్ని విభాగాల్లో పేర్ల నమోదు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. దీని ద్వారా సత్వర వైద్య సేవలు అందుతాయి. రోగులకు అందించే అన్ని వైద్యసేవలను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తాం. రోగులకు మరింత చేరువచేస్తాం. – డాక్టర్‌ బన్సీలాల్, ఈ–ఆస్పత్రి ఇన్‌చార్జి

రోగులకు ఇబ్బందులు లేకుండా....
ఆస్పత్రిలో వైద్యసేవలు మెరుగుపరుస్తున్నాం. అన్ని విభాగాలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. అన్ని వైద్య సేవలు ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నాం. – రాములు, ఆసుపత్రి సూపరింటెండెంట్‌

మరిన్ని వార్తలు