అట్టహాసంగా 'ఆటా' వేడుకలు

13 Mar, 2018 11:57 IST|Sakshi

డల్లాస్ : మే 31, జూన్ 1, 2వ తేదీల్లో డల్లాస్ లో ఆటా-టాటా సంయుక్తంగా నిర్వహించనున్న మెగా కన్వెన్షన్‌లో భాగంగా అమెరికాలోని పలు నగరాల్లో 'ఆటా డే' వేడుకలను అమెరికా తెలుగు సంఘం(ఆటా) నిర్వహిస్తోంది. అలాగే ప్రతి సంవత్సరం అమెరికాలోని ముఖ్యమైన నగరాల్లో ఆటా నిర్వహించే మరో పెద్ద వేడుక, అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ వేడుకలను అమెరికాలోని తెలుగువారితో పాటు, భారతీయులందరూ ఎంతో ఉత్సాహంగా జరుపుకునే అవకాశం కల్పించింది అమెరికా తెలుగు సంఘం.  ఆటా మహిళా దినోత్సవ వేడుకల్లో వందల మంది మహిళలు, యువతులు పాల్గొని ఆటా, పాటలతో  కార్యక్రమాన్ని ఆద్యంతం ఉర్రూతలూగించారు. ఈ సందర్భంగా పలు రంగాల్లో మహిళలు సాధించిన విజయాలపై చర్చించుకున్నారు. అలాగే విజయాలను అందుకున్న కొంతమంది మహిళలను సన్మానించింది ఆటా. 20 సంవత్సరాల వయసులో, ఎన్నో కఠినమైన పరీక్షలను ఎదుర్కొని, వందలమందిలో ఒకరిగా నిలచి, అమెరికా వాయుసేనకు ఎంపికైన యశస్వినిని,  శ్రీమతి-ఇండియా, అట్లాంటా గా గెలుపొందిన మల్లిక దుంపాలని, సంగీతంలో ఎన్నో ఎత్తులను అధిరోహించిన శిరీష వేములని అమెరికా తెలుగు సంఘం ఘనంగా సన్మానించింది. నేటి యువతరం ఇటువంటి వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని, లక్ష్య సాధనలో పాటించవలసిన మేళకువలను యువతకు తెలియచేసేందుకు గాను, ఈ విజేతలతో కలిసి ఒక చర్చా వేదికను ఏర్పాటు చేసింది ఆటా. ఈ కార్యక్రమంలో యువత ఉత్సాహంగా పాల్గొని ఎన్నో కొత్త విషయాలను తెలుసుకున్నారు. దీనితోపాటు, సంగీత, నృత్య, ఆట పాటల కార్యక్రమాల్లో మహిళలందరూ ఉత్సాహంగా గడిపారు. ఈ కార్యక్రమాన్ని అరుంధతి కోడూరి, శ్రావణి రాచకుల్ల, ఉదయ ఏటూరి, అనుపమ సుబ్బగారి, స్వప్న పాశం, లక్ష్మీ పెద్దిలు నిర్వహణ బాధ్యతలను నిర్వహించారు.

అనంతరం జరిగిన 'ఆటా డే' కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తెలుగువారు వారి కుటుంబ సభ్యులతో పాటు హాజరయ్యారు. గాయని అంజనీ సౌమ్య ఈ కార్యక్రమాన్ని తన పాటలతో ఉర్రూతలూగించారు. ఆమెతోపాటు గాయకులు శ్రీనివాస్ దుర్గం, రాం దూర్వాసుల, జనార్దన్ పన్నెల, హరిణి, శ్రీవల్లి శ్రీధర్ తమ తమ పాటలతో అలరించారు. మే 31 నుండి జూన్ 2 వరకు డల్లాస్ నగరంలో ఆటా - టాటా సంయుక్తంగా నిర్వహించనున్న మెగా కన్వెన్షన్ కొరకు ఆటా విరాళాలు సేకరించింది. దీనిలో భాగంగా 2 లక్షల 50 వేల డాలర్లకు పైగా విరాళాలు అందినట్టు సంఘం అధ్యక్షులు డా. కరుణాకర్ ఆసిరెడ్డి తెలిపారు.  పెద్దమొత్తంలో విరాళాలు ఇచ్చిన వారిని అమెరికా తెలుగు సంఘం సత్కరించింది. ఈ కార్యక్రమానికి వచ్చి, తమవంతు సహాయం అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు సంఘం అధ్యక్షులు.

ఈ కార్యక్రమానికి ఆటా అధ్యక్షులు డా. కరుణాకర్ ఆసిరెడ్డి, ప్రశాంతి ఆసిరెడ్డి, కోశాధికారి కిరణ్ పాశం, స్వప్న పాశం, బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు అనిల్ బొద్దిరెడ్డి, రజిత బొద్దిరెడ్డి, వేణు పిస్కె,  వాసవి పిస్కె,  రీజనల్ డైరెక్టర్ తిరుమల్ పిట్ట, శ్రీధర్ తిరుపతి, ఉమేష్,  రఘు రెడ్డి, నందా చాట్ల, ప్రశీల్, వెంకట్ వీరనేని, సురేష్ వొలం, ప్రశాంత్ పొద్దుటూరి, శ్రీరామ్, రమణా రెడ్డి, సుబ్బారావు మద్దలి, వెంకట్ గొట్టం, అనుపమ సుబ్బగారి, లక్ష్మీ పెద్ది, ఉదయ ఏటూరి, శ్రావణి రాచకుల్ల,  అమెరికా తెలుగుసంఘం అత్యవసర సేవల విభాగ అధ్యక్షులు శివకుమార్ రామడ్గు పాల్గొన్నారు. వీరితో పాటు, అమెరికాలోని పలు తెలుగు సంఘాల నాయకులు పాల్గొన్నారు. చివరగా డా.కరుణాకర్ ఆసిరెడ్డి, డల్లాస్ లో జరుగనున్న మెగా కన్వెన్షన్ కి రావాల్సిందిగా అందరిని ఆహ్వానించారు.

మరిన్ని వార్తలు