దిల్‌ రాజుకు నాగిరెడ్డి స్మారక పురస్కారం

7 Apr, 2018 11:19 IST|Sakshi
నాగిరెడ్డి కుమారులు వెంకటరామి రెడ్డి, కోడలు భారతి రెడ్డి చేతుల మీదుగా దిల్‌ రాజుకు అవార్డు ప్రదానం

నాగిరెడ్డి స్మారక పురస్కారం అందుకున్న దిల్‌ రాజు

దుబాయ్‌: విజయా ప్రొడక్షన్స్‌ వ్యవస్థాపకులు స్వర్గీయ బి.నాగిరెడ్డి స్మారకార్థం ప్రతియేటా నిర్వహించే ‘నాగిరెడ్డి స్మారక పురస్కార ప్రదానోత్సవం’ దుబాయ్‌లో ఘనంగా జరిగింది. గత ఆరేళ్లుగా ఈ అవార్డును తెలుగు చలనచిత్ర రంగంలో ఉత్తమ చిత్రంగా నిలిచిన సినిమాకు అందజేస్తున్నారు. 2017 ఏడాదికిగాను ‘ఫిదా’ సినిమాని ఈ అవార్డుకు ఎంపిక చేశారు. దుబాయ్‌లోని ఇండియన్‌ కాన్సొలేట్‌ ఆడిటోరియంలో భారతీయ దౌత్యవేత్త సుమతీ వాసుదేవన్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఫిదా సినిమా నిర్మాత దిల్‌ రాజుకు నాగిరెడ్డి స్మారక పురస్కారంతో పాటు 1.5 లక్షల రూపాయల నగదు అందజేశారు.

విదేశీ గడ్డపై ఈ కార్యక్రమాన్ని తొలిసారిగా నిర్వహిస్తున్నామని ఇకపై ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తామని విజయా అధినేతలు వెల్లడించారు. కాగా, పురస్కార గ్రహీత దిల్‌ రాజు మాట్లాడుతూ.. ఇటువంటి పురస్కారం అందుకోవడం నా అదృష్టం, ఇంత గొప్ప అవార్డును అందుకోవడానికి ఏ దేశానికైనా వెళతానన్నారు. నాగిరెడ్డి కుమారులు వెంకటరామి రెడ్డి, కోడలు భారతి రెడ్డి ( విజయా ఆస్పత్రుల అధినేత్రి) పర్యవేక్షణలో.. గీతా రమేశ్‌, రమేశ్‌ బాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సుధా పల్లెం వ్యాఖ్యాతగా వ్యవహరించారు. 

నాగిరెడ్డి సినిమా పాటలు..
సంగీత దర్శకులు మాదవపెద్ది సురేశ్చంద్ర వాద్య, గాయక బృందం విజయా సినిమాల పాటలతో సభికులను ఉర్రూతలూగించారు. కార్యక్రమంలో అబుదాబికి చెందిన ఆదిభట్ల కామేశ్వర శర్మ, సునీతా లక్ష్మీ నారాయణ, ఉమా పద్మనాభం, స్వప్నికా శ్రీనివాస్‌, విశాలా మధు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు