లండన్‌లో ఘనంగా 'టాక్  బోనాల జాతర'

18 Jul, 2018 14:39 IST|Sakshi

లండన్ : తెలంగాణ అసోసియేషన్  ఆఫ్ యునైటెడ్ కింగ్‌డమ్‌(టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు స్థానిక ఎంపీలు వీరేంద్ర శర్మ, సీమ మల్హోత్రా, ఫస్ట్ సెక్రటరీ అఫ్ ఇండియన్ హైకమిషన్ అనిమా భరద్వాజ్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. లష్కర్ బోనాలకు ఏ మాత్రం తీసిపోకుండా స్వదేశంలో జరుపుకున్నట్టే అన్ని సంప్రదాయాలను పాటిస్తూ పూజలు నిర్వహించి, లండన్ వీధుల్లో తొట్టెల ఊరేగింపు నిర్వహించారు. బోనాల ఊరేగింపు తరువాత ఏర్పాటు చేసిన  కార్యక్రమాన్ని ముఖ్య అతిథులతో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సంస్థ ఉపాధ్యక్షురాలు స్వాతి బుడగం స్వాగతోపన్యాసం చేయగా, కార్యదర్శి రవి రేతినేని కార్యక్రమానికి వక్తగా వ్యవహరించారు. ఈ  వేడుకలకు యూకే నలుమూలల నుండి సుమారు 800మందికి  పైగా ప్రవాసులు హాజరయ్యారు.

 
భారత సంతతికి చెందిన స్థానిక ఎంపీ వీరేంద్ర శర్మ మాట్లాడుతూ.. యూకేలో నివసిస్తున్న తెలంగాణ ఎన్నారైలంతా సమాజ సేవలో ఎంతో క్రియాశీలకంగా పాల్గొంటారని, వీరి స్ఫూర్తి చాలా గొప్పదని తెలిపారు. స్థానిక ఎంపీ సీమా మల్హోత్రా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర పండుగ "బోనాల" వేడుకల్ని ఎంతో ఘనంగా నిర్వహించడమే కాకుండా, సంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించి, ముఖ్యంగా లండన్ వీధుల్లో నిర్వహించిన తొట్టెల ఊరేగింపు లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అమ్మవారికి బోనం సమర్పించడానికి పెద్ద ఎత్తున మహిళలు బోనం నెత్తిన ఎత్తుకొని లండన్ వీధుల్లో రావడం చూస్తుంటే, ఒక మహిళగా ఎంతో గర్వంగా అనిపించిందని, తెలంగాణ సంస్కృతిని ప్రతి ఒక్కరికి తెలిసేలా టాక్ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు ఎందరికో ఆదర్శంగా ఉన్నాయని తెలిపారు. ఇండియన్ హై కమీషన్ ప్రతినిధి అనిమా భరద్వాజ్ మాట్లాడుతూ బోనాలు వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, తెలంగాణా సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్తున్న తీరుని  ప్రశంసించారు. టాక్ సంస్థ ఇటు జాతీయ పండుగలు రాష్ట్ర పండుగలు ఎంతో ఘనంగా నిర్వహిస్తు భారత జాతి గౌరవాన్ని విదేశీ గడ్డ పై ముందుకు తీసుకెళ్తూ ఎందరికో స్ఫూర్తినిస్తుందని తెలిపారు.

సంస్థ అద్యక్షురాలు  పవిత్ర రెడ్డి కంది మాట్లాడుతూ.. టాక్ సంస్థ ద్వారా జరుపుతున్న బోనాల వేడుకలకు విచ్చేసిన అతిథులకు, స్థానిక ప్రవాసులకు కృతఙ్ఞతలు తెలిపారు. టాక్ చేస్తున్న కార్యక్రమాల గురించి అలాగే భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాల గురించి సభకు వివరించారు.  టాక్ సంస్థని, అలాగే బోనాల జాతర వేడుకల పోస్టర్ ఆవిష్కరించడమే కాకుండా అన్ని సందర్భాల్లో సూచనలు సలహాలు ఇస్తూ ముందుకు నడిపిస్తున్న నిజామాబాదు ఎంపీ కవితకి కృతఙ్ఞతలు తెలిపారు.


తెలంగాణ ప్రజలందిరికీ టాక్  వ్యవస్థాపకుడు, ఎన్నారై టీఆర్‌ఎస్‌ మాజీ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. లండన్ లో తెలంగాణ రాష్ట్ర పండుగను ఇంత ఘనంగా నిర్వహించుకోవడం గర్వాంగా ఉందని, ఒక నాడు పండుగలంటే కేవలం సంక్రాంతి - ఉగాది మాత్రమేనని, ప్రవాస తెలంగాణ సంఘాలు ఏర్పడ్డాక బోనాలు - బతుకమ్మ వేడుకల్ని ప్రపంచవ్యాప్తంగా ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఎన్నారైలలో ఇంతటి స్ఫూర్తి నింపి, ముఖ్యంగా టాక్ సంస్థని ప్రోత్సహిస్తున్న ఎంపీ కవితకి కృతఙ్ఞతలు తెలిపారు. మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చినట్టు మనంతా కూడా ఒక రోజు చేనేత దుస్తులు ధరించి వారిని ప్రోత్సహించాలని కోరారు.

 
ప్రముఖ నృత్య కళాకారిణి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ గ్రహీత,  రాగసుధా వింజమూరి చేసిన మహేశ్వరి మహా కాళీ నృత్యం, అలాగే  రాగసుధా పర్యవేక్షణలో తెలంగాణలో మాత్రమే ప్రాముఖ్యత కలిగిన  మథుర, కోయా లంబడా సంప్రదాయ నృత్యాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బోనం చేసి వేడుకల్లో పాల్గొన్న మహిళలందరిని ప్రత్యేకంగా సత్కరించి, బహుమతులందజేశారు. సంప్రదాయ తెలంగాణా వంటకాలతో పండగ భోజనం సొంత ఇంటిని తలిపించిందని హాజరైన వారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ఎంపీ వీరేంద్ర శర్మ, ఎంపీ సీమా మల్హోత్రా, ఇండియన్ హై కమీషన్ ప్రతినిధి అనిమా భరద్వాజ్లని ఘనంగా సన్మానించి, జ్ఞాపికను అందజేశారు.

అలాగే సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని సంస్థ ఎగ్జిక్యూటివ్ టీం జ్ఞాపికలతో ప్రశంసించారు. టాక్ సభ్యులు అశోక్ దూసరి, నవీన్ రెడ్డి ,రత్నాకర్ కడుదుల, సేరు సంజయ్, సుప్రజ పులుసు, విక్రమ్ రెడ్డి రేకుల, వెంకట్ రెడ్డి దొంతుల, శ్రీకాంత్ పెద్దిరాజు, శ్రీకాంత్ జిల్లా ఆధ్వర్యంలో జరిగిన బోనాల జాతర ఇంతటివిజయం సాధించడం సంతోషంగా ఉందని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం, అధ్యక్షురాలు పవిత్ర రెడ్డి కంది, ఎన్‌ఆర్‌ఐ టీఆర్‌ఎస్‌ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి, టాక్ అడ్వైజరీ ఛైర్మన్ గోపాల్ మేకల, ఉపాధ్యక్షులు స్వాతి బుడగం, ప్రధాన కార్యదర్శి విక్రమ్ రెడ్డి రేకుల, జాతీయ కన్వీనర్ శ్రీకాంత్ పెద్దిరాజు, సభ్యులు, నవీన్ రెడ్డి, రత్నాకర్ కడుదుల , శ్రీధర్ రావు, శ్రీకాంత్ జెల్ల,  సత్య పింగిళి, సత్య చిలుముల, సత్యం కంది, హరి నవపేట్, శ్రీనివాస్ మేకల, సుమ దేవి, సుప్రజ, శుషుమ్న రెడ్డి, వీర ప్రవీణ్ కుమార్,  సురేష్ బుడగం, వెంకట్ రెడ్డి, వేణు రెడ్డి నక్కిరెడ్డి, ప్రియాంక, క్రాంతి, మమతా జక్కి, శ్రీనివాస్, భరత్, రాజేష్ వాకా, వెంకీ, రవికిరణ్, గణేష్, హరి, హరిదీప్, మధుసూదన్ రెడ్డి, మల్ రెడ్డి, మట్టా రెడ్డి, రాజేష్ వర్మ, రాకేష్ పటేల్, రంజిత్, రవి ప్రదీప్, రవి రతినేని, నరేందర్, నవీన్ భువనగిరి, నవీన్ మాది రెడ్డి తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు.

మరిన్ని వార్తలు