బుద్దగయలోని పరమ పవిత్రమైన మహాబోధి దేవాలయంలో పేలుడు ఘటనను బ్యాంకాక్లోని బౌద్దు భిక్షవులు ముక్త కంఠంతో ఖండించారు. ఈ ఘటనను నిరసిస్తూ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన వందలాది మంది బౌద్ద బిక్షువులు థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లో బుధవారం ర్యాలీ నిర్వహించారు.
అనంతరం బ్యాంకాక్లోని ఐక్యరాజ్య సమితి కార్యాలయం, భారత దౌత్యకార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. బౌద్దులు అత్యంత పవిత్రంగా భావించే మహాబోధి దేవాలయం వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని వారు ఆ కార్యాలయ ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు. ప్రపంచంలోని బౌద్ద భిక్షువులు మహాబోధి దేవాలయాన్ని అత్యంత ఆరాధ్యమైన స్థలంగా కొలుస్తారని వరల్డ్ యూత్ బుద్దిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రొనచాయ్ పిన్యాపాంగ్ తెలిపారు.
ఆ దేవాలయంలో బాంబు పేలుళ్ల ఘటన వార్త వినగానే షాక్కు గురయ్యానని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఏటా వందలాది మంది థాయ్లాండ్ వాసులు మహాబోధి దేవాలయన్ని సందర్శిస్తారని ఆయన గుర్తు చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన భారత్కు సూచించారు. అలాగే బాంబు దాడి వల్ల ఆలయం పాక్షికంగా దెబ్బతింది.
ఈ నేపథ్యంలో ఆలయ పునరుద్దరణ చర్యలు వేగవంతం చేయాలని కొరారు. థాయ్లాండ్లో అత్యధికులు బుద్దిడిని ఆరాధిస్తారన్న సంగతి తెలిసిందే. గత ఆదివారం బీహార్లోని బుద్దగయాలోని మహాబోధి దేవాలయంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో ఇద్దరు బౌద్ద భిక్షువులు గాయపడ్డారు. అయితే ఆ పేలుళ్లకు బాధ్యులు తమేనంటూ ఇండియన్ ముజాహిదీన్ అనే తీవ్రవాద సంస్థ ప్రకటించింది.