గర్బిణి ప్రాణాపాయ స్థితిలో ఉంటే గర్భస్రావం చేసేందుకు అనుమతించే చట్టానికి ఐర్లాండ్లోని చట్టసభ సభ్యుల నుంచి మద్దతు లభించింది. గర్భస్రావ చట్టంలో మార్పులు చేర్పులపై ఐర్లాండ్ చట్టసభలో శుక్రవారం తెల్లవారుజాము వరకు సుధీర్ఘ చర్చ జరిగింది. గర్భస్రావానికి అనుమతించే చట్టానికి అనుకూలంగా 127 మంది సభ్యులు ఓటు వేశారు. మరో 31 మంది సభ్యులు వ్యతిరేకించారు. దాంతో ఐర్లాండ్ ప్రధాని ఎండ కెన్నీనేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం దీన్ని చట్టం చేయనుంది.
దీంతో క్యాథలిక్ దేశమైన ఐర్లాండ్లో త్వరలో ఆ చట్టం అమలుకానుంది. అయితే ఈ చర్చ కార్యక్రమంలో గర్భస్రావ చట్టంలో దాదాపు 165 సవరణలు జరిగాయి. ఈ చట్టం అమల్లోకి వస్తే గర్భంతో ఉన్న మహిళ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారితే దేశంలోని ఆసుపత్రి సిబ్బంది తప్పక గర్భస్రావం చేయవలసి ఉంటుంది.
భారతీయ దంత వైద్యురాలు సవిత హలపనవర్ తీవ్ర అనారోగ్యంతో ఐర్లాండ్లోని గాల్వే యూనివర్శిటీ ఆసుపత్రిలో చేరింది. ఆమె అప్పటికి17 వారాల గర్భిణీ. అయితే ఆమెకు తీవ్ర రక్తస్రావం జరుగుతుంది. ఈనేపథ్యంలో గర్భస్రావం చేయాలని సవిత, ఆమె భర్త ప్రవీణ్ ఆసుపత్రి వైద్యులను కొరారు. గర్భంలోని శిశువు శ్వాస తీసుకుంటున్నాడు. క్యాథలిక్ దేశమైన ఐర్లాండ్లో గర్భస్రావానికి అనుమతి లేదని ఆసుపత్రి వైద్యులు ఆమెకు గర్భస్రావం చేసేందుకు నిరాకరించారు.
దీంతో ఆమె గాల్వే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. దీంతో స్థానికంగానే కాకుండా భారత్, ఇతర దేశాలు తమ నిరసనలు వ్యక్తం చేశాయి. దాంతో సవిత మరణంపై ఐర్లాండ్ ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ విచారణ చేపట్టి పలు సూచనలతో కూడిన నివేదికను ఐర్లాండ్ ప్రభుత్వానికి అందించింది. అయితే గర్భస్రావ చట్టంలో మార్పులపై క్యాథలిక్ దేశమైన ఐర్లాండ్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దాంతో ప్రభుత్వం చట్ట సభ్యుల మధ్య ఏకాభిప్రాయం సాధించించే దిశగా చర్యలు చేపట్టింది. దాంతో గర్భస్రావ చట్టంలో మార్పులకు సభ్యులు శుక్రవారం జరిగిన చర్చల్లో అంగీకరించారు.