చికాగోలో సీఏఏ పల్లెసంబరాలు

15 Jan, 2019 13:21 IST|Sakshi

చికాగో : చికాగో ఆంధ్ర సంఘం(సీఏఏ) ఆధ్వర్యంలో ఘనంగా “పల్లె సంబరాలు”  కార్యక్రమం జరిగింది. ఎడతెరిపి లేకుండా పడుతున్న హిమపాతం, చలిగాలులు, రహదారులపై పేరుకుపోయిన మంచు, నడవటానికి కూడా ఇబ్బందిగా ఉన్నా లెక్కచేయకుండా చికాగో పరిసర పట్టణాలన్నిటి నుంచీ 1000 మందికిపైగా తెలుగువారు తరలివచ్చి, కార్యక్రమానికి శోభతెచ్చారు. తెలుగువారందరిని ఒక్క చోటికి తెచ్చి తెలుగు పల్లెల జీవనవిధానాన్ని ఒక వేడుకలా జరుపుకోవాలన్న చికాగో తెలుగు ఆడుపడుచుల సంకల్పానికి ఇవేవీ అడ్డుకాలేకపోయాయి. 

ఈ కార్యక్రమం దీప ప్రజ్వలన, ప్రార్ధనా గీతం, చిన్న పిల్లలకు భోగిపండ్లు పోయటం, వినాయక స్థుతితో ప్రారంభమైంది. జానకి ఆనందవల్లి నాయర్ విద్యార్ధులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం “దేవీస్థుతి రాగమాలిక”,, అపర్ణ ప్రశాంత్ విద్యార్ధుల బృందం ప్రదర్శించిన “జతిస్వరం” లను ప్రేక్షకులు కరతాళధ్వనులతో ప్రశంసించారు. చిన్నారులు నర్తించిన అనేక సినీ గీత నృత్యాలు అందరినీ అలరించాయి. శిల్ప పైడిమర్రి సమన్వయించిన మహానటి పాటల నృత్యాలు అందరినీ మెప్పించాయి.

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రదర్శించిన అనేక నృత్యగీతాలు ప్రేక్షకులను కూడా తమతోపాటు నర్తించేలా చేశాయి. జ్యోతి వంగర నృత్యదర్శకత్వంలో మూడు రోజుల సంక్రాంతి వేడుకలను ప్రతిబింబిస్తూ 60మందికి పైగా పాల్గొన్న సంక్రాంతి రూపకం 20 నిమిషాలపాటు ప్రేక్షకులను సమ్మోహనపరచి మెప్పించింది. సాహితి ఆదిమూలం, రామకృష్ణ తాడేపల్లి, సమత పెద్దమారు, పావని కొత్తపల్లి సాంస్కృతిక కార్యక్రమాలను, వేదిక నిర్వహణను చాలా చక్కగా సమర్ధవంతంగా చేసి అందరి మన్ననలూ పొందారు. మాలతి దామరాజు, మణి తెల్లాప్రగడ, సుజాత అప్పలనేని, వాణి దిట్టకవి వారికి సలహాలు, సూచనలు అందిస్తూ అన్నిటా తోడుగా నిలిచారు.


శ్రీనివాసమూర్తి పద్యాల రూపొందించిన ఎడ్లబండి, పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా చేసిన అలంకరణలు, ద్వారం, ముగ్గులు, గాలిపటాలు, అందరికీ ఒక చక్కని అనుభూతినిచ్చాయి, ఫోటోలు వీడియోల రూపంలో గుర్తుంచుకొనేలా మిగిలాయి. శ్రీచైత్య పొనిపిరెడ్డి నాయకత్వంలో దాదాపు 20మంది ఆడపడుచులు ఉత్సాహంగా వేదికపై చేసిన అలంకరణలు, జయశ్రీ సోమిశెట్టి, భార్గవి నెట్టెం చిత్రించిన వేదిక నేపధ్య చిత్రాలు, శ్వేత కొత్తపల్లి, శైలజ సప్ప కూర్చిన  సంక్రాంతి బొమ్మలకొలువు ప్రత్యేక ఆకర్షణలుగా అందరి మెప్పును పొందాయి. సమత పెద్దమారు చేసిన దీపవనితల అలంకరణ మరో ప్రత్యేక ఆకర్షణై విశిష్టంగా నిలిచింది.

శ్రీశైలేశ్ మద్ది, శ్రీనివాసమూర్తి పద్యాల రూపొందించిన లోగోలు, బ్యానర్లు, ప్రచార కరపత్రాలు, కార్యక్రమ వివరాల కరపత్రం కనులవిందుగా ఉండి అందరి ప్రశంసలనూ పొందాయి. వారే రూపొందించి ముద్రించిన 2019 తెలుగు క్యాలెండర్ అత్యంత ఆకర్షణీయంగా ఏడాది పొడవునా ఉపయోగించుకునేవిధంగా నిలిచింది. కార్యక్రమ నిర్వహణను కిరణ్మయి మట్టే, శైలజ చెరువు, సుందర్ దిట్టకవి సమయపాలన తప్పకుండా నిర్వహించారు.

చైర్మన్ దినకర్ కారుమూరి చికాగో ఆంధ్ర సంఘపు పూర్వ నాయకత్వాన్ని సత్కరించారు. సంఘ అధ్యక్షులు అప్పలనేని పద్మారావు మాట్లాడుతూ ఈ ఏడాదంతా నిర్వహించనున్న కార్యక్రమాలను వివరించి, సంఘ సభ్యులకు, స్పాన్సర్లకు, విచ్చేసిన గౌరవ అతిధులకు, పెద్దలకు, అన్ని బాధ్యతలను స్వఛ్ఛందంగా తీసుకుని చక్కగా నిర్వహించిన కార్యకర్తలకు తమ కృతజ్ఞతలను తెలియజేశారు. సంఘ ఉపాధ్యక్షులు డాక్టర్ భార్గవి నెట్టెం అన్నిచోట్లా తామేవుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. సంఘ సహ వ్యవస్థాపకులు శ్రీనివాస్ పెదమల్లు, ప్రసాద్ నెట్టెం, సీనియర్ డైరెక్టర్ శ్యామ పప్పు అతిథి స్వాగత సత్కారాలను నిర్వహించారు. సంఘ యువ డైరెక్టర్లు మైత్రి అద్దంకి, శృతి మోత్కూర్, నిఖిల్ దిట్టకవి యవత కోసం తమ ప్రణాళికలు వివరించారు. 

ఈ కార్యక్రమానికి అవసరమైన సాంకేతిక సంపత్తిని, సహకారాన్ని మణి తెల్లాప్రగడ, పద్మాకర్ దామరాజు, కిరణ్ ఆదిమూలం, రామకృష్ణ తాడేపల్లి, శ్రీ శైలేశ్ మద్ది, సంధ్య అప్పలనేని సమకూర్చారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సురేశ్ శనక్కాయల, అనురాధ గంపల, కిరణ్మయి వంకాయలపాటి, శ్రీకృష్ణ మతుకుమల్లి, నీలిమ బొడ్డు, శ్రీనివాస్ ధూళిపాళ్ళ, రమేశ్ నెక్కంటి సమర్ధవంతంగా నిర్వహించారు.

మరిన్ని వార్తలు