చికాగోలో ఘనంగా 'కళా ఉత్సవ్‌' వేడుకలు

1 Aug, 2018 11:47 IST|Sakshi

చికాగో : కాన్సులేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో 'కళా ఉత్సవ్' ఐదో సాంస్కృతిక వార్షికోత్సవ వేడుకలు చికాగోలో ఘనంగా జరిగాయి.  205 ఈస్ట్‌ రాన్‌డాల్ఫ్‌ వీధిలోని హారిస్‌ థియేటర్‌లో భారతీయ వారసత్వ కళలు, సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా కళా ఉత్సవ్‌ కార్యక్రమం జరిగింది. అమెరికాలోని వివిధ ప్రాంతాల్లోని డ్యాన్స్‌ స్కూల్‌లకు చెందిన భారతీయ కళాకారులు తమ ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ ఏడాది 'కుల్‌ జా సిమ్‌ సిమ్‌' థీమ్‌తో కళా ఉత్సవ్‌ కార్యక్రమం జరిగింది. ముఖ్యంగా మానవత్వ విలువలపై దృష్టిసారించారు. నిజాయితీ, ధైర్యం, నిజం, ప్రేమ, క్షమాగుణం, అధికారం, శాంతి, ఆనందం, గౌరవం, న్యాయం, సమానత్వం, స్వేచ్ఛల వంటి అంశాలు ఇతివృత్తంగా ప్రదర్శనలు ఇచ్చారు.


కాన్సుల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా నీతా భూషణ్‌ కళా ఉత్సవ్‌ 2018 ని ప్రారంభించారు. ఛైర్మన్‌ ఆఫ్‌ ఢిల్లీ కమిటీ ఆఫ్‌ చికాగో సిస్టర్‌ సిటీస్‌ ఇంటర్నేషనల్‌ స్మితా షా, ఛైర్మన్‌ ఆఫ్‌ రెడ్‌ బెర్రీ ఫౌండేషన్ దీపక్‌ కాంత్‌ వ్యాస్‌‌, ఎఫ్‌ఐఏ వ్యవస్థాపక అధ్యక్షులు రోహిత్‌ జోషి, యూనైటెడ్‌ సీనియర్‌ పరివార్‌, కీర్తి రావూరిలతో పలువురు ఈ వేడుకలకు హాజరయ్యారు.

హెల్త్‌ కన్సల్టింగ్‌ సంస్థ డైరెక్టర్‌ ఆఫ్‌ టెక్నాలజీ జిగర్‌ షా 2018 కళా ఉత్సవ్‌ కి కల్చరల్‌ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఆయనతో పాటూ డా. ప్రేరణ ఆర్య వేడుకల సన్నదంలో తన వంతు కృషి చేశారు. ఈ కార్యక్రమంలో దాదాపు వేయి మందికి పైగా ఎన్‌ఆర్‌ఐలతోపాటూ అమెరికన్‌లు పాల్గొన్నారు. మొత్తం 19 గ్రూపులు పాల్గొన్న పోటీల్లో నాట్యా డ్యాన్స్‌ థియేటర్‌ వారి త్రిశక్తి భరతనాట్యం గ్రూప్‌ మొదటి బహుమతి, కళాపద్మ డ్యాన్స్‌ అకాడమీ వారి నిర్భయ కాళీ గ్రూప్‌కు రెండో బహుమతి, ఐ రాధా గ్రూప్‌, రాస్‌ గార్బా గ్రూప్‌కు మూడో బహుమతి దక్కింది.

మరిన్ని వార్తలు