ప్రపంచశాంతికి గాంధేయ వాదమే చక్కటి పరిష్కారం

9 Oct, 2019 16:15 IST|Sakshi

ఎడిసన్ : మహాత్మగాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని న్యూజెర్సీ పట్టణంలోని సాయిదత్త పీఠంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధేయవాదం గురించి ప్రసంగించారు. ప్రపంచశాంతికి గాంధేయ వాదమే చక్కటి పరిష్కారమని న్యూజెర్సీ పబ్లిక్ యుటిలిటీస్ కమిషనర్ ఉపేంద్ర చివుకుల అన్నారు. ప్రపంచంలోని చాలా మంది నాయకులు ఆ మహాత్ముడిని ఆదర్శంగా తీసుకుని ఎన్నో అద్భుత విజయాలు సాధించారని ఆయన పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి గాంధీ జయంతిని ప్రపంచ శాంతి, అహింస దినోత్సవం గా ప్రకటించటం పై ఆయన హర్షం వ్యక్తం చేశారు. గాంధీ సిద్ధాంతాలను, ఆయన పాటించిన విలువలను జనంలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతో ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో న్యూజెర్సీ రాష్ట్రంలో మహాత్మా గాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని ప్రపంచ శాంతి, అహింస దినోత్సవంగా జరుపుకోవాలని అన్ని ప్రభుత్వ, ప్రయివేట్ సంస్థలకు, ధార్మిక సంస్థలకు అధికారిక ఉత్తర్వుల ప్రకటన జారీ చేశారు. కార్యక్రమంలో సాయిదత్త పీఠం నిర్వాహకులు రఘు శర్మ శంకరమంచి, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు