ప్రపంచ వ్యాప్తంగా మనబడి తెలుగు పరీక్షలు

14 May, 2018 18:03 IST|Sakshi

అమెరికా : సిలికానాంధ్ర మనబడి ద్వారా తెలుగు భాష సర్టిఫికెట్‌ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వారు ఈ నెల 12న పరీక్ష నిర్విహించారు. 2017-18 విద్యా సంవత్సారానికి గాను 1933 మంది విద్యార్థులు, ప్రపంచ వ్యాప్తంగా 58 కేంద్రాల్లో పరీక్షలు రాశారు. దీనిలో 1400 మంది జూనియర్‌, 533 మంది సీనియర్‌ సర్టిఫికెట్‌ కోసం పరీక్షలు రాశారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ అలేఖ్య పుంజల మాట్లాడుతూ.. ఎన్నో వేల మైళ్ల దూరంలో ఉన్నా పిల్లలకు తెలుగు భాష నేర్పించటానికి కృషి చేస్తున్న తల్లిదండ్రులను అభినందనలు తెలిపారు.

మనబడి అధ్యక్షుడు రాజు చమర్తి మాట్లాడుతూ.. గత 10 ఏళ్లుగా 35 వేల మందికి పైగా బాలబాలికలు మనబడి ద్వారా తెలుగు నేర్చుకున్నారని తెలిపారు. 250 కేంద్రాల ద్వారా తెలుగు నేర్పిస్తున్న మనబడి విద్యావిధానానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గుర్తింపుతో పాటు, అమెరికలోని అనేక స్కూల్‌ డిస్ట్రిక్ట్‌లలో ఫారిన్‌ లాంగ్వేజ్‌ క్రెడిట్‌ అర్హత కూడా ఉందన్నారు. అంతే కాకుండా వెస్టెన్‌ అసోసియేషన్ ఆఫ్ స్కూల్స్‌ అండ్‌ కాలేజ్స్‌ గుర్తింపు పొందిన ఏకైక తెలుగు నేర్పే విద్యావిధానం మనబడి మాత్రమేనని తెలిపారు.

అయితే ఈ పరీక్ష నిర్వహణను పర్యవేక్షించడానికి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ అలేఖ్య, పరీక్షల నియంత్రణాధికారి రెడ్డి శ్యామల, మండలి వెంకట కృష్ణారావు, అంతర్జాతీయ తెలుగు కేంద్ర సంచాలకులు శ్రీమతి గీతావాణి, ఆచార్య రమేశ్‌ భట్టు, ఆచార్య యెండ్లూరి సుధాకర్ రావు లు హైదరాబాద్‌ నుంచి వచ్చారు. 2018-19 సంవత్సరానికి గాను అడ్మిషన్స్‌ ప్రారంభమైనట్టు మనబడి ఉపాధ్యక్షుడు దీనబాబు కొండుభట్ల తెలిపారు. మనబడి వెబ్‌సైట్‌ ద్వారా ఆగస్టు 31లోగా నమోదు చేసుకోవాలని సూచించారు. పరీక్షల నిర్వాహణలో మనబడి సభ్యులు శాంతి కూచిబొట్ల, డాంజి తోటపల్లి, శరత్ వేట, శ్రీదేవి గంటి, భాస్కర్‌ రాయవరంతో పాటు మనబడి సమన్వయకర్తలు, ఉపాధ్యాయులు పాల్తొన్నారు. పరీక్షలను విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన వారందరిని భాషాసైనికులుగా అభివర్ణిస్తూ మనబడి ఉపాధ్యక్షుడు ధన్యవాదాలు తెలిపారు.

మరిన్ని వార్తలు