డల్లాస్ : అమెరికాలోని డల్లస్ ప్రాంతంలో మహాత్మగాంధీ మొమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సస్(ఎమ్జీఎమ్ఎన్టి) ఆధ్వర్యంలో 71వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 400 మంది భారతీయ అమెరికన్లు ఈ వేడుకకు ఎంతో ఉత్సాహంతో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్జీఎమ్ఎన్టిచైర్మన్ ప్రసాద్ తోటకూర, సెక్రటరీ రావు కాల్వల, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు అభిజిత్ రాయిల్కర్, శైలేష్ షా, తదితరులు హాజరయ్యారు. చైర్మన్ తోటకూర ప్రసాద్ ముందుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన గణతంత్ర దినోత్సవం ప్రాముఖ్యతను అక్కడున్న అందరికి వివరించారు. భారతదేశం గణతంత్రం సాధించి 70 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం నిజంగా గొప్ప విషయమని ప్రసాద్ తెలిపారు. కార్యక్రమం చివర్లో ఎమ్జీఎమ్ఎన్టి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ శైలేష్ షా మాట్లాడుతూ.. జనవరి 30న మహాత్మగాంధీ వర్ధంతి పురస్కరించుకొని జాతిపితకు ఘనమైన నివాళులు అర్పించేందుకు అందరూ రావాల్సిందిగా కోరారు.