మహాత్మా గాంధీకి ఎంపీ లింగయ్య యాదవ్ ఘన నివాళి

25 Sep, 2019 15:13 IST|Sakshi

డాలస్‌ : తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ డాలస్‌లోని మహాత్మా గాంధీ మెమోరియల్‌ను సందర్శించి పుష్పగుచ్చాలతో జాతిపితకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యడు లింగయ్య మాట్లాడుతూ 18 ఎకరాల సువిశాలమైన పార్కులో యావత్ ప్రపంచం గర్వించే విధంగా ఇంత భారీ మెమోరియల్‌ను నిర్మించడంలో కీలక పాత్ర వహించిన గాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర కృషిని అభినందించారు.

ప్రపంచ శాంతిదూత మహాత్మా గాంధీ ఎటువంటి ఆయుధాలు వాడకుండానే భారతదేశాన్ని బ్రిటిష్ దాస్య సుంఖలాలనుంచి విముక్తి చేసిన ఒక గొప్ప నేత అని, ఆయన ఆశయాలను, కార్యదీక్షను స్ఫూర్తిగా తీసుకుని  అమెరికాలో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, దక్షిణాఫ్రికాలో నెల్సన్ మండేలాలాంటి ఎంతో మంది నాయకులు ప్రపంచవ్యాప్తంగా శాంతియుతంగా ఉద్యమాలను జరిపి తమ జాతి సమస్యలను సాధించుకున్న తీరు ఎంతైనా అభినందనీయమని అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాలను ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న ఈ తరుణంలో డాలస్‌లో ఉన్న ఈ మహాత్మాగాంధీ మెమోరియల్‌ను సందర్శించి నివాళులర్పించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని అన్నారు. మహాత్మాగాంధీ మెమోరియల్ కార్యదర్శి రావు కల్వల, బోర్డు సభ్యులు, దాతలు, ఇర్వింగ్ పట్టణ అధికారుల కృషిని పార్లమెంట్ సభ్యులు లింగయ్య యాదవ్  ప్రశంసించారు. ఈ పర్యటనలో లింగయ్య యాదవ్ తో పాటు కొలబెర్రి సంస్థ వ్యవస్థాపకుడు ఆనంద్ దాసరి, డా. రమేష్ బండగొర్ల, బలరాం యాదవ్ కాసుల, నాగరాజు తాడిబోయిన, రామ్మోహన్ అమాస పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు