నాట్స్ బోర్డు ఛైర్మన్‌గా శ్రీధర్‌ అప్పసాని

13 Dec, 2019 19:25 IST|Sakshi

2020-21 కొత్త కార్యవర్గాన్ని ప్రకటించిన నాట్స్

వార్మినిస్టర్, పెన్సిల్వేనియా: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) కార్యనిర్వాహక బోర్డు నూతన (2020-21) ఏడాదికి గాను కొత్త నాయకత్వాన్ని ఎన్నుకుంది. నాట్స్ స్థాపనలో కీలక పాత్ర పోషించి, గత పదేళ్లుగా అత్యంత క్రియాశీలకంగా వ్యవహారిస్తున్న బోర్డు ప్రస్తుత వైస్ ఛైర్మన్ శ్రీధర్ అప్పసానిని చైర్మన్‌గా బోర్డు బాధ్యతలు కట్టబెట్టింది. నాట్స్‌ వైస్ ఛైర్మన్‌గా అరుణగంటి, సెక్రటరీగా ప్రశాంత్ పిన్నమనేని ఎన్నికయ్యారు.కొత్త నాయకత్వాన్ని ప్రోత్సాహించే క్రమంలో కొత్తగా పది మందిని బోర్డు సభ్యులను ఎగ్జిక్యూటివ్‌ కమిటీ తీసుకుంది. 

టెక్సాస్‌ చెందిన సునీల్ పాలేరు, డాలస్‌కు చెందిన కిషోర్ వీరగంధం, లాస్ ఏంజిల్స్‌కు చెందిన చందు నంగినేని, కృష్ణ కిషోర్ మల్లిన, చికాగోకు చెందిన శ్రీరామమూర్తి కొప్పాక, రవి శ్రీకాకుళం, ఓహియోకు చెందిన సురేశ్ పూదోట, పెన్సిల్వేనియాకు చెందిన హరినాథ్ బుంగతావులకు బోర్డు సభ్యులుగా కొనసాగనున్నారు. ఫిలడెల్పియాలో సమావేశమైన బోర్డు పలు కీలక అంశాలపై చర్చించింది. నాట్స్ బోర్డు కమిటీ సమావేశంలో నాట్స్ హెల్ప్‌లైన్ కార్యక్రమాలను మరింత విస్తృత్తం చేయాలని నిశ్చయించుకున్నారు.

2021లో న్యూజెర్సీలోని, న్యూ జెర్సీ కన్వెన్షన్ అండ్ ఎక్స్పోసిషన్ సెంటర్, 97 సన్‌ఫీల్డ్ అవెన్యూ, ఎడిసన్‌లో జరగనున్న అమెరికా తెలుగు సంబరాలకు ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికతో వ్యవహారించాలని బోర్డు నిర్ణయించింది. బోర్డు సమావేశం తర్వాత కొత్త నాయకత్వాన్ని నాట్స్ సభ్యులందరికీ పరిచయం చేసింది. హ్యుస్టన్, బోస్టన్, న్యూయార్క్, న్యూజెర్సీ, టెంపా, వర్జీనీయా, డాలస్, లాస్ ఏంజిల్స్, చికాగో, సెయింట్ లూయిస్, డెట్రాయిట్, సౌత్ కరోలినాకు చెందిన నాట్స్ నాయకులు, సభ్యులు కూడా ఈ పరిచయ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

“నాట్స్ ఛైర్మన్ గా నాకు వచ్చిన అవకాశాన్ని ఓ అదృష్టంగా భావించి  శాయశక్తులా  కృషి చేశాననే భావిస్తున్నాను’అని మాజీ చైర్మన్‌ శ్రీనివాస్ గుత్తికొండ అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ సంస్థ నాది అని పనిచేయడంతోనే నా పని మరింత సులువైందని అన్నారు. నాట్స్‌ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి మాట్లాడుతూ.. ప్రస్తుత బోర్డ్ సభ్యులందరి సలహాలతోనే ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినట్లు తెలిపారు. నూతన చైర్మన్ శ్రీధర్ అప్పసానితో కలిసి నాట్స్ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తుందని ఆయన ఆకాంక్షించారు. ఇండియా నుంచి గౌతు లచ్చన్న ఫౌండేషన్ (గ్లో)  సంస్థ వైస్ ఛైర్మన్ వెంకన్నచౌదరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దాదాపు 11 కోట్లతో తెలుగు నేలలో నాట్స్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిందని.. ఇదంతా నాట్స్ సభ్యుల దాతృత్వంతోనే జరిగిందని వెంకన్న చౌదరి అన్నారు. 

నాట్స్ నా బిడ్డ లాంటిది: శ్రీథర్ అప్పసాని
నాట్స్ సంస్థ నా బిడ్డ  లాంటిదని నాట్స్ ఛైర్మన్ శ్రీధర్ అప్పసాని అన్నారు. నాట్స్ పుట్టుక నుంచి ఎదుగుదల వరకు ప్రతి అడుగులో తాను కీలకమైన పాత్ర పోషించే అవకాశం రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. నాట్స్ ఎదిగే కొద్ది .. బిడ్డ ఎదుగుతున్నప్పుడు తండ్రికి కలిగే ఆనందమే తనకు కలుగుతుందని చెప్పారు. తన కుటుంబంతో ఎంత అనుబంధం  ఉందో.. అంతే అనుబంధం నాట్స్‌తో ఉందన్నారు. అందుకే నాట్స్ ప్రతి కార్యక్రమంలో కుటుంబం  కలిసి పాల్గొంటున్నానని శ్రీధర్ తెలిపారు. ఏ కార్యక్రమం తలపెట్టినా చిత్తశుద్ధితో చేయాలనే తపనే నన్ను నాట్స్ లో కీలక బాధ్యతలు చేపట్టేలా చేసిందన్నారు. నాట్స్ ప్రస్థానంలో తనను ప్రోత్సహించిన సభ్యులందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.

సన్మానాలు, బహుమతుల పంపిణి
నాట్స్ ఆహ్వానాన్ని మన్నించి భారత్‌ నుంచి వచ్చిన గౌతు లచ్చన్న ఫౌండేషన్ వైస్ ఛైర్మన్ వెంకన్నచౌదరికి, సేవా సంస్థ నిర్వాహకురాలు సరోజ సాగరంలను నాట్స్  డైరెక్టర్లు మధు కొర్రపాటి, మోహన కృష్ణ మన్నవలు సన్మానించారు. నాట్స్ వాలీబాల్ టోర్నమెంట్ విజేతలకు ఈ కార్యక్రమంలోనే శ్యాం నాళం, లక్ష్మి మోపర్తి తదితరులు బహుమతులు ప్రదానం చేశారు. ఇక కార్యక్రమలో భాగంగా నరేంద్ర, శిల్పారావ్ పాడిన పాటలతో, సెయింట్ లూయిస్ నుంచి  వచ్చిన యాంకర్ సాహిత్య సందడితో, హాస్య నటుడు, మిమిక్రి కళాకారుడు ఇమిటేషన్ రాజు చేసిన కామెడీ అందరినీ కడుపుబ్బా నవ్వించింది, 500 మందికి పైగా విచ్చేసిన ఈ కార్యక్రమానికి బావర్చి బిర్యానీ కమ్మని రుచికరమైన విందుభోజనం, పలు వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ మెనూ ఆహూతుల మన్ననలను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో నాట్స్ ఫిలడెల్ఫియా నాయకులు రామ్ కొమ్మనబోయిన కీలక పాత్ర పోషించారని నిర్వాహకులు తెలిపారు.

మరిన్ని వార్తలు