ప్రాణం నిలబెట్టేందుకు 'రన్ ఫర్ రామ్'

6 Aug, 2019 22:18 IST|Sakshi

ఫిలడెల్ఫియా : ఆపదలో ఉన్న​ తెలుగువారిని ఆదుకోవడంలో నాట్స్‌ ఎప్పుడూ ముందుంటుందనేది మరోసారి రుజువైంది. అమెరికాలో ఇటీవల ప్రమాదానికి గురై మృత్యువుతో పోరాడుతున్న కొయ్యలమూడి రామ్మూర్తి ప్రాణాలు నిలబెట్టేందుకు నాట్స్‌ తన వంతు సాయం చేయాలని ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో రామ్మూర్తి  వైద్య ఖర్చులను భరించేందుకు  అతని కుటుంబసభ్యులకు నాట్స్‌ హెల్ప్‌లైన్‌ ద్వారా విరాళాల సేకరణ చేయాలని  నిశ్చయించింది. ఇందుకోసం ఫిలడెల్ఫియాలోని స్థానిక తెలుగు సంఘం టీఏజీడీవీతో కలిసి నాట్స్ 'రన్ ఫర్ రామ్' పేరుతో  5కె రన్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమం ద్వారా వచ్చే మొత్తాన్ని రామ్మూర్తి కుటుంబానికి  నాట్స్‌ విరాళంగా అందించనుంది.

5కె రన్‌లో భాగంగా స్థానికంగా ఉన్న 120 మందికి పైగా తెలుగువారు  పెద్ద ఎత్తున పాల్గొని తమ సేవా గుణాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి ఫిలడెల్ఫియా తెలుగు అసోసియేషన్, ఆటా, నాటా, తానా, పలు సేవా సంస్థ ల ప్రతినిధులు మద్దతు తెలిపారు. నాట్స్ బోర్డు డిప్యూటీ చైర్మన్ శ్రీధర్ అప్పసాని, టీఏజీడీవీ ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి కిరణ్ కొత్తపల్లి, చైతన్య పెద్దు, రామ్ కొమ్మన బోయిన, వేణు సంఘాని తదితరులు హాజరై తమ వంతు సంఘీభావాన్ని ప్రకటించారు.

మరిన్ని వార్తలు