తక్షణమే ఏపీ డిమాండ్లను పరిశీలించాలి : నాట్స్

11 Feb, 2018 13:24 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో సరైన నిధులు కేటాయించకపోవడంపై నార్త్  అమెరికా తెలుగు సంఘం (నాట్స్‌) నిరసన వ్యక్తం చేసింది. విభజన సమయంలో ఇచ్చిన హామీల అమలుపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి యావత్ తెలుగు ప్రజలను మనోవేదనకు గురి చేస్తుందని నాట్స్ ఓ ప్రకటనలో తెలిపింది. ఆంధ్రప్రదేశ్ కు రైల్వేజోన్, రెవెన్యూ లోటు భర్తీ అంశాలపై కేంద్రం ఇంకా నాన్చుడు ధోరణి అవలంభించడాన్ని నాట్స్ ఖండించింది.

ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పిన కేంద్రం.. ఆ ప్యాకేజీ ప్రయోజనాలను ఇంతవరకు అందించకపోవడం ఎంతవరకు సమంజసం అని నాట్స్ బోర్డ్ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ ప్రశ్నించారు. ప్రపంచంలో తెలుగువారికి ఎక్కడ అన్యాయం జరిగినా నాట్స్ స్పందిస్తుందన్నారు. విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ను ఉదారంగా ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీల కోసం తెలంగాణ ఎంపీలు కూడా మద్దతు పలకడాన్ని ఆయన స్వాగతించారు. ఇలాంటి సమయాల్లో తెలుగువారు ఎక్కడుఉన్నా అంతా ఏకతాటిపైకి వచ్చి తమ వాణిని వినిపించాల్సిన అవసరముందన్నారు. తక్షణమే కేంద్రం ఏపీకి  కేంద్ర బడ్జెట్ లో నిధులు పెంచాలని..  ఏపీ చేస్తున్న డిమాండ్లను సానుకూలంగా  పరిశీలించి న్యాయం చేయాలని నాట్స్ ప్రెసిడెంట్ మోహన కృష్ణ మన్నవ, చైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ కోరారు.

మరిన్ని వార్తలు