ఆర్థిక ఒత్తిడులను జయించడంపై నాట్స్ వెబినార్

19 May, 2020 13:06 IST|Sakshi

సెయింట్ లూయిస్ : అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తుండటంతో దాని ప్రభావం తెలుగువారి ఆర్థిక పరిస్థితులపై కూడా ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో ఆర్థిక ఒత్తిడులను ఎలా జయించాలి..? ఆదాయంపై పడే కరోనా దెబ్బను ఎలా తట్టుకోవాలి..? ఇలాంటి అంశాలపై నాట్స్ వెబినార్ ద్వారా అవగాహన కల్పించింది. నాట్స్ సెయింట్ లూయిస్ విభాగం నిర్వహించిన ఈ వెబినార్‌లో మేరీల్యాండ్ వర్జీనియాకు చెందిన ఆర్థిక నిపుణులు టాక్స్ ఫైల్ అసిస్టెంట్ ప్రెసిడెంట్ రామకృష్ణ రాజు వేగేశ్న పాల్గొని తెలుగువారికి ఆర్థికాంశాలపై  అవగాహాన కల్పించారు. కరోనా విలయతాండవం చేస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో ఆర్థికాంశాలపై ఎలాంటి అప్రమత్తత అవసరం అనేది స్పష్టంగా వివరించారు. వెబినార్ ద్వారా దాదాపు 150 మంది అడిగిన ప్రశ్నలకు ఎంతో విలువైన సమాధానాలు ఇచ్చి అందరి సందేహాలు  తీర్చారు. నాట్స్ సభ్యులు ఈ వెబినార్ ద్వారా పాల్గొని ఆర్థిక అంశాలపై తమకున్న సందేహాలపై నివృత్తి చేసుకున్నారు. డాలస్ నాట్స్ విభాగం నుంచి శేఖర్ అన్నే, సెయింట్ లూయిస్ నాట్స్ విభాగం నుంచి నాగ శిష్టాలు ఈ వెబినార్‌కు వ్యాఖ్యతలుగా వ్యవహారించారు. నాట్స్ డైరెక్టర్ సుధీర్ అట్లూరి, నాట్స్ సర్వీస్ కో ఆర్డినేటర్ రమేశ్ బెల్లం, ర్యాలీ నుండి సతీష్ చిట్టినేని తదితరులు ఈ వెబినార్ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. కరోనా కష్టకాలంలో కీలకమైన ఆర్థికాంశాలపై అవగాహాన కల్పించినందుకు నాట్స్ కు వెబినార్ ద్వారా పాల్గొన్న తెలుగువారంతా అభినందించారు.

తన వద్దకు సలహాల కోసం వచ్చే నాట్స్ సభ్యులకు, టాక్స్ ఫైల్ అసిస్ట్ ఇంక్ ద్వారా ప్రత్యేకంగా 10 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు రామకృష రాజు వేగేశ్న తెలియజేశారు. సేవే గమ్యం అనే నినాదంతో నాట్స్ ఇలాంటి మరెన్నో భవిష్యత్‌ కార్యక్రమాల ద్వారా నిరూపిస్తుందని నాట్స్ ఛైర్మన్ శ్రీధర్ అప్పసాని, నాట్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు