‘పాఠశాలలు, ఆస్పత్రుల అభివృద్ధిలో మన పాత్ర పోషిద్దాం’

27 Nov, 2019 19:06 IST|Sakshi

ప్రవాసాంధ్రులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రత్నాకర్‌ పిలుపు

ఓహియో(అమెరికా): ఆంధ్రప్రదేశ్‌ విద్యావ్యవస్థలో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి తెస్తోన్న అద్భుతమైన మార్పులు విద్యార్థులకు ఎంతో మేలు చేయనున్నాయని ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్‌ తెలిపారు. ఆ యజ్ఞంలో తమ వంతు పాత్రగా ప్రవాసాంధ్రులు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఎన్నారైలు తమ వంతు పాత్ర పోషిస్తే.. మెరుగైన ప్రణాళికలో భాగస్వామ్యులు అవ్వాలని కోరారు. ‘విద్యామూలం ఇదం జగత్‌’, ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్న రెండు కార్యక్రమాలను తక్షణ కర్తవ్యంగా ఎంచుకున్నామని రత్నాకర్‌ వెల్లడించారు.

అభిమాన మిత్రుడికి ఆత్మీయ సత్కారం
అమెరికాలోని గ్రేటర్‌ క్లీవ్‌ లాండ్‌ ప్రాంతంలో తెలుగు సంస్కృతి, ప్రవాసాంధ్రుల అభ్యున్నతి కోసం కృషి చేస్తోన్న నార్త్ ఈస్ట్ ఒహాయో తెలుగు సంఘం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన సందర్భంగా పండుగాయల రత్నాకర్‌ను సత్కరించింది. ఓహియో క్లీన్‌ లాండ్‌లో సబర్బన్‌ ప్రాంతమైన మిడిల్‌ బర్గ్‌ పట్టణంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ.. అమెరికాలో స్థిరపడ్డ ప్రవాసాంధ్రుల కోసం రత్నాకర్‌ విశేష కృషి చేశారని గుర్తుచేశారు. ఆయన సేవలను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటైన వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం గుర్తిందన్నారు. అమెరికా, కెనడా దేశాలలో ప్రవాసాంధ్రులకు ఏ ఇబ్బంది ఉన్నా.. నేనున్నానంటూ ముందుకొచ్చే రత్నాకర్‌.. విద్యార్థి, ఉద్యోగ, వ్యాపార రంగంలోకి వచ్చిన ఎంతో మందికి తనవంతు సహకారం అందించారని చెప్పారు.


భవిష్యత్తులో రత్నాకర్‌ మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి, ప్రవాసాంధ్రులకు చేరువవుతారని నార్త్ ఈస్ట్ ఒహాయో తెలుగు సంఘం అధ్యక్షులు శ్రీకృష్ణ ప్రసాద్‌ మువ్వ, ఉపాధ్యక్షులు శివ భీమవరపు తెలిపారు. ఈ కార్యక్రమంలో నార్త్‌ ఈస్ట్‌ తెలుగు అసొసియేషన్‌ ట్రస్టీ గిరిరాజు అయ్యగారి, సంస్థ ఫౌండర్‌ డా.సీతారామరెడ్డి తొండపు, డా.లక్కిరెడ్డి మురళి, డా. ఛార్లెస్‌ తోడెటి, రాజశేఖర్‌ కల్లం, హరినాథ్‌ బత్తిని, సూర్య బుద్ధవరపు, యోగశ్వరరెడ్డి, కిషోర్‌ కుమార్‌, అర్జున్‌, పవన్‌ కుమార్‌, శశిధర్‌, రమేష్‌ పసుమర్తి పాల్గొన్నారు. అలాగే క్లీవ్‌ లాండ్‌లో వైఎస్సార్‌సీపీ సభ్యులు రవి పచిపాల, సలీం షేక్‌, వెంకట్‌ మట్ట, రామ్‌ మేడపాటి, రవి నూక, నరేష్‌ బొద్దు, అనిల్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు