ఐ సపోర్ట్ త్రీ కేపిటల్స్‌ అంటూ నినదించిన ఎన్నారైలు

13 Jan, 2020 13:15 IST|Sakshi

వాషింగ్టన్‌: ఆంధ్రపదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రతిపాదించిన అభివృద్ధి వికేంద్రీకరణ అంశంపై ‍అమెరికాలోని ప్రవాస ఆంధ్రులు స్పందించారు.  రాష్ట్ర సర్వతోభివృద్ధికి మూడు రాజధానులను ప్రతిపాదనలను సమర్థిస్తూ పలు ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించారు. కాలిఫోర్నియా, ఓహాయో నగరాల్లో ‘ఐ సపోర్ట్‌ త్రీ కేపిటల్స్‌’ అంటూ ప్రదర్శనలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో సమగ్రాభివృద్ధి జరగాలంటే మూడు రాజధానులు అవసరమని అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఆకాంక్షించారు. ప్రభుత్వం ప్రతిపాదించిన వికేంద్రీకరణ అంశానికి సంపూర్ణ మద్దతిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు కాలిఫోర్నియాలోని ఫ్రెమాంట్‌, లేక్‌ ఎలిజబెత్  పార్కులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎన్నారైలు సమావేశమై తమ మద్దతును ప్రకటించారు. ‘ఐ సపోర్ట్‌ త్రీ కేపిటల్స్‌’ పోస్టర్లు ప్రదర్శించారు.



ఈ సందర్భంగా ప్రముఖ ఎన్నారై చంద్రహాస్ పెద్దమల్లు, కేవీ రెడ్డి మాట్లాడుతూ.. ‘అభివృద్ధి అంతా ఒకేచోట వద్దు, మిగిలిన ప్రాంతాలను వెనక్కి నెట్టొద్దు. ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా అన్ని ప్రాంతాలు సమంగా అభివృద్ధి చెందాలంటే వికేంద్రీకరణ జరగాలి’ అని అభిప్రాయపడ్డారు. ప్రవీణ్ మునుకూరు, సురేంద్ర అబ్బవరం మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందినప్పుడే నిజమైన ఫలితాలు అందుతాయని, అలా కాకుండా ఒకే ప్రాంతాన్ని వృద్ధి చేస్తే, అది ప్రాంతీయ అసమానతలకు, విబేధాలకు దారితీస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కిరణ్ కూచిబొట్ల, హరి శీలం, కొండారెడ్డి, తిరుపతిరెడ్డి, దిలీప్, పోలిరెడ్డి, ఆనంద్, అమర్, త్రిలోక్, సహదేవ్, సుబ్రహ్మణ్యం, హరి తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా.. ఒహియోలోని క్లీవ్‌లాండ్‌ నగరంలో ఎన్నారైలు ‘ఐ సపోర్ట్‌ త్రీ కేపిటల్స్‌’ అని ప్రదర్శనలు చేశారు. సలీం షైక్, వెంకట్ సురేన్ మాట్లాడుతూ.. గత అనుభవాల దృష్ట్యా హైదరాబాద్‌లా ఒకే చోట కాకుండా రాష్ట్రమంతా అభివృద్ది ఫలాలు అందాలని ఆకాక్షించారు. అనిల్ రెడ్డి మూల మాట్లాడుతూ.. అందరూ బాగుండాలి.. అందులో మనం ఉండాలన్న వైఎస్‌ జగన్ ఆలోచన రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తుందని ఎన్నారైలు విశ్వసిస్తున్నట్టు చెప్పారు. ‘ఒకే రాజధాని వద్ద మూడు రాజధానులు ముద్దు’అని నినదించారు. కార్యక్రమంలో రవి నూక, రవి పాచిపళ్ళ, నాగేశ్వర రెడ్డి గజ్జల, హరినాథ్, సస్కధర్ మొందెడుల్లా, బదరి నాథ్ బుడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు