కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన ఎన్‌ఆర్‌ఐలు

3 May, 2018 16:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టును మంత్రి హరీష్ రావుతో కలిసి ఎన్‌ఆర్‌ఐ టీఆర్ఎస్‌ యూకే బృందం పరిశీలించింది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలో జరుగుతున్న‌ ఆరవ ప్యాకేజీ టన్నెల్‌, రిజర్వాయర్ల పనులను గురువారం ఎన్‌ఆర్‌ఐలు సందర్శించారు. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఎత్తిపోతల వ్యవస్థ పనిచేసే తీరును అక్కడి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్ని అడిగి తెలుసుకున్నారు. ప్రపంచంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమైన ప్రాజెక్టుగా నిర్మించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎన్‌ఆర్‌ఐలు కొనియాడారు. హరీష్‌రావు ఎంతో పట్టుదలతో ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తిచేసేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. ప్రతి రోజు రికార్డు స్థాయిలో పనులు చేస్తుండడం కాళేశ్వరం ప్రాజెక్టుకే దక్కిందన్నారు.

ప్రభుత్వం చేపడుతున్న ఈ సాగు నీటి, తాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణాలతో తెలంగాణ రాష్ట్రం అతి వేగంగా అభివృద్ధి పథానికి వెళుతుందని ఎన్‌ఆర్‌ఐలు పేర్కొన్నారు. లక్షల ఎకరాలకు సాగు నీరు అందనుండడంతో తెలంగాణ వేగంగా బంగారు తెలంగాణగా మారతుందని వారు అభిప్రాయపడ్డారు. ఈ బృందంలో ఎన్‌ఆర్‌ఐ టీఆర్ఎస్‌ యూకే అధ్యక్షులు అనిల్ కూర్మాచలం సభ్యులు అశోక్ దూసరి, నవీన్ రెడ్డి, శ్రీకాంత్ జెల్ల, మల్లేష్  పప్పుల, సత్య చిలుముల, స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకులు రాజేష్ ఉన్నారు. 

మరిన్ని వార్తలు