న్యూజెర్సీలో తెలంగాణా విమోచన దినోత్సవం

19 Sep, 2019 14:45 IST|Sakshi

న్యూజెర్సీ : ఓవర్ సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ ఆధ్వర్యంలో న్యూజెర్సీలోని నార్త్ బృన్స్విక్‌లోని మిర్చీ రెస్టారెంట్‌లో తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా విచ్చేసిన ప్రవాసులు తెలంగాణ స్వాతంత్ర ఉద్యమంలో పోరాడిన వీరులకు నివాళులు అర్పించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ప్రభుత్వం నిర్వహించాలని ఆఫ్-బీజేపీ ప్రతినిధులు డిమాండ్ చేశారు.

ఆఫ్-బీజేపీ జాతీయ యువ సహ కన్వీనర్ విలాస్ రెడ్డి జంబుల కార్యక్రమానికి విచ్చేసిన వారికి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్. కే.లక్ష్మణ్ ఆన్ లైన్ ద్వారా మాట్లాడుతూ అమెరికాలో ప్రవాస తెలంగాణ వారు ఆఫ్ బీజేపీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేయడాన్ని అభినందించారు. అమెరికా తెలుగు అసోసియేషన్ కార్యదర్శి  శరత్ వేముల మాట్లాడుతూ.. 'నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి పొందింది నిజం. సైనిక చర్య ద్వారా భారత దేశంలో విలీనం అయింది వాస్తవం. మరి ఈ నిజం, వాస్తవం అంగీకరించేందుకు ఎందుకు భయం? సెప్టెంబర్ 17 వచ్చినప్పుడల్లా ఎందుకీ నీలి నీడలు? సమైక్య రాష్ట్రంలో ఇదే తంతు. స్వరాష్ట్రంలోనూ ఇదే విధానమా? హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ భాగం కావడం అబద్దమా?. ఆర్యసమాజం, స్టేట్ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు చేపట్టిన పోరాటం తప్పా? రజాకార్లు, దేశ్ ముఖ్‌లు, జమీందార్ల అరాచకాలు నిజం కాదా?' అని ప్రశ్నించారు.

రజాకార్లకు(ఖాసీం రజ్వి) వారసులైన ఓవైసీ కుటుంబాన్ని తలకెత్తుకుని తెలంగాణ ఆత్మాభిమానాన్ని కించపరుస్తున్న కేసీఆర్ తీరుపై బీజేపీ నేత ఏనుగు లక్ష్మణ్ రెడ్డి మండిపడ్డారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినా, నిజాం పాలనలో ఉన్న తెలంగాణ మరో 13 నెలల పాటు చీకటి రోజులు గడిపిందని రఘువీర్ రెడ్డి అన్నారు. విజయ్ కుందూరు మాట్లాడుతూ.. నిజాంకు, రజాకార్లకు వ్యతిరేకంగా ఎందరో సాయుధ పోరాటాలు చేసి ప్రాణాలు అర్పించారని, అలాంటి అమరవీరుల త్యాగాలను కేసీఆర్‌ విస్మరించారని పేర్కొన్నారు. బంగారు తెలంగాణ అంటూ కేసీఆర్‌ తెలంగాణకు అసలు చరిత్రే లేకుండా చేస్తున్నారన్నారు. తెలంగాణ కీర్తిని, తెలంగాణ చరిత్రని ముందు తరాలకి తెలియచేస్తాం అని ప్రతిజ్ఞ చేయించారు శ్రీకాంత్ తుమ్మల. న్యూయార్క్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రవీందర్  రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పిన కేసీఆర్ అధికారంలోకి వచ్చాక సెప్టెంబర్ 17 వేడుకలను ఎందుకు నిర్వహించడం లేదు అని మండిపడ్డారు.
 
లింగాల సంతోష్ మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీని శక్తివంతంగా చేయడానికి కృషి చేస్తామన్నారు. డా.మోహన్ రెడ్డి, రవీందర్ పాడూరు, గోపి సముద్రాల మాట్లాడుతూ.. కేసీఆర్‌ ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకుండా, వీరుల త్యాగాలను మజ్లిస్‌ పార్టీకి తాకట్టు పెట్టిందని ఆరోపించారు. దీనిని తెలంగాణ ప్రజలు మరిచిపోరని, ఈ అవకాశవాద రాజకీయాలకు త్వరలోనే బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం 12వేల మందికి పైగా బలిదానాలు చేసుకుంటే.. 400 మంది మాత్రమే అని పేర్కొనడం బాధాకరమన్నారు. ఈరోజు నిజంగా అరుదైన రోజు.. హైదరాబాద్ విమోచన దినం, ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సెప్టెంబర్ 17వ తేదీనే వచ్చాయని వంశీ యంజాల, విజేందర్, ప్రకాష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మోదీ జన్మదిన సందర్భంగా బర్త్‌ డే కేక్ కట్ చేసి, జన్మ దిన శుభ కాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి  ఆఎఫ్ బీజేపీ జాతీయ అధ్యక్షులు కృష్ణ రెడ్డి ఏనుగుల, ఆఫ్‌ బీజేపీ జాతీయ యువ సహా కన్వీనర్ విలాస్ రెడ్డి జంబుల, ఆఫ్ బీజేపీ న్యూ జెర్సీ యువ కన్వీనర్  శ్రీకాంత్ తుమ్మల, డా.మోహన్ రెడ్డి, రవీందర్ పాడూరు, రఘువీర్ రెడ్డి, గోపి సముద్రాల, విజయ్ కుందూరు, లింగాల సంతోష్, వంశీ యంజాల, విజేందర్, ప్రకాష్, శరత్ వేముల, న్యూయార్క్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రవీందర్ రెడ్డి, ఏనుగు లక్ష్మణ్ రెడ్డి, అశ్విన్, ప్రదీప్ కట్ట, రామ్మోహన్ ఎల్లంపల్లి, ఇంకా గుజరాత్ నుండి పలువురు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు