చికాగో: తెలుగు కుటుంబంలో జన్మించిన, భారత సంతతికి చెందిన రామ్ విల్లివలంను ఇండో అమెరికన్ డెమోక్రాటిక్ ఆర్గనైజేషన్(ఐఏడీఓ) సన్మానించింది. చికాగో ఇల్లినాయిస్లోని అర్బన్ కన్వెన్లో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖలు హాజరయ్యారు. జనవరి5న ఇల్లినాయిస్ జనరల్ అసెంబ్లీలో 8వ స్టేట్ సెనెట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఇల్లినాయిస్ సెనెటర్గా విల్లివలం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.
సన్మాన కార్యక్రమంలో యూఎస్ కాంగ్రెస్ విమన్ జన్చకోవిస్కి, యూఎస్ కాంగ్రెస్మెన్ రాజా కృష్ణ మూర్తి, కుక్ కౌంటీ బోర్డు ప్రెసిడెంట్ టోనీ ప్రెక్వింకిల్, ఇల్లినాయిస్ స్టేట్ సెనెట్ ప్రెసిడెంట్ జాన్ కల్లర్టన్, మెట్రోపాలిటన్ వాటర్ రిక్లమేషన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ గ్రేటర్ చికాగో కమిషనర్ జొసినా మోరిటా, ఇల్లినాయిస్ స్టేట్ ప్రతినిధి జాన్ డీ అమికో, కరీనా విల్లా, చికాగో ఆల్డర్మన్ అమేయా పవార్, కమ్యూనిటీ లీడర్స్, కుటంబ సభ్యులు, మిత్రులతో పాటూ పలువురు స్థానికులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు విల్లివలంను అభినందనలతో ముంచెత్తారు. కనీసం వేతనం, గన్ కల్చర్ను అదుపు చేయడం, చిరు వ్యాపారస్థుల అభివృద్ధికి సహాయాన్ని అందించడం, వృద్ధులకు ఆసరాగా నిలవడం, మహిళలకు సమాన హక్కులు, ఎల్జీబీటీ హక్కుల కోసం మరింతకృషి చేయడంలాంటి విధివిధానాల రూపకల్పనలో ప్రతిభావంతుడైన సెనెటర్ విలివలంతో కలిసి పని చేయడానికి తామంతా ఎదురు చూస్తున్నామన్నారు. తన విజయంలో కీలకపాత్ర పోషించిన తల్లి ధరణి విల్లివిలం, భార్య ఎలిజబెత్ గ్రనాటో సోదరుడు డా.అరుణ్ కే. విల్లివిలం, సోదరి వీణలతోపాటూ కుటుంబ సభ్యులకు సెనెటర్ విల్లివిలం కృతజ్ఞతలు తెలిపారు. ఐఏడీఓ సహాయసహకారాలను కొనియాడారు.