డల్లాస్‌లో ఘనంగా 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

28 Jan, 2019 14:03 IST|Sakshi

డల్లాస్‌ : భారత 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అమెరికాలోని డల్లాస్‌లో ఘనంగా జరిగాయి. మహాత్మాగాంధీ మెమోరియల్‌ ఆఫ్‌ నార్త్‌ టెక్సాస్‌ (ఎమ్‌జీఎమ్‌ఎన్‌టీ) బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల ఆధ్వర్యంలో అమెరికాలోనే అతి పెద్ద గాంధీ స్మారకంగా గుర్తింపు పొందిన మహాత్మా గాంధీ మెమోరియల్‌ ప్లాజాలో ఈ వేడుకలు జరిగాయి. మువ్వన్నెల జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి డల్లాస్‌లోని భారతీయులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. వేడుకకు విచ్చేసిన ప్రతి ఒక్కరిని సంస్థ కార్యదర్శి కాల్వల రావు సాదరంగా ఆహ్వానించారు.

సంస్థ చైర్మన్‌ డా.తోటకూర ప్రసాద్‌ జెండాను ఎగురవేశారు. అనంతరం మాట్లాడిన ఆయన భారత రాజ్యాంగ విశిష్టత గురించి వివరించారు. స్వాతంత్ర్య సమరయోధుల సేవలను గుర్తుచేశారు. రాజ్యాంగాన్ని రూపోందించిన డాక్టర్‌ అంబేడ్కర్‌, జవహార్‌లాల్ నెహ్రూ, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, శ్యాం ప్రసాద్ ముఖర్జీలను గుర్తించుకోవాలన్నారు. వీరంతా మూడేళ్లపాటు ఎంతో కష్టపడి రాజ్యాంగాన్ని రూపోందించారని తెలిపారు. ఇప్పటికే ఎంతో అభివృద్ధి సాధించామని.. చేయాల్సింది ఇంకా ఉందని గుర్తుచేశారు. భారతీయ అమెరికన్లుగా రెండు దేశాల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.సంస్థ కోచైర్మన్‌ బీఎన్‌.రావు మాట్లాడుతూ.. స్వాతంత్రం కోసం మహాత్మా గాంధీ చేసిన కృషి మరవలేదన్నారు. 

వేడుకలను ముఖ్యఅతిథిగా ఇర్వింగ్‌ పట్టణ డిప్యూటీ మేయర్‌ ఆస్కార్‌ వార్డ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆస్కార్‌ వార్డు మాట్లాడుతూ..ఉన్నత సమాజ నిర్మాణంలో భారతీయులు చేస్తున్న కృషి మరువలేనిదన్నారు. ప్రత్యేక అతిథిగా విచ్చేసిన ఇర్వింగ్‌ కౌన్సిల్‌ సభ్యుడు ఆలన్‌ మేగర్‌ మాట్లాడుతూ.. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన భారత్‌, అతి పురాతన ప్రజాస్వామ్య దేశమైన అమెరికా కలిసి పనిచేయాల్సిన అవసరముందన్నారు. ఈ వేడుకల్లో ఎమ్‌జీఎమ్‌ఎన్‌టీ కోశాధికారి అభిజిత్‌ రాయ్‌కర్‌తో పాటు దాదాపు 150 మంది ప్రవాస భారతీయులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు