చికాగోలో ఘనంగా సంక్రాంతి, గణతంత్ర వేడుకలు

15 Feb, 2020 08:59 IST|Sakshi

చికాగో: చికాగో మహానగర తెలుగు సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి, గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.  చికాగోలోని హిందూ టెంపుల్‌ ఆడిటోరియంలో ఈ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 1న ఏర్పాటు చేశారు. టీఏజీసీ సంఘం అధ్యక్షులు ప్రవీణ్‌ వేములపల్లి, క్రాంతి వేములపల్లి, ప్రెసిడెంట్‌ ఎలెక్ట్‌, వెంకట్‌ గూనుగంటి, ముఖ్య కార్యదర్శి అంజిరెడ్డి కందిమళ్ల ఇతర ప్రముఖులు గణపతి ప్రార్థన, జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు రైతులు ప్రాముఖ్యతను, వారి కష్టాలను  తెలుగు సాంప్రదాయానికి ప్రతీకగా నిలిచే సంక్రాంతి పండుగ విశిష్టతను, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను, పర్యావరణ ప్రాముఖ్యతను చాటుతూ వివిధ నృత్య ప్రదర్శలతో వివరించారు. 

సంస్థ సాంస్కృతిక కార్యదర్శి వినీత ప్రొద్దుటూరి మాట్లాడుతూ.. 32 టీమ్స్‌తో 350 ప్రదర్శనకారులు ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారని, ప్రదర్శనకారులకు టీఏజీసీ తరుపున సర్టిఫికెట్స్, వినూత్నంగా పర్యావరణ ప్రాముఖ్యాన్ని తెలిపే విధంగా మొక్కలను టీం కో-ఆర్డినేటర్‌కు అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయటానికి రెండు నెలలుగా శ్రమించిన కల్చరల్ కో-చైర్‌పర్సన్స్‌ శిరీష మద్దూరి, మాధవి రాణి కొనకళ్ల, శిల్పలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

టీఏజీసీ అధ్యక్షులు ప్రవీణ్‌ వేములపల్లి మాట్లాడుతూ: రెండు చేతులు కలవనిదే చప్పట్లు మ్రోగవు, నలుగురు లేనిదే సభని అలంకరించలేము అలాగే కొన్ని కుటుంబాలు కలవనిదే ఒక పండుగ పూర్తికాదు.ఈ రోజు మన ఈ సంక్రాంతి పండుగ సంబరాలను వెయ్యి రేట్లు అద్భుతంగా, కనుల పండుగగా తీర్చిదిద్ది విజయవంతం చెయ్యటానికి సహాయ సహకారాలు అందించిన దాతలకు,కళాకారులకు, కళా అభిమానులకు, కళా పోషకులకు, కూర్పుకర్తలు, సమన్వయకర్తలు, కార్యకర్తలకు, కార్యవర్గ సభ్యులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, మీడియా మిత్రులకు ఆయన ధన్యవాదములు తెలిపారు. చివరగా ఈ కార్యక్రమాన్ని జాతీయ గీతం పాడి ముగించారు.

మరిన్ని వార్తలు