సింగపూర్ : సింగపూర్ తెలుగు సమాజం(ఎస్టీఎస్) ఆధ్వర్యంలో సింగపూర్లోని అవర్ టంపనీస్ హబ్లో బ్యాడ్మింటన్ పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 250 మందికిపైగా స్థానిక తెలుగు క్రీడాకారులు పాల్గొన్నారు. వీరిలో 140 మంది పురుషులు, 60 మంది మహిళలు, 50 మంది బాలబాలికలు ఉన్నారు. రెండు రోజులపాటూ నిర్వహించిన ఈ టోర్నమెంట్లో వివిధ విభాగాలు కలిపి 320 మ్యాచ్లు నిర్వహించి విజేతలను ప్రకటించారు.
సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి మాట్లాడుతూ ఈ ఉరుకుల, పరుగుల జీవితంలో క్రీడలు మన శక్తిని కొత్తపుంతలు తొక్కిస్తాయని, మనోరంజక సాధనాలుగా ఉంటాయన్నారు. స్థానిక తెలుగువారి
క్రీడాస్పూర్తిని ప్రశంసించారు. పోటీల అనంతరం స్పాన్సర్స్తో విజేతలకు బహుమతి ప్రధానం చేశారు. ఇంతమంది తెలుగువారు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొనడం పట్ల కార్యక్రమ నిర్వహణాధికారి మల్లిక్ పాలెపు హర్షం వ్యక్తం చేశారు. స్పాన్సర్స్కు, వాలంటీర్స్కు, కార్యవర్గ సభ్యులకు, ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషిచేసిన ప్రతి ఒక్కరికీ సమాజం కార్యదర్శి సత్య చిర్ల కృతజ్ఞతలు తెలిపారు.