నా కుమారుడి ఆచూకీ తెలపండి

2 May, 2019 06:48 IST|Sakshi

పంజగుట్ట: శ్రీకాకుళంలోని ఓ మారుమూల ప్రాంతంలో ఎలాంటి ఉపాధి లేక దుబాయికి వలస వెళ్లి ఓ యువకుడు కనిపించకుండా పోయాడు. తన కుమారుడి ఆచూకీ కనుక్కొవాలని ఆ తండ్రి భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాడు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బాధితుని తండ్రి కె. శ్రీనివాస్‌ రావు మాట్లాడుతూ.. శ్రీకాకుళం జిల్లా, వజ్రపు కొత్తూరు మండలం, చిన్నమూరహరిపురం గ్రామానికి చెందిన తాను వ్యవసాయ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నానని తెలిపారు. తనకు ముగ్గురుకు కుమారులు ఉండగా పెద్ద కుమారుడు కె. జగదీశ్వర్‌ రావు (23) ఐటీఐ పూర్తి చేసి ఉపాది నిమిత్తం  ఎమిరేట్స్‌  కంపెనీ తరపున అక్కడి అలీ–6 షిప్‌లో డీజీల్‌ మెకానిక్‌గా 2018 సెప్టెంబర్‌ 17న విధుల్లో  చేరాడని తెలిపారు.

ఈ ఏడాది మార్చి 7వ తేదీన జగదీశ్వర్‌ రావు తల్లి శ్యామల, తండ్రి శ్రీనివాస్‌తో ఫోన్‌లో మాట్లాడారని తెలిపారు. 10న అదే సంస్థలో పనిచేసే  శ్రీకాకుళం మాన్యమండలం బైరిసారంగపురం గ్రామానికి చెందిన దిలీప్‌ తమకు ఫోన్‌ చేసి మీకొడుకు  రెండు రోజులుగా కనిపించడం లేదని దుబాయి పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పాడు.  వారు వెతికినా కూడా ఎలాంటి ఫలితం లేదని తెలిపారని చెప్పాడు. ఇప్పటి వరకు కూడా దుబాయి పోలీసులు, సంస్థ నిర్వహకులు, షిప్‌ ఇన్‌చార్జిలు తమ కొడుకు గురించి ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వం చొరవ చూపి తన కొడుకు ఆచూకి తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గల్ఫ్‌ బాధితుల సంక్షేమ సంఘం అ«ధ్యక్షులు బసంత్‌ రెడ్డి, వజ్రపుకొత్తూరు ఎంపీపీ వసంత స్వామి, బాధితుడి మామ పోలయ్య పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు