టాంటెక్స్‌ ఆధ్యర్యంలో ఆన్‌లైన్‌ సాహిత్య సదస్సు

31 Mar, 2020 18:33 IST|Sakshi
రమణ రావు

ఆస్టిన్: ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) 152వ నెల తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు సంఘ అధ్యక్షులు కృష్ణారెడ్డి కోడూరు ఆధ్వర్యంలో డాలస్‌లో ఘనంగా నిర్వహించారు. ప్రతీ నెల నెలా జరిగే ఈ సాహిత్య సదస్సును కరోనా వైరస్ కారణంగా మొదటి సారిగా సోమవారం ఆన్‌లైన్‌లోలైన్‌లో నిర్వహించారు.  ప్రవాసంలో నిరాటంకంగా 152 నెలల పాటు ఉత్తమ సాహితీ వేత్తల నడుమ ఈ సాహిత్య సదస్సులు నిర్వహించటం టాంటెక్స్‌ విశేషం. ఇక ఈ సదస్సును ఆన్‌లైన్‌లో నిర్వహించినప్పటికీ డాలస్‌లోని భాషాభిమానులు, సాహితీ ప్రియులంతా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సదస్సును రఘుపతి రక్షకుడనీ ప్రార్థన గీతంతో ప్రారంభించారు.

ఇక ఈ సదస్సులో సాహితీ వేత్త నరసింహ రెడ్డి మాట్లాడుతూ.. సిరిసంపదల్లో భాగంగా కొంగుబంగారం, గోరోజనం, గోడచేర్పు, కుండోదరుడు(లంచం బాగా తినేవాళ్ళని),కూరగాయ కవిత, గొంతెమ్మ కోరిక, గోవచ్చం(ప్రత్యేక వ్యక్తిత్వం లేని వారు), గోవింద కొట్టడం, గౌతముడి గోవు లాంటి జాతీయాల నేపధ్యం గురించి వివరించారు. ఆ తర్వాత సథ్యం ఉపద్రష్ట చమత్కార కవిత్వం గురించి కూడా వివరించారు. ఈ కార్యక్రమంలో భాషాభిమాని లెనిన్ మాట్లాడుతూ.. ఆన్‌లైన్‌లో ఇలా సాహిత్య సదస్సును నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. సంస్కృతం అనగానే ఆధ్యాత్మిక సాహిత్యం, జ్యోతిష్యం మంత్రాలు, వేద సాహిత్యం అనుకుంటాం కాని సంస్కృతంలో ఎంత ఆధ్యాత్మిక సాహిత్యం ఉన్నదో లౌకిక సాహిత్యం, గణిత శాస్త్రాలు కూడా అంతే ఉన్నాయనిన్నారు. అంతేగాక సంస్కృతంలో విస్తారంగా బహు శాఖలు, విజ్ఞానం, శాస్త్రీయత ఇమిడి ఉన్నాయని చెప్పారు.

ప్రత్యేక ఆకర్షణగా లలితానంద్‌ కరోనా కవిత...
కరుణించు కరోనా..కాపాడు కరోనా
సరిహద్దులు చెరిపేసావు ..గుండెల్లో గుబులు కరోనా
నీకు మందేలేదట  ..ఎట్లా బతుకాలే. 
ఎం మాయ చేసావె..ప్రకృథి విక్తృతాయె
నీకు అందరూ సమానమాయె ....కరుణించు కరోనా..కాపాడు కరోనా.. కరోనా పేరు మీద ధిక్కారం పేరుతో లలితానంద్ కవిత చదివారు.

తెలుగు కథా పరిణామంపై రమణ రావు వివరణ
ఈ సదస్సుకు ముఖ్య అతిధిగా విచ్చేసిన ప్రముఖ సాహితి వేత్త రమణ రావు తెలుగు కథా పరిణామంపై ప్రసంగించారు. ‘తెలుగు కథా పరిణామం’ అనే అంశం మీద ఆయన మాట్లాడుతూ.. కథలో ఉన్న కథా ప్రయోజనం, శిల్పం, వస్తువు అనే మూడు భాగాలుంటాయని చెప్పారు. అలాగే 1879 లో తెలుగు లో మొదటి కథ మొదలైందని కాని 1910 లో గురజాడ రాసిన 'దిద్దుబాటూ అనే కథ ద్వారానే ఆధునికత కథ మొదలైందని చెప్పారు. అందుకనే గురజాడను ఆధునిక కవి అన్నారన్నారు. ప్రయోజనంలో సామాన్యక మార్పు ఉంటేనే దాన్ని ప్రామాణికంగా తీసుకుంటారని తెలిపారు. గురజాడ గారు వస్తు ప్రయోజనంలోనే కాకుండా శిల్పంలో కూడా సామాజిక మార్పుని తీసుకువచ్చారన్నారు. అలాగే కథలో వాడుక భాష ప్రాధాన్యతని వివరించారు. కాలక్రమంలో కథలోని వస్థువు ఎలా మారందనే విషయాన్ని గూర్చి వివరణ ఇచ్చారు. 1930-50 మధ్య కాలంలో, 1950 -70 మధ్య కాలంలో, 1970-90 మధ్య కాలంలో, 1990-2010 మధ్య కాలంలో కథా వస్తువు ఎలా మారిందో వివరించారు. ఇక చివరగా రమణరావు సతీమణి సుభద్ర కొమ్మలో కోయిలా కుహూ అంటదీ అనే లలిత గీతంతో కార్యక్రమాన్ని ముగించారు. 

కార్యక్రమం అనంతరం టాంటెక్స్‌ అధ్యక్షులు కృష్ణారెడ్డి కోడూరు మాట్లాడుతూ.. సాహిత్యం మీద ప్రేమ, అమ్మ భాష మీద మమకారంతో సదస్సులో పాల్గొని విజయవంతం చేసిన భాషాభిమానులకు, సాహితి ప్రియులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ముందు ముందు ప్రతి నెల నిర్వహించే తెలుగు వెన్నెల సాహిత్య సదస్సులకు అధిక సంఖ్యలో పాల్గొని భాషాభిమానాన్ని చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. ఇక పూర్వాధ్యక్షులు సుబ్రమణ్యం జొన్నలగడ్డ, చంద్ర కన్నెగంటి, రాయవరం భాస్కర్, సురేష్ కాజా, ప్రసాద్ తోటకూర,కిరణ్మయి గుంట, చిన సత్యం వీర్నపు, రవి పట్టిసం,శశికళా పట్టిసం,రాజా రెడ్డీ, పివి రమారావు, విష్ణు ప్రియ, జగదీశ్వరన్ పూదూరు తదితరులు రమణ రావుకు ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం తరుపున ధన్యవాదాలు తెలిపారు. 

మరిన్ని వార్తలు