లండన్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

7 Oct, 2019 15:24 IST|Sakshi

లండన్‌లో  తెలంగాణ ఎన్నారై ఫోరమ్ ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా సంబరాలు  ఘనంగా జరిగాయి. 3000 మందికి పైగా ప్రవాసులు ఈ బతుకమ్మ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేశారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ రాంచందర్‌ రావు హాజరయ్యారు. మొదటగా దుర్గా అమ్మవారి పూజతో ఈ వేడుకలు ప్రారంభించారు. ఇండియా నుండి ప్రత్యేకంగా తెచ్చిన జమ్మి చెట్టుకు పూజ నిర్వహించి అనంతరం బతుకమ్మ ఆట, కట్టే కోలాటం ఆడారు. సంప్రదాయక బతుకమ్మ ఆటనే ప్రోత్సహించి నూతన పోకడలకు, డీజేల జోలికి వెళ్లకుండా బతుకమ్మను నిర్వహించారు.

ఎమ్మెల్సీ  రాంచందర్ రావు మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు నిలవాలని భావిపౌరులకు సాంప్రదాయాలు, మాతృదేశం మూలాలు తెలిపే కార్యక్రమాలు నిర్వహిస్తున్న  ఎన్నారై  సంఘాలకు  అభినందనలు తెలిపారు. ప్రకృతిని పూజించే పండుగ చేసుకోవడం తెలంగాణ సంస్కృతికి చిహ్నం అని అన్నారు. ముఖ్య  అతిథిగా  విచ్చేసిన భారత రాయబారి కార్యాలయం ఉన్నతాధికారి మనమీత్ నరాంగ్  మాట్లాడుతూ దక్షిణ భారత అతిపెద్ద  సంస్కృతిక కార్యక్రమాన్ని చూస్తున్నానన్నారు. ఇండియా డే సంబరాల్లో తెలంగాణ సంఘం సేవలని కొనియాడారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన లండన్ ఎంపీ వీరేంద్ర శర్మ మాట్లాడుతూ భారతీయ సాంప్రదాయాలు కాపాడాల్సిన బాధ్యత ఎన్నారైల పైన ఉందని, 7 ఏళ్లుగా బతుకమ్మ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసినందుకు తెలంగాణకు ధన్యవాదాలు తెలిపారు.

అధ్యక్షుడు ప్రమోద్ గౌడ్  అంతటి మాట్లాడుతూ యూరోప్‌లోనే  అతి పెద్ద బతుకమ్మ  నిర్వహణ బాధ్యతకు సహకరించిన అందరికి ధన్యవాదాలు తెలుపుతూ  2010లో  నిర్వహణ ఎలా చేయాలో ఎక్కడ చేయాలో ఆర్థిక వనరులు ఎలా సమకూర్చాలో తెలియని సమయంలో యూరోప్ లోనే మొట్ట మొదటి బతుకమ్మకు పునాదులు వేసి నిర్వహించిన తెలంగాణ ఎన్నారై ఫోరమ్ వ్యవస్థాపకుడు గంప వేణుగోపాల్ చేసిన కృషిని కొనియాడారు. 2012లో బ్రిటన్ లో వివిధ ప్రాంతాల్లో ఊరూరా బతుకమ్మ నిర్వహించి బతుకమ్మ భావజాలాన్ని చాటుతూ ప్రతి తెలంగాణ బిడ్డ బతుకమ్మ ఆటలో పాల్గొనే స్థాయికి చేరుకుందని అన్నారు.

ప్రధాన కార్యదర్శి సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ 2017 నుండి ప్రతి సంవత్సరం అతిపెద్ద బతుకమ్మ నిర్వహించి 2018లో అదేవిధంగా మళ్లీ ఈ ఏడాది చరిత్ర తిరగరాసి అతిపెద్ద బతుకమ్మ నిర్వహించి చరిత్ర సృష్టించిన ఘనత తెలంగాణ ఎన్నారై  ఫోరమ్ సభ్యులదేనని అన్నారు.

ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో వ్యవస్థాపక చైర్మన్ గంప వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి రంగు వెంకట్, కార్యదర్శి పిట్ల భాస్కర్, అడ్వైజరీ సభ్యులు డా. శ్రీనివాస్, మహేష్ జమ్ముల, వెంకట్ స్వామి, బాలకృష్ణ రెడ్డి, మహేష్ చాట్ల, శేషు అల్లా, వర్మా, స్వామి ఆశా, అశోక్ మేడిశెట్టి, సాయి మార్గ్, వాసిరెడ్డి సతీష్ రాజు కొయ్యడ, నర్సింహారెడ్డి నల్లలు తమ వంతు కృషి చేశారు. మహిళా విభాగం మీనా అంతటి, వాణి అనసూరి, శౌరి గౌడ్, సాయి లక్ష్మి, మంజుల, జయశ్రీ , శ్రీవాణి మార్గ్, సవిత జమ్మల, దివ్యా, అమృత, శిరీషా ఆశ, ప్రియాంక, రోహిణిలు బతుకమ్మ నిర్వహణలో కీలకంగా పని చేసి  విజయవంతం చేశారు.

మరిన్ని వార్తలు