అందాల పోటీల్లో సత్తా చాటిన తెలుగమ్మాయి

9 Sep, 2019 14:15 IST|Sakshi

ముంబై: అందాల పోటీల్లో తెలుగు అమ్మాయి సత్తాచాటింది. ప్రవాస భారతీయుల్లో ఎవరు అందాల సుందరి అనే పోటీల్లో తెలుగు ఆణిముత్యానికి కిరీటం దక్కింది. సెప్టెంబర్ 2 నుంచి7వరకు ముంబైలో జరిగిన మిస్ టీన్ ఇండియా వరల్డ్ వైడ్ 2019 పోటీల్లో ఈషా కోడె టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. భారతదేశం నుంచి వలస వెళ్లి వివిధ దేశాల్లో నివాసముంటున్న ప్రవాస భారతీయుల్లో యుక్త వయస్సు యువతుల మధ్య ఈ పోటీ జరిగింది. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, యూఏఈ, ఓమెన్, ఫిజి, మారిషస్, మలేషియా, సింగపూర్, హంగేరి, గునియా, జర్మనీ, సురనమ్, కెన్యా, గ్వాండ్, కోస్టారికా, ఐర్లాండ్, నేపాల్ తదితర దేశాల నుంచి వచ్చిన యువతుల మధ్య ఈ పోటీ జరిగింది. ఇలా 39 మంది ఈ పోటీల్లో పాల్గొంటే వారిలో 7 గురు మిస్ టీన్ వరల్డ్ వైడ్ కంటెస్టంట్లు ఉన్నారు. వీరిలో ఈషా కోడె కూడా ఒకరు. ఐదు రోజుల పాటు వీరి మధ్య జరిగిన పోటీల్లో ఈషా కోడె విజేతగా నిలిచి మిస్ టీన్ ఇండియా వరల్డ్ వైడ్ 2019 టైటిల్ దక్కించుకున్నారు. 

పద్మావతి సినిమాలోని దీపికా పడుకొనే పాట "నయనో వాలే" కు ఈషా కోడె నృత్యం చేసి అందరిని ఆకట్టుకున్నారు. నిరాశ, ఆందోళన, ఒత్తిడి లాంటి మానసిక సమస్యలను అధిగమించి విజయపథంలో నడిచేందుకు స్వచ్ఛంద సంస్థ ద్వారా దీపికా పడుకునే చేస్తున్న కృషి తనకు స్ఫూర్తినిచ్చిందని అందుకనే ఆమె పాటను తాను ఎంచుకున్నానని ఈషా తెలిపారు. తాను కూడా భవిష్యత్తులో ఇలాంటి  హ్యాపీ2 థ్రైవ్ స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఈషా పేర్కొన్నారు. మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. పిడియాట్రిక్ కార్డియక్ సర్జన్ కావాలనేది తన లక్ష్యమని వివరించారు. ఈషాకు భారతీయతపై తనకున్న మక్కువ, సేవాభావంపై ఉన్న నిబద్ధత కూడా అనుకూలంగా మారడంతో మిస్ టీన్ ఇండియా వరల్డ్ వైడ్ 2019 కిరీటం సొంతమైంది. ఈషా కోడె మన అచ్చతెలుగమ్మాయి. 90 వ దశకంలో ఈషా కుటుంబం తెలుగునేల నుంచి అమెరికాకు వలస వెళ్లింది. ఏ దేశమేగినా ఎందుకాలిడిన మన భారతీయ వారసత్వాన్ని కాపాడుతూ.. ఆమె తల్లిదండ్రులు ఈషాను పెంచారు. మన కళలు, సంస్కృతి, సంప్రదాయాలు, మానవత్వ విలువలను ఆమెకు ఒంటబట్టేలా చేశారు. ఇదే ఈనాడు ఆమె ఉన్నతికి దోహదపడింది.


మరిన్ని వార్తలు