‘ఎన్‌ఆర్‌ఐల రాకపై ప్రణాళిక రూపొందించండి’

5 May, 2020 14:27 IST|Sakshi

లండన్‌ : కరోనా  విపత్తుతో వివిధ దేశాల్లో  ఉపాధి కోల్పోయి అవస్థలు పడుతున్న వారిని తిరిగి స్వదేశానికి రప్పించడానికి రాష్ట్రప్రభుత్వం ప్రణాళికలు రచించాలని టీపీసీసీ ఎన్నారై సెల్  యూకే  కన్వీనర్ గంప వేణుగోపాల్ అన్నారు. గత నెలన్నరగా స్వదేశం రావాలని చూస్తున్న వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే  విమాన సర్వీసులను పునరుద్దించి, రాష్ట్ర ప్రభుత్వాలకు క్వారంటైన్‌పై సూచనలు ఇచ్చారని తెలిపారు. కేరళ, పంజాబ్, ఢిల్లీ, ఒడిశా రాష్ట్రాలు స్వస్థలాలకు వచ్చే ఎన్నారైల కోసం పోర్టల్ పెట్టి వివరాలు సేకరణ, క్వారంటైన్ ఏర్పాట్లు చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఎన్నారైల రాకపై వెంటనే కేరళ తరహా ప్రణాళిక ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. 

‘గల్ఫ్ దేశాల నుండి  దాదాపు 1,50,000 మంది యువత  ఉపాధి కోల్పోయి స్వదేశం రావడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే లండన్ నుండి 500 మంది విద్యార్థులు, యూరోప్ నుండి మరో 200 మంది విద్యార్థులు మార్చ్ 20వ తేదీన స్వదేశానికి రావడానికి ఎయిర్ పోర్ట్‌కి వచ్చి ఇబ్బందులు పడుతున్నారు. వారి కోసం అనుమతులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుండి ఎన్నారైల విషయంలో పట్టించుకోవడం లేదు. ఇకనైనా తేరుకోవాలి’ అని టీపీసీసీ ఎన్నారై సెల్ యూకే కన్వీనర్   గంప వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి సుధాకర్ గౌడ్, సలహాదారులు ప్రవీణ్ రెడ్డి గంగసాని, రాకేష్ బిక్కుమండ్లలు ప్రభుత్వానికి సూచించారు. గత 50 రోజులుగా యూకే, ఆస్ట్రేలియా, దుబాయ్, న్యూజిలాండ్, బహ్రెయిన్, సౌదీ వివిధ దేశాల్లో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు, కార్మికులకు టీపీసీసీ ఎన్నారై సెల్ నుండి వందలాది మందికి చేయూత ఇచ్చామని తెలిపారు. (లాక్‌డౌన్‌: 14,800 మంది భారత్‌కు..)

మరిన్ని వార్తలు