తప్పులు చేస్తాం.. నోరెత్తకండి!

9 Sep, 2015 01:13 IST|Sakshi
తప్పులు చేస్తాం.. నోరెత్తకండి!

ముఖ్యమైన అంశాలు చాలా ఉండగా దేన్నీ చర్చించకుండానే సభను  ఐదు రోజులకే ఎందుకు ముగించారు? తమకు కావలసిన బిల్లులను ఆమోదింపజేసుకుని సభను చాలించడమనే ఈ సంప్రదాయం ఏ ప్రజాస్వామ్య విలువల కోసం? నీటి గురించి, ప్రాజెక్టులకు నీటి లభ్యత గురించిగాక కరువు మీదే చర్చించాలని ప్రతిపక్ష నేతను కట్టడి చెయ్యచూడటం ఏమిటి? దేశ చరిత్రలోనే మొదటిసారిగా ఓటుకు కోట్లు ఉదంతంలో ఒక ముఖ్యమంత్రి ప్రమేయంపై వచ్చిన ఆరోపణలపై  వీధుల్లో కాక శాసనసభలోనే చర్చించి ఉండాల్సింది కాదా?  
 
 ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈసారి చాలా ఆసక్తికరం గా సాగుతాయని అందరూ భావించారు. అందుకు కారణం ఉంది. ప్రభు త్వం ఆత్మరక్షణలో పడే పలు సంఘటనలు గత సమావేశాలకూ ఈ సమావే శాలకూ మధ్య జరిగాయి. ఒకటా రెండా అనేక సంఘటనలు. గోదావరి పుష్కరాల తొలి రోజున ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన తొక్కిసలాటలో 27 మంది అమాయక భక్తులు చనిపోయారు. అంతకుముందే ఎమ్మార్వో వన జాక్షి మీద చింతమనేని ప్రభాకర్ మనుషులు దాడి చేసి కొట్టారు. లైంగిక వేధింపులను తట్ట్టుకోలేక రిషితేశ్వరి అనే విద్యార్థిని నాగార్జున విశ్వవిద్యాల యంలో ఆత్మహత్యకు పాల్పడింది.
 
 ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాదేమో నన్న దిగులుతో కనీసం ఐదుగురు ఆత్మహత్యలు చేసుకున్నారు. వైఎస్‌ఆర్ కడప జిల్లాలో సాక్షాత్తూ రాష్ర్ట మంత్రి నారాయణకు సంబంధించిన కళాశా లలో ఇద్దరు విద్యార్థినులు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. గుంటూరు జనరల్ ఆస్పత్రిలో ఎలుకలు ఇంకా కళ్లు పూర్తిగా తెరవని ఒక పసి కందును కొరికి చంపేశాయి. వీటన్నిటికి తోడు తెలంగాణలో జరిగిన ఓటుకు కోట్ల వ్యవహారం, ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర ప్రత్యేక హోదా సాధన కోసం జరుగుతు న్న ఉద్యమం.

ఈ సమస్యలన్నిటిని సావకాశంగా చర్చించాలంటేనే ఇతర అం శాలన్నీ పక్కన పెట్టి కనీసం పదిహేను రోజులు మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వంలోని పెద్దలు ఈ అంశాలన్నిటి మీదా ఇప్పటికే బయట ఏం మా ట్లాడినా ఎటువంటి వివరణలు ఇచ్చినా చట్టసభలో వీటి మీద జరిగే చర్చకు ఉండే ప్రాధాన్యమే వేరు. ఆ చర్చ పర్యవసానంగా రూపొందే పరిష్కారాలు వేరు. అందుకే సభను కనీసం పదిహేను రోజులు జరపాలని ప్రతిపక్ష  వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. శాసనసభా వ్యవహారాల సలహా కమి టీ సమావేశంలో కూడా కోరింది. అందుకు ససేమిరా అన్నది అధికార పక్షం.
 
 చర్చకు తావేలేని సమావేశాల అంతరార్థం?
 175 మంది సభ్యులుగల ఆంధ్రప్రదేశ్ శాసన సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ప్రతిపక్షంగా ఉంది. అయితే అది 67 మంది సభ్యులున్న బలమైన ప్రతిపక్షం. ఆ పార్టీ విశ్వప్రయత్నం చేసినా పైన పేర్కొన్న సమస్యల్లో ఏ ఒక్క దాని మీదా అధికార పక్షం చర్చను సాగనివ్వలేదు. ఆగస్టు 31 నుంచి సెప్టెం బర్ నాలుగు వరకు ఐదు రోజులపాటు సభను తూతూ మంత్రంగా జరిపించి నిరవధికంగా వాయిదా వేశారు. ముఖ్యమైన అంశాలు ఇన్ని ఉన్నా దేనిపైనా చర్చను ఎందుకు చేపట్టలేదు? సభ ఐదు రోజులే ఎందుకు  జరిగింది.
 
 అంత కన్నా మించి సభ జరగరాదన్న నిబంధన ఏదైనా ఉందా? లేకపోతే చట్ట సభలో చర్చ కంటే ముఖ్యమైన పనులు ముఖ్యమంత్రికి, మంత్రులకు, అధికార పక్ష సభ్యులకు ఏమైనా ఉన్నాయా? ఏ చర్చా లేకుండానే ఇలా సమా వేశాలను ముగించేట్టయితే... బోలెడు ప్రజాధనం వెచ్చించి శాసన సభను సమావేశపరచడం ఎందుకు? తమకు కావలసిన బిల్లులను ఆమోదింపజేసు కుని సభను చాలించడమనే ఈ సంప్రదాయాన్ని ఏ ప్రజాస్వామ్య విలువలను కాపాడటం కోసం ప్రవేశపెట్టినట్టు?
 
 స్థాయిని మరచిన జాతీయ పార్టీ

 ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అధికార పక్షం తెలుగుదేశం, దాని మిత్రపక్షం భారతీయ జనతా పార్టీ కాక పతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ మాత్రమే ఉంది. బీజేపీ ఇక్కడ రాష్ర్ట ప్రభుత్వంలో భాగస్వామి, టీడీపీ అక్కడ కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వంలో భాగస్వామి. ఆ కారణంగా బీజేపీ మిత్ర ధర్మంగా భావించి ఇక్కడి ప్రభుత్వం పక్షానే నిలిచి, దాని అప్రజాస్వామిక వైఖరికి మౌనంగా ఆమోద ముద్ర వేసింది. అంతే తప్ప ఒక జాతీయ పార్టీగా కొం తలో కొంతయినా స్వతంత్రంగా వ్యవహరించలేదు. ముఖ్య అంశాలపై చర్చ జరపడానికి అధికార పక్షాన్ని ఒప్పించి ఉంటే... అది ఆ పార్టీ స్థాయికి తగిన దిగా ఉండేది, మంచి మార్కులు పడి ఉండేవి. ఆ పనిచెయ్యక పోగా కొన్ని సందర్భాలలో తెలుగుదేశం కంటే కూడా అది ఒక అడుగుముందుకేసి, ప్రతి పక్ష నిరసనను అడ్డుకునే ప్రయత్నం చెయ్యడమే విడ్డూరం. మంత్రులు తమ స్థాయి మరచి వాడిన భాష, చేసిన విమర్శలు రాజకీయాలకే తలవంపులు తెచ్చేవిగా ఉన్నాయి. ప్రతిపక్షం నుంచి ఎవరు మాట్లాడాలని లేచినా, చివరకు ప్రతిపక్ష నాయకుడు మాట్లాడాలన్నా మైకులు సరిగా పనిచేయవు.
 
 ఆంధ్రప్రదే శ్‌కు ప్రత్యేక హోదా విషయంలో తమను తాము సమర్థించుకోవడంలో బీజేపీకి ఇబ్బందులు ఉండొచ్చు. కేంద్రంలో అధికారంలో ఉన్నది తామే కాబట్టి, ప్రత్యేక హోదా ఐదేళ్ళు కాదు పదేళ్ళు ఉండాల్సిందే అని నాడు ప్రతి పక్ష నేతగా గట్టిగా పట్టుబట్టింది, మాట్లాడింది తమ నేత వెంకయ్యనాయుడే కాబట్టి రాష్ట్ర బీజేపీకి ఇది ఒక్కటే సంకటం కావచ్చు. ఆశ్చర్యకరంగా ఆ ఒక్క అంశం మీదే కొద్దిలో కొద్దిగా అయినా చర్చ జరిపి ఒక తీర్మానం చేసి కేం ద్రానికి పంపించారు. మిగతా సమస్యలేవీ బీజేపీని అలా ఇరకాటంలో పెట్టేవే కావు. అది ఎంత టీడీపీకి మిత్రపక్షంగా ఉన్నా, మిగతా అంశాలపై చర్చకు అవకాశం కల్పించే రీతిలో ఎందుకు ప్రవ ర్తించలేకపోయింది?
 
 అన్నీ సమాధానాలు లేని ప్రశ్నలే!
 గోదావరి పుష్కరాల ప్రారంభ దినాన ముఖ్యమంత్రి, ఆయనతో ఉన్న ప్రము ఖుల బృందం... వీఐపీల కోసం ఏర్పాటు చేసిన ఘాట్‌లో కాక సామాన్య ప్రజల కోసం ఉద్దేశించిన ఘాట్‌లో స్నానాలు, పూజాదికాలు చేశారు. ఆ కార ణంగానే జరిగిన  తొక్కిసలాటలో ముఖ్యమంత్రి కళ్ళ ముందే 27 మంది చని పోయారు. ఒక విదేశీ చానల్‌కు స్వల్పకాలిక ప్రచార చిత్రాన్ని  షూట్ చెయ్య డంలో భాగంగానే ముఖ్యమంత్రి ఆ ఘాట్‌లోకి వచ్చారు. జనం పెద్ద సంఖ్యలో కనిపించాలంటే ఆ ఘాట్‌లోనే షూట్ చెయ్యాలి మరి! నిజానికి పుష్కరాల వంటి సందర్భాలలో ప్రముఖ పాత్ర నిర్వహించాల్సిన దేవాదాయ శాఖ మంత్రి ప్రమేయం ఎక్కడైనా కనిపించిందా? ప్రభుత్వ మహిళా అధికారి వనజాక్షి మీద దాడి చేసిన గుంపు మీద చర్యలు ఎందుకు లేవు? సరికదా, ఆ దాడికి బాధ్యుడయినా శాసన సభ్యుడు చింతమనేని ప్రభాకర్‌ను ఎందుకు వెనకేసుకొచ్చారు? పదే పదే ఆయనకు ఎందుకు కితాబులు ఇస్తున్నారు?

రిషితేశ్వరి ఆత్మహత్య సంఘటనలో ప్రిన్సిపాల్ బాబూరావు మీద చర్యలు ఎందుకు లేవు? ఆయనను ఎందుకు, ఎవరు కాపాడుతున్నారు? ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయి ఔరా! అనే విధంగా రాజధాని అమరావతిని నిర్మిస్తా మంటున్న ప్రాంతంలోనే ప్రభుత్వ ఆస్పత్రిలో పది రోజుల పసికందును ఎలుకలు కొరుక్కుతినే దుర్భర పరిస్థితులు ఎందుకున్నాయి? ఆ ఘటనలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రికి బాధ్యత ఉండదా? పైగా మంత్రి తనిఖీలంటూ అదే ఆస్పత్రిలో అంతకుముందే రాత్రి నిద్ర చేశారు కూడా. ఎందుకోగానీ మంత్రిగారికి మాత్రం ఆ ఎలుకల దండు కనిపించలేదు. తానే మొత్తం ప్రభు త్వంగా చక్రం తిప్పుతున్న మంత్రి నారాయణకు సంబంధించిన కళాశాలలో ఇద్దరు అమ్మాయిల అనుమానాస్పద మృతి ఘటనకు ఆయనను నైతిక బాధ్యడ్ని చేస్తూ ఎందుకు రాజీనామా చేయించలేకపోయారు?
 
 విడ్డూరపు ప్రభుత్వం... చమత్కారాల సభ శాసనసభ సమావేశాల కాలం పొడిగిస్తే... ఇదిగో ఇటువంటి అంశాలన్నిటి మీదా చర్చ జరుగుతుంది. కాబట్టే ‘శనగలు తిన్నాం చేతులు కడుక్కున్నాం’ అన్న చందంగా వర్షాకాల సమావేశాలను ముగించేశారు. ఆంధ్రప్రదేశ్ అంతటా తీవ్ర కరువు  పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఈ వర్షాకాల సమా వేశాలు జరిగాయి. కనీసం కరువు మీదన్నా చర్చ సజావుగా సాగిందా? అదీ లేదు.
 
 నీటి గురించి మాట్లాడుకోకుండా, ఆ నీటి లభ్యతకు అవసరమైన ప్రాజె క్టుల ఊసే ఎత్తకుండా కరువు మీద మాత్రమే చర్చించాలని ప్రతిపక్ష నేతను కట్టడి చెయ్యచూడటం ఈ సమావేశాల్లో జరిగిన మరో చమత్కారం. ప్రభుత్వ ఉత్తరువుల్లో కనీస ప్రస్తావన కూడా లేకుండానే పట్టిసీమ ప్రాజెక్ట్ ద్వారా రాయలసీమకు నీళ్ళు ఎలా ఇస్తారు? నీళ్ళే లేని ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చెయ్యడం ఏం విడ్డూరం? అని ప్రశ్నించబోయిన ప్రతిపక్ష నాయకుడి మైకు పని చెయ్యదు.

దేశ చరిత్రలోనే మొదటిసారిగా ఓటుకు కోట్లు గుమ్మరించ బోయిన ఉదంతంలో ఒక ముఖ్యమంత్రి ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు రావడం, స్వయంగా ఆయన గొంతు రికార్డై బయటికి రావడం మీద ఆ రాష్ర్ట శాసన సభలో చర్చ జరగదు. ఈ అంశాన్ని ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ వీధుల్లో కాక  శాసనసభలోనే చర్చించి... ఆ ఉదంతంలో తన ప్రమేయం లేని పక్షంలో మొత్తం సభను ఒప్పించి ఒక తీర్మానం చేయించి ఉంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి ప్రతిష్ట ఇనుమడించి ఉండేది. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి సమావేశమయ్యే చట్ట సభలు ప్రజా సమస్యల మీద కూడా కొంత చర్చ జరిపితే బాగుంటుందేమో!
 - దేవులపల్లి అమర్
 datelinehyderabad@gmail.com

మరిన్ని వార్తలు