మరపురాని నేత మాధవరెడ్డి

7 Mar, 2015 00:23 IST|Sakshi
మరపురాని నేత మాధవరెడ్డి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోమ్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి దివంగత ఎలిమినేటి మాధవరెడ్డి మరణించి నేటికి పదిహేను సంవత్సరాలు పూర్త యింది. ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో, తెలుగుదేశం పార్టీలో కీలకపాత్ర పోషించిన మాధవరెడ్డి నక్సలైట్ల దాడిలో కన్నుమూసి అప్పుడే్చ 15 సంవత్సరాలు అయిందంటే నమ్మబుద్ధి కావటం లేదు. 1981లో సర్పంచ్‌గా, తదుపరి పంచాయతీ సమితి అధ్యక్షు నిగా 1985, 89, 94, 99లలో వరుసగా భువనగిరి శాసనసభ్యుడిగా వ్యవహరించిన మాధవరెడ్డి 1994 నుంచి 1996 వరకు ైవైద్య ఆరోగ్యశాఖామంత్రిగా, 1996-99లో హోంశాఖ మంత్రిగా, 1999-2000 సంవత్సరంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో సేవలందించారు.
 
 చెరగని చిరునవ్వుతో, పరిచయం ఉన్నవారు ఎన్నిరోజుల తర్వాత అయినా కనబడితే పదవులు, హోదాలు పక్కనబెట్టి పేరుపేరునా ఆత్మీయంగా పలకరించడం ఆయన ప్రత్యేకత. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా స్వీయ క్రమశిక్షణతో పార్టీలో కీలక స్థానంలో పనిచేస్తూ యావత్ పార్టీ నేతల, కార్యకర్తల అభిమానాన్ని చూరగొన్నారు. సామాన్య కార్యకర్తలు, ప్రజల విన్న పాలు తీర్చడంలో అందరికంటే ముం దుండేవారు. హోంశాఖపై మాధవ రెడ్డిగారు వేసిన ముద్ర చెరిగిపోనిది. జైళ్లలో సదుపాయాలు, నూతన పోలీ స్‌స్టేషన్లు, క్వార్టర్ల నిర్మాణం, పోలీ సులు, ఉద్యోగుల జీతాల పెంపుదల, స్టేషనరీకి, ఇతర సదుపాయాలకు, పోలీసుల సంక్షేమానికి కావలసిన బడ్జెట్ కోసం ఆయన ఎప్పుడూ శ్రద్ధ వహించేవారు. పోలీసుశాఖ సంక్షేమం ప్రాతిపదికన బడ్జెట్‌ను తీర్చిదిద్దాలని స్వయంగా అధికారులను కోరేవారు.
 
 హోంశాఖతోపాటు సినిమాటోగ్రఫీ శాఖను కూడా నిర్వహించిన మాధవరెడ్డి సినీ పరిశ్రమాభి వృద్ధిపై దృష్టి పెట్టి ఆ శాఖలో ఉన్న సమస్యలపై దృష్టి సారించారు.సినీ కార్మికుల ఇళ్లు, ఫిలిం ఛాం బర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ భవన  నిర్మాణానికి ఆయన కృషి చేశారు. ఏ శాఖ కార్యకలాపాలమీదైనా సరే పూర్తి వివరాలు తెలుసుకుని మరీ చర్యలు చేపట్టే వారు. ఆయా శాఖల్లో ముఖ్యంగా చిన్న స్థాయి ఉద్యోగుల సంక్షేమానికి ఆయన ప్రాధాన్యత ఇచ్చేవారు.
 
 ప్రతిపక్షాలతో ఆయన ఎంతో స్నేహభావంతో ఉండేవారు. స్వప క్షంలో వైరివర్గం ఎంతగా కవ్వించినా సహనంతో వ్యవహరించేవారు. ‘‘ఎన్నికలలో ఎటువంటి రాజకీయా లు ఉన్నా ఓట్లు వేయడం అయిపో గానే అందరూ కలసి ఉండాలే’’ అనేవారాయన. అందుకే భువనగిరిలో జరిగే ఎన్నికలలో ఏ పార్టీ వారైనా మాధవరెడ్డి పోటీ చేసే నియోజకవర్గంలో పార్టీల జెండాలు పక్కనబెట్టి ఆయనకే ఓట్లేసేవారు. ఆయన నియోజకవర్గంలో కానీ, జిల్లాలో కానీ ప్రతి పక్ష పార్టీలను వేధించిన, బాధపెట్టిన సందర్భాలు మచ్చుకైనా కనబడవు. అందుకే భువనగిరిలో ఆయన హయాంలో ఎక్కడా కూడా రాజకీయ ఘర్ష ణలు జరగలేదు. హోంశాఖ మంత్రిగా ఆయన పూర్తి గా శాఖ పట్ల నిబద్ధతతో వ్యవహరించారు. ప్రజా స్వామిక పంథాలోనే హక్కులు సాధించుకోవాలి, ప్రగతిశీల పోరాటాలు నిర్మించాలనే దృక్పథం ఆయనది. ప్రతిపక్ష పార్టీనేతగా అనేక వామపక్ష పార్టీలతో ఆయన కలసిపనిచేసేవారు. నక్సలైట్లు ఆయనను లక్ష్యంగా పెట్టుకుని వధించిన ఘటన, జిల్లా వ్యాప్తంగా ప్రత్యేకించి భువనగిరి ప్రజలను, ఆయన అభిమానులను తీవ్రంగా కదిలించివేసింది.
 
 మాధవరెడ్డి పగనూ, ప్రతీకారాన్నీ కోరుకున్న వారు కాదు. ఫ్యాక్షనిజం, రౌడీయిజంతోపాటు తీవ్ర వాద చర్యలను కూడా అదుపుచేస్తే తప్ప రాష్ట్రం బాగుండదని, రాష్ట్రాభివృద్ధికి శాంతిభద్రతలు అదు పులో ఉండాలని బలంగా విశ్వసించారు. ఆయన హత్యానంతరం పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా వెల్లువెత్తిన నిరసన, ఆందోళన ప్రజల్లో ఆయన పట్ల ఉన్న అభిమానానికి ప్రతీక. ఆయన మరణించినా వర్తమాన రాజకీయాలపై ఆయన వేసిన ముద్రను మాత్రం చెరిపివేయలేము. ఒక్కటి మాత్రం నిజం, ఆయన బ్రతికుంటే తెలంగాణ రాజకీయ స్వరూపం చాలా భిన్నంగా ఉండేది.
 (నేడు ఎలిమినేటి మాధవరెడ్డి 15వ వర్ధంతి)
 కాలేరు సురేష్  కన్వీనర్, మాధవరెడ్డి స్మారక సమితి. మొబైల్: 9866174474

మరిన్ని వార్తలు