నిజ జీవితంలోనూ మున్నాభాయ్‌లేనా?

7 Apr, 2017 00:26 IST|Sakshi
నిజ జీవితంలోనూ మున్నాభాయ్‌లేనా?

ఒకరికి బదులు మరొకరు పరీక్షరాసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని హరీందర్‌ దాఖలు చేసిన రెండో అప్పీలు వెల్లడిస్తున్నా, అక్రమార్కులను శిక్షించలేదంటే ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థమౌతుంది.

మున్నాభాయ్‌ సినిమాలో ఎవడో ప్రవేశ పరీక్ష రాస్తాడు, హీరోకు మెడికల్‌ కాలేజిలో సీటు వస్తుంది. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వంలో కొన్ని వేలమంది మేధావులు డబ్బు తీసుకుని వేరే వ్యక్తులకోసం పరీక్షలు రాసారు. ఉద్యోగాలకు ఎంపికై అనేక విభాగాల్లో చేరిపో యారు. వ్యాపం కుంభకోణం అని ప్రసిధ్ధి చెందిన ఈ అక్రమాల పుట్ట ఎంత లోతుగా ఉందో ఇంకా తెలియడం లేదు. అటువంటి అక్రమం ఒకటి కార్మిక భీమా సంస్థలో ఆర్టీఐ జవాబుల్లో తేలింది.  కాని విచిత్రమేమంటే పట్టిం చుకునే వారెవరూ లేరు.

కార్మిక జీవిత భీమా సంస్థలో గుమాస్తా ఉద్యో గానికి నిత్యానంద్‌ అనే వ్యక్తి పోటీ పరీక్ష రాసినప్పుడు ఇచ్చిన హాజరు పత్రం, ప్రవేశపత్రం (అడ్మిట్‌ కార్డ్‌) ప్రతులు ఇవ్వాలని హరీందర్‌ దింఘ్రా ఆర్టీఐ దర ఖాస్తులో కోరారు. అతనికి ఆ పరీక్షలో ఎన్ని మార్కులు వచ్చాయో కూడా చెప్పమన్నాడు. ఈఎస్‌ఐసీ వారు అతను క్లర్క్‌ ఉద్యోగానికి ఎంపిక కాలేదని జవాబిచ్చి ఫైలు మూసేశారు. సమాచార కమిషన్‌ ముందుకు రెండో అప్పీలు చేరింది.

2009 సెప్టెంబర్‌ 20 వ తేదీన జరిగిన గుమాస్తా ఉద్యోగ కంప్యూటర్‌ నైపుణ్యపోటీ పరీక్షలో పాల్గొన్న 17 మంది అభ్యర్థులు అడ్మిట్‌ కార్డుపైన చేసిన సంతకాలకు ఆ తరువాత పరీక్ష హాజరు పత్రం మీద చేసిన సంత కాలకు చాలా తేడా ఉంది. తాను చేతిరాత నిపుణుడు కాకపోయినా తేడా చాలాస్పష్టంగా తెలుస్తున్నదనీ. ఈ తేడాలున్నప్పటికీ 17 మందిని ఎంపిక చేశారనీ, వారు గుమాస్తాలుగా పనిచేస్తున్నారనీ హరీందర్‌ వివరిం చారు. పరీక్ష రాసే తెలివి లేని వారికి ఉద్యోగాలు ఇప్పిం చడానికి వేరెవరో తమ తెలివిని అమ్ముకున్నారన్నమాట.  

ఎనిమిది మంది ఎల్‌డీసీలుగా చేరి యూడీసీలుగా ప్రమోషన్‌ కూడా పొందారు. ఇది కేవలం ఎనిమిది మంది సమస్య కాదని, కొన్ని వందల మందిని అక్రమంగా నియమించిన పెద్ద అవినీతి కుంభకోణం అని చెప్పారు. ఈ విషయంలో హరీందర్‌ అడిగిన పత్రా లన్నీ ఇచ్చారు. కాని అభ్యర్థుల బొటన వేలి ముద్రలున్న కాగితాల నకళ్లు ఇవ్వలేదన్నారు. తాము అభ్యర్థుల వేలి ముద్రలు సేకరించలేదని అధికారి వివరించారు. అడిగిన సమాచారం చాలావరకు ఇచ్చినా తీవ్రమైన స్థాయిలో జరిగిన అక్రమాన్ని ప్రభుత్వ సంస్థ గుర్తించకపోవడం ఆశ్చర్యం. సమాచారం కేవలం తెలుసుకోవడంకోసమే అడగరు. దాని వెనుక ఒక బాధ, ఫిర్యాదు, లంచగొండి తనం, అక్రమం, అన్యాయం, ప్రభుత్వాల నిష్క్రియ ఉంటాయి. ఆర్టీఐ వీటిని ప్రశ్నిస్తుంది.

విభిన్న హోదాలకు రకరకాల పరీక్షలు నిర్వహించి నియమించిన  కనీసం 800 మంది వ్యవహారంలో వారి బదులు వేరే అభ్యర్థులు పరీక్ష రాసారని, 11 ఆర్టీఐ దరఖాస్తుల ద్వారా ఈ గందరగోళం వెల్లడయిందని హరీందర్‌ కమిషన్‌కు వివరించారు. ఈ ఆర్టీఐ జవా బులు వచ్చిన తరువాత తాను అనేక పర్యాయాలు అధి కారుల దృష్టికి ఈ అక్రమాలు తెచ్చానని కాని ఎవరూ పట్టించుకోలేదని హరీందర్‌ వివరించారు. ఈ విధంగా అనర్హులైన వారు ఉద్యోగాలు చేస్తుంటే, కార్మికుల హక్కులు రోజూ భారీ ఎత్తున భంగపడుతూనే ఉంటా యని అన్నారు. ఈ అక్రమాలపైన దర్యాప్తు జరిపితే తాను సేకరించిన ఈ పత్రాల ద్వారా రుజువు చేయ గలనన్నారు.

అన్ని ప్రతులను జతచేసి సమగ్రమైన ఫిర్యాదు పత్రాన్ని విజిలెన్స్‌ శాఖకు సమర్పించిన తరువాత కూడా ఏ కదలికా లేదన్నారు. ఆర్టీఐ ప్రశ్నలు వచ్చిన వెంటనే లేదా వివరమైన ఫిర్యాదు అందగానే దర్యాప్తు జరిపించకపోవడం ఆశ్చర్యకరం. ఇటువంటి అన్యాయాలను వెలికి తీయడానికే సమాచార చట్టాన్ని తెచ్చారు. ప్రజాప్రయోజనం అధికంగా ఉన్న ఆర్టీఐ అప్పీలు ఇది.  ఒకరికి బదులు మరొకరు పరీక్షరాసిన ఈ సంఘటనలు ఎన్నో ఉన్నాయని హరీందర్‌ దాఖలు చేసిన రెండో అప్పీలు వెల్లడిస్తున్నా, ఏదో ఒక జవాబిస్తు న్నారే గాని అక్రమార్కులను శిక్షించే పని చేయక పోవడం చూస్తుంటే ప్రభుత్వ కార్యాలయాలు అవి నీతిలో ఎంతగా కూరుకుపోయాయో ఊహించవచ్చు.

ఎల్‌డీసీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన అభ్యర్థు లకు కంప్యూటర్‌లో నైపుణ్యాన్ని అంచనా వేయడానికి నిర్వహించిన పరీక్షలలో కనీసం 40 మార్కులు రావా లని నిర్ణయించారు. దరఖాస్తు దారులకు బదులుగా రాసిన నకిలీ వ్యక్తుల తెలివి తేటలు కూడా అంతంత మాత్రమే. ఎందుకంటే వీరికి 42, 43కు మించి మార్కులు రాలేదు. వీరి నైపుణ్యం ఆధారంగా ఈ మాత్రం కంప్యూటర్‌ తెలివి లేని మహానుభావులు ఉద్యో గాలు చేస్తున్నారు. కార్మిక జీవిత బీమా సంస్థలలో వీరు ఏం చేస్తున్నారో?

హరీందర్‌ఇచ్చిన ఫిర్యాదును వెంటనే పరిశీలించా లని, లేదా ఈ రెండో అప్పీలునే ఫిర్యాదుగా పరిగణించి దర్యాప్తు చేసి రెండు నెలలోగా ఏ చర్యతీసుకున్నారో వెల్ల డించాలని సమాచార కమిషన్‌ ఈఎస్‌ఐసీ సంస్థ ఉన్న తాధికారులను ఆదేశించింది. సంస్థ డైరెక్టర్‌ జనరల్, కార్మిక ఉపాధికల్పనా శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీలకు కూడా ప్రతులు పంపాలని, కేంద్ర కార్మిక ఉపాధికల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయకు కూడా ఒక ప్రతి పంపాలని కమిషన్‌ ఆదేశించింది. ఈ ఉద్యోగాల నియామక అక్రమాల విషయంలో తగిన చర్య తీసు కోవాలని సూచించింది. (హరీందర్‌ దింఘ్రా వర్సెస్‌ పీఐఓ, ఈఎస్‌ఐసీ ఫరీదాబాద్‌ కేసులో సమాచార కమిషన్‌ 24 మార్చి 2017న ఇచ్చిన తీర్పు ఆధారంగా. http://www.cic.gov.in సీఐసీ వెబ్‌సైట్‌ లో CIC/BS /A/2016/001489 తీర్పు పూర్తి వివరాలు చూడవచ్చు)

వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్‌
professorsridhar@gmail.com
విశ్లేషణ
మాడభూషి శ్రీధర్‌

మరిన్ని వార్తలు