ఈ కూడికలు ఇక చెల్లవు!

6 Dec, 2014 00:05 IST|Sakshi
ఈ కూడికలు ఇక చెల్లవు!

సాంఘిక శాస్త్రం
 
మారిన సామాజిక-రాజకీయ నేపథ్యంలో బీజేపీ భావజాలానికి భిన్నమైన ప్రత్యామ్నాయ విధానాలు కలిగిన ప్రతిపక్షం మాత్రమే నిలబడగలదు తప్ప అతుకుల బొంత ప్రయోగాలు ప్రత్యామ్నాయం కాజాలవు. కాంగ్రెస్‌గానీ, కమ్యూనిస్టులుగానీ అలాంటి ప్రత్యామ్నా యంగా నిలవాలంటే అవి తమ సమాధుల్లోంచి లేచి నిలబడి, తమను తాము సంస్కరించు కోవాలి. లేదా ప్రాంతీయ పార్టీలన్నీ సూత్రబద్ధమైన ఫెడరల్ ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మూడూ సాధ్యం కానివే. కాబట్టి కొంతకాలం పాటూ దేశం బీజేపీ సామ్రా జ్యంగా, రాష్ట్రాలు ప్రాంతీయ పార్టీల సామంత రాజ్యాలుగా ‘సుస్థిర’ పాలన తప్పక పోవచ్చు.
 
జనతా పరివారం పునరేకీకరణ ముచ్చట మళ్లీ తెర ముందుకు వచ్చింది. లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కొట్టిన దెబ్బకు గింగిరాలు తిరిగిపడ్డ ఈ పార్టీలు ఈసారి నిజాయితీగానే ఏకీకరణ ప్రయత్నాల్లో పడ్డాయి.  ఉనికికి సంబంధించిన సమస్య కనుక మొన్న సమావేశమైన ఆరు పార్టీలు త్వరలో ఒకే పార్టీగా అవతరించడం దాదాపు ఖాయమే అనుకోవచ్చు. ఈ ఆరు పార్టీల్లో ప్రధానమైనది ములాయంసింగ్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్‌వాది పార్టీ(ఎస్పీ). దేశంలోని అతి పెద్ద రాష్ర్టమైన ఉత్తరప్రదేశ్‌లో అది అధికారంలో ఉంది.
 
 మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీగా దెబ్బతిని, తమ పార్టీ గణనీయమైన సంఖ్యలో సీట్లను గెలిస్తే... చిన్న పార్టీల సహకారంతో ప్రధాని కావచ్చని ములాయం కలలు కన్నారు. ఆయన ఆశించినట్టే కాంగ్రెస్ దెబ్బతింది. కానీ ఊహించని విధంగా ఎస్పీ కూడా చతికిలబడింది. యూపీలో ఐదు సీట్లను మాత్రమే దక్కించుకోగలిగింది. బిహార్‌లోని అధికార పార్టీ జనతా దళ్ యునెటైడ్ (జేడీయూ), బీజేపీ పొత్తుతో  రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా పనిచేసిన నితీశ్‌కుమార్ మంచి పరిపాలనా దక్షునిగా, నీతిమంతునిగా పేరు తెచ్చుకున్నారు.
 
 ఇక బీజేపీ అండలేకుండానే తన పార్టీ బిహార్‌లో నిలదొక్కుకుంటుందని ఆయన భావించారు. ఎన్నికలకు ముందు బీజేపీ తమ ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోదీ పేరును ప్రకటించడం సాకుగా నితీష్ ఆ పార్టీతో తెగదెంపులు చేసుకున్నారు. దీంతో తన సెక్యులర్ ఇమేజ్ పెరిగి నాలుగు ఓట్లు కలిసొస్తాయని ఆయన ఊహించారు. ఆ ధైర్యంతోనే ఒంటరి పోరుకు సిద్ధమయ్యారు. కానీ, కథ అడ్డం తిరిగి జేడీ(యూ) రెండు  సీట్లకే  పరిమితం కావాల్సి వచ్చింది.
 
 బిహార్‌కే చెందిన మరో నాయకుడు లాలూప్రసాద్ యాదవ్‌దీ అదే  కథ. ప్రధానమంత్రి కావాలని ఆయనా ఒకప్పుడు కలలు కన్నవారే. కాంగ్రెస్‌తో కలసి పోటీ చేసినా ఆయన పార్టీ ఆర్జేడీకి దక్కింది నాలుగు సీట్లే. ఇక కర్ణాటకలోని జేడీ(ఎస్)... గతంలో ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా పనిచేసిన దేవెగౌడ సొంత పార్టీ. అది గత ఎన్నికల్లో రెండు లోక్‌సభ స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది. ఇక  హరియాణా పార్టీ ఇండియన్ యూనియన్ లోక్‌దళ్ (ఐఎన్ ఎల్‌డీ). చరణ్‌సింగ్ తర్వాత అంతటి పేరున్న జాట్ నాయకుడు, మాజీ ఉప ప్రధాని చౌధురీ దేవీలాల్ సుపుత్రుడు చౌటాలా నేతృత్వంలోని ఆ పార్టీకి కూడా దక్కింది రెండు లోక్‌సభ సీట్లే. ఆరోదైన సమాజ్‌వాదీ జనతా పార్టీ(ఎస్‌జేపీ) అక్షరాలా ఆరో వేలే. అది మాజీ ప్రధాని చంద్రశేఖర్ రాజకీయ ఉనికి కోసం చివరి రోజుల్లో పెట్టుకున్న లెటర్ ప్యాడ్ పార్టీ. రాజస్థాన్ బనియా పారిశ్రామిక వేత్త కమల్ మొరార్కా ఆ లెటర్‌ప్యాడ్‌ను కాపాడుకొస్తున్నారు. ఈ ఆరు పార్టీలు ఏకమవడం వల్ల మహా అయితే ములాయం వ్యక్తిగత ప్రతిష్ట కొంత పెరుగుతుంది.
 
 ఆయన మూడు, నాలుగు రాష్ట్రాలకు విస్తరించిన పార్టీకి అధ్యక్షుడవుతారు. లోక్‌సభలో ఐదుగురికి బదులు పదిహేను మందికి నేతృత్వం వహిస్తారు. బిహార్‌లో కొత్త పార్టీయే బలమైన పార్టీ అవుతుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినా గెలవచ్చు. అంతకు మించి ఈ పార్టీ ప్రభావాన్ని ఎక్కువగా అంచనా వేయలేం. ఇంకా పుట్టని ఈ సరికొత్త పార్టీ నేతల్లో అత్యధికులు రామ్ మనోహర్ లోహియా ఆలోచనాస్రవంతితో ప్రభావితమైన మాజీ సోషలిస్టులు. కర్పూరీ ఠాకూర్ శిష్యులు. లోహియా వైశ్యుడు.
 
 కర్పూరీ ఠాకూర్ క్షురక కుటుంబం నుంచి వచ్చిన వారు. వీరి ప్రభావంతో వెనుకబడిన వర్గాల నుంచి పలువురు నాయకులుగా ఎదిగారు. వారంతా లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్, ఆచార్య జేబీ కృపలానీల ఆశీస్సులతో జనతా పార్టీలో చేరారు. ఆ తర్వాత అధికారం రుచి మరిగి, పాత సోషలిస్టు భావజాలాన్ని చాలా వరకు వదిలించుకున్నారు. మైనారిటీ ఓట్ల మీది మమకారంతో సెక్యులరి జాన్ని మాత్రం వీడటం లేదు. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడే జనతా పరివార్ పార్టీ రాజకీయ ప్రత్యామ్నాయంగా నిలవగలిగే అవకాశం లేదు. మారిన సామాజిక-రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీ భావజాలానికి భిన్నమైన ప్రత్యామ్నాయ విధానాలు కలిగిన ప్రతిపక్షం మాత్రమే నిలబడగలదు తప్ప, అతుకుల బొంత ప్రయోగాలు ప్రత్యామ్నాయమూ కావు, సమీప భవిష్యత్తులో అధికారంలోకీ రాలేవు.
 
 1977 ఎన్నికలను భారత రాజకీయాల్లో తొలి ప్రధాన మలుపుగా భావించ వచ్చు. అంతకు మించిన ప్రభావాన్ని చూపిన ముఖ్య మలుపుగా 2014ను భవిష్యత్తు తరాలు గుర్తిస్తాయి. ఈ మలుపు అర్థం కావాలన్నా, ప్రత్యామ్నాయ రాజకీయాల అవతరణను ఊహించాలన్నా మన రాజకీయ, సామాజిక వ్యవస్థల్లో వచ్చిన మార్పులను జాగ్రత్తగా పరిశీలించడం అవసరం. ఎన్ని రాజకీయ పార్టీలు, సంస్థలూ ఉన్నా భారత రాజకీయాలను మూడు ప్రధాన స్రవంతులుగా విభజించవచ్చు. అవి: మితవాదం, మధ్యేమార్గం, అతివాదం లేదా వామపక్షం. ఈ మూడు స్రవంతులు స్వాతంత్య్రానికి ముందు నుంచే ఉన్నాయి. స్వాతంత్య్రానంతరం సంస్థానాలు కోల్పోయిన రాజాలు, జమీం దార్లు, జాగీర్దార్లు పెట్టుకున్న  ‘స్వతంత్ర పార్టీ’, హిందూ మత లేదా జాతి పునర్వికాసం పేరుతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆశీస్సులతో ఏర్పాటైన  ‘భారతీయ జనసంఘ్’లను మితవాద రాజకీయ పక్షాలుగా పరిగణించారు. ఫ్యూడల్ దోపిడీలో నలుగుతున్న రైతులు, కూలీల కోసం, పట్టణ కార్మికుల కోసం పోరాటాలు చేసిన కమ్యూనిస్టులు ఒక పక్క, వెనుకబడిన జాతుల రాజకీయాధికారం కోసం కృషి చేసిన సోషలిస్టులు మరో పక్క కలసి అతివాద రాజకీయ స్రవంతిగా గుర్తింపు పొందారు.
 
 స్వాతంత్య్ర పోరాటానికి నాయకత్వం వహించిన పార్టీగా, అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం విహించేదిగా కాంగ్రెస్ పార్టీ మధ్యేమార్గ పార్టీ గుర్తింపుతో చాలా కాలమే అధికారం చలాయించగలిగింది. భిన్న వర్గాలు, జాతులు, భాషలు, సంస్కృతుల వైవిధ్యభరిత భారత సమాజానికి కాంగ్రెస్ పార్టీ గంగా- యమునా తెహజీబ్‌లా కనిపించింది. అన్ని మతాల వారికి ప్రాతినిథ్యం కల్పించగల రాజకీయ పక్షం అవతారంలో కాంగ్రెస్  తనను తాను ఆవిష్కరింప చేసుకోగలిగింది. అవసరాలనుబట్టి, సందర్భాలనుబట్టి ‘వామపక్ష మధ్యేవాది’ గానూ, ‘మితవాదపక్ష మధ్యేవాది’గానూ కూడా వ్యవహరించింది.
 
 అన్ని వర్గాల ప్రయోజనాలను తానే కాపాడగలనన్న భ్రమలను చాలా కాలమే అది కలిగించ గలిగింది. అదే సమయంలో వారసత్వ ఆధిపత్యం కారణంగా ప్రజాస్వామిక లక్షణాలను కోల్పోయింది. ప్రాంతీయ ఆకాంక్షలను, నేతలను ఇముడ్చుకోలే క  ప్రాంతీయ పార్టీల ఆవిర్భావానికి కారణమైంది. ఈ ప్రాంతీయ పార్టీలన్నీ కాంగ్రెస్‌లాగే మధ్యేమార్గ విధానాలను పుణికిపుచ్చుకున్నవి కావడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతున్న కొద్దీ ఈ ప్రాంతీయ పార్టీలు బలపడుతుండ టాన్ని  మనం గమనిస్తున్నాము. ప్రాంతీయ పార్టీలు బలపడ్డ ప్రతి చోటా కాంగ్రెస్ నిరర్థక పార్టీగా మారుతూవస్తోంది. దానికి పునాది వర్ణాలుగా ఉంటున్న దళిత, గిరిజన, మైనారిటీలు ప్రాంతీయ పార్టీల ప్రభావంలోకి పోయిన ప్రతిచోటా కాంగ్రెస్‌కు మరణమే శరణ్యం. ఇప్పుడు మొత్తంగానే ఆ పార్టీ మరణశయ్యపై ఉంది. అది బీజేపీకి ప్రత్యామ్నాయ రాజకీయశక్తిగా అవతరించడం అసాధ్యం.
 
 మితవాద రాజకీయ స్రవంతి ప్రస్థానం ఇందుకు భిన్నంగా సాగింది. ఆదిలోనే అంతర్థానమైన స్వతంత్ర పార్టీ శక్తులలో అధిక భాగాన్ని తనలో ఇముడ్చుకున్న జనసంఘ్ 1977 నాటి జనతా పార్టీలో విలీనమై, భారతీయ జనతా పార్టీగా పునర్జన్మ ఎత్తింది. అనేక కొత్త కొత్త శక్తులను, వ్యక్తులనూ తనలో ఇముడ్చుకొంటూ, ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల స్థాయికి ఎదిగింది. ఎవరూ శాశ్వత పీఠాధిపతులుగా మారకుండా క్రమం తప్పకుండా నాయకత్వ శ్రేణులను మార్పు చేసుకుంటూ నిత్యనూతనంగా నిలవడమే ఆ పార్టీ ఎదుగుదలకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యంలా కనిపించే ఈ పరిణామం వెనుక అడుగడుగునా ఉన్న ఆర్‌ఎస్‌ఎస్ మార్గ నిర్దేశకత్వం విస్మరించరానిది. ఆర్‌ఎస్‌ఎస్ కృషి ఫలించి బీజేపీకి పార్లమెంట్‌లో పూర్తి మెజారిటీ లభించింది. ఇక ఆర్‌ఎస్‌ఎస్ ఎజెండాను అమలు చేయాల్సిన బాధ్యత బీజేపీ ప్రభుత్వంపై ఉంది. సంఘ్ కలలుగనే సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక ఎజెండాను మోదీ ప్రభుత్వం అమలు చేయబోతోంది. సందేహం లేదు.
 
 సోషలిస్టు పార్టీ అనతికాలంలోనే ముక్కచెక్కలైంది. జనతాపార్టీలో విలీనమై ఏకమైంది. ఆ తర్వాత తిరిగి అనేక ప్రాంతీయ పార్టీలుగా చీలిపోయి అంతర్థానమైంది. కమ్యూనిస్టు పార్టీలే ప్రధాన వామపక్ష శక్తులుగా ఉనికిని కాపాడుకొస్తున్నాయి. సోవియట్ యూనియన్ పతనం తర్వాత కమ్యూనిస్టుల సైద్ధాంతిక పునాది పగుళ్లు బారింది. ఈ నేపథ్యంలో మారిన పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మలుచుకోవడంలో అవి విఫలమయ్యాయి. కాబట్టే దశాబ్దాల తరబడి అధికారంలో ఉన్న చోట కూడా అవి తమదైన ఒక అభివృద్ధి నమూనాను రూపొందించలేకపోయాయి. చివరికి అవసాన దశకు చేరువయ్యాయి.
 
 మూడు స్రవంతుల రాజకీయ ప్రస్థానాలు ఇలా సాగుతుండగా... 2014 నాటికి దేశంలో విద్యావంతులతో కూడిన మధ్యతరగతి బలీయమైన, ప్రభావ శీలమైన వర్గంగా రూపుదాల్చింది. సోషల్ మీడియా ఈ వర్గానికి దన్నుగా నిలిచింది. ఆర్థిక, సామాజిక నిర్వచనాల ప్రకారం ఈ వర్గం జనాభా సుమారు 30 కోట్లు. అమెరికా జనాభాకు సమానం! ఈ వర్గానికి మంచి ఉద్యోగాలు, ఆదాయ మార్గాలు కావాలి. విలాసవంతమైన జీవనం కావాలి. వినియోగ సంస్కృతి కావాలి. వాటిని అందించగల అభివృద్థి నమూనా కావాలి.
 
 సార్వత్రిక ఎన్నికల నాటికి కొంత ఆరోగ్యకరమైనదిగా కనిపిస్తున్న బీజేపీ.. మోదీ రూపంలో ఒక  ‘అభివృద్ధి నమూనా’ను ఈ వర్గం ముందు నిలిపింది. రాజకీయ పార్టీగా విఫలమైన కాంగ్రెస్ పరిపాలనలోనూ సున్నా మార్కులు తెచ్చుకోగా,  వామపక్షాలకు తమదైన అభివృద్ధి ఎజెండానే లేదు. దీంతో ఈ మధ్యతరగతి వర్గాలు బీజేపీ వెనుక సమీకృతమయ్యాయి. సహజంగానే వీరి ప్రభావం మిగతా సమాజంపైనా గణనీయంగా పడింది.
 
 మోదీ గుజరాత్ అభివృద్ధి నమూనా, ఇప్పుడు కేంద్రంలో అమలు చేయబోయే అభివృద్ధి నమూనా రెండింటిది ఒకే మితవాద సైద్ధాంతిక ప్రాతిపదిక. పైగా అవేమీ లోపరహితమైనవి కావు. వ్యవసాయరంగంలో జీవనాధారాన్ని కోల్పోతున్న రైతులు, కూలీలకూ, అడవులు, కొండల నుంచి గెంటేస్తే నిర్వాసితులవుతున్న ఆదివాసీలు, గిరిజనులకూ, తీరప్రాంతాల నుంచి తరిమేస్తున్న మత్స్యకారులకూ, నిరుద్యోగులవుతున్న వృత్తిపని వారికీ, ఆశించిన స్థాయిలో అవకాశాలు లభించక ఆశాభంగం చెందే మధ్యతరగతికి ఆలంబనగా నిలిచే ఓ ప్రత్యామ్నాయం నేడు అవసరం. కాంగ్రెస్‌గానీ, కమ్యూనిస్టులుగానీ అలాంటి ప్రత్యామ్నాయంగా నిలవాలంటే తమ సమాధుల్లోంచి లేచి, నిలబడి తమను తాము సంస్కరించుకోవాలి.


 లేదా ప్రాంతీయ పార్టీలన్నీ సూత్రబద్ధ మైన, విశాలమైన ఫెడరల్ ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయాలి. ఈ మూడూ సాధ్యం కానివే. కాబట్టి కొంతకాలం పాటూ దేశం బీజేపీ సామ్రాజ్యంగా, రాష్ట్రాలు ప్రాంతీయ పార్టీల సామంత రాజ్యాలుగా ‘సుస్థిర’ పాలన తప్పక పోవచ్చు. అయితే అభివృద్ధికి అవసరమైన మార్పును చరిత్ర తన గర్భంలో నిక్షిప్తం చేసుకునే ఉంటుంది. ‘ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానల మెంతో... ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో...’   

మరిన్ని వార్తలు