కేజీ చదువే పునాది

24 Aug, 2015 00:31 IST|Sakshi
కేజీ చదువే పునాది

మనం మాట్లాడే మాటలు ఎదుటివారిని గౌరవిస్తేనే వాళ్లు వింటారు. భాష ఎదుటివారిని నొప్పించకూడదు. కేజీ చదువు బెంచీలతో రాదు ఉపాధ్యాయు ల ప్రవర్తనతో వస్తుంది. అబద్ధం ఆడకూడదని చిన్నప్పుడే పిల్లల్లో రావాలి.
 
 తెలంగాణ రాష్ట్రం ఏర్ప డిన తర్వాత దీర్ఘాలోచ నలు చేసి, చర్చలు జరిపి విద్యా పాలసీని ప్రకటిం చడం జరిగింది. ఆ పాలసీని పకడ్బందీగా అమలుపర్చడానికి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో ఒక కమిటీ కూడా వేశారు.
 ఆ కమిటీలో పాల్గొనే అవకాశం నాకు దొరి కింది. ఈ రకమైన ఎడ్యుకేషన్ పాలసీ.. కేజీ టూ పీజీ అన్న విధానం విద్యారంగంలో దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇప్పటి వరకూ లేదు. ఇది అందరూ ఆహ్వానించాల్సింది. కేజీ విద్య పేరుతో ప్రైవేటు సంస్థలు భారీగా డబ్బు వసూలు చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వమే ఇక నుంచి కేజీ విద్యను చేపట్టబో తుందని ప్రకటించడంతో విద్యారంగ కార్యకర్తగా నేను ఎంతో సంతోషపడ్డాను.

 ఈనాడు శిశువు పెంపకం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమేకాదు అది సమాజం బాధ్యత అని గుర్తించినందులకు తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వాన్ని అభినందించాల్సిందే. సాంకేతికరంగంలో వచ్చిన మార్పుల వల్ల సమష్టి కుటుంబాలు విచ్ఛిన్నం అవుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 3 నుంచి 6 సంవత్సరాల మధ్యన శిశువులో ఏర్పడిన మానసిక, శారీరక మార్పులను ఆధారం చేసుకుని సుస్థిరమైన సమాజ నిర్మాణానికి విద్యారంగం ప్రాధాన్యతలను నిర్ణయించడంలో కేజీ చదువు పాత్ర ఎంతో ఉంది.
 విదేశాలలో ఇందుకు సంబంధించి ఏ విధమై నటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయో తెలు సుకోవాలనే ఉద్దేశ్యంతో ఇటీవల అమెరికా వెళ్లాను. చాలా మంది విద్యావేత్తలతో కలిసి మాట్లాడాను. ముఖ్యంగా చికాగో నగరంలో ఒక సంస్థ ఏర్ప డింది. ఇందుకోసం ఏకంగా ‘అర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్ టు ఏ సస్‌టైనబుల్ సొసైటీ’ అనేది ఏర్పడింది. ఆ సంస్థ నిర్వాహకులతో మాట్లాడాను. వారి పనితీరును నిశితంగా పరిశీలించాను.
 సాంకేతికమైన మార్పుల వల్ల ప్రపంచ వ్యాప్తంగానే విద్యారంగంలో తీవ్రమైన కదలికలు రావటం జరిగింది. దీంతో అందరికీ చదువు అనే భావన కూడా కలిగింది. చదువు వల్ల ఆధిక్యత వస్తున్నది కాబట్టి ఆ చదువును అందరికీ అందిం చగలిగితే కొన్ని వర్గాల్లో విముక్తి కలుగుతుంది. మొత్తం సమాజ పరివర్తన జరుగుతుంది. సామాజిక పరిణామాల నుంచి చదువును విడదీయలేరు.
 21వ శతాబ్దంలో సమాచార రంగంలో వచ్చిన మార్పులు చిన్నవి కావు. దీనివల్ల ఉద్యోగభృతి అవకాశాలు పెరగటమే గాకుండా ఆర్థిక వ్యవస్థకు విద్య ఒక ప్రధాన అంగంగా మారింది. ఈనాడు అక్షరం కన్నా భావన చాలా ప్రధానం. ఆ ఆలోచ నలు బాల్యంలో ఉత్పత్తి అయ్యేది ఇంద్రియాల చైతన్యం వలననే.

 శిశువు దేహంలో ప్రధానమైన మార్పు ఇంద్రి యాల వల్లనే ఏర్పడుతూ వచ్చింది. శిశువు తనంత తానుగా ఆలోచించడు. ఇంద్రియాల ప్రేరణే శిశువు ఆలోచనలకు మూలం. దానినే ‘బుద్ధి’ అంటారు. ఇంద్రియాలు ఈ బుద్ధికి పునాది. 3 నుంచి 6 ఏళ్ల మధ్యన ఇంద్రియాలకిచ్చే శిక్షణే బిడ్డల ఆలోచనలకు పునాది. అదే అనంతర జీవితంలో కూడా శిశువు అవగాహనపై ప్రభావం వేస్తూ ఉంటుంది.
 ఆలోచనా విధానాన్ని నియమబద్ధంగా ఉంచా లన్నా, సామాజిక అవసరాలకు అనుగుణంగా మార్చాలన్నా, వ్యక్తిగత అవసరాలకు మార్చా లన్నా శిశువుకు ఈ దశే చాలా ప్రధానం. ఈ దశలో విద్యార్థిని ఎంత జాగ్రత్తగా, బాధ్యతా యుతంగా మనం తీర్చిదిద్దగలిగితే అదే స్థాయిలో ఉత్తమమైన పౌరుడుగా ఉత్తమ పౌరురాలుగా వారు రూపొందుతారు.

 కానీ శిశువులో ఏ అవగాహన కలిగించదలు చుకున్నా తల్లికి ఉండే లక్షణాలు ఆ ఉపాధ్యాయు నికి ఉంటేనే ఆ లక్ష్యసాధన జరుగుతుంది. ఆర్థిక రంగంలో వచ్చిన మార్పుల వలన శిశువుపై నేటి కాలంలో ఎంతో శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అది జరగకపోతే శిశువు పెరిగాక పక్కదారి పట్టే అవకాశం ఉంటుంది.
 తల్లీ తండ్రీ చేయవలసిన పనిని సమాజమే చేయవలసిన బాధ్యత ఏర్పడింది. కాబట్టి ఒక పౌర సమాజం కోసమై వ్యవస్థ ఏర్పడింది. ఇది కొందరికే కాదు అందరికీ అన్నది ‘అర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్ టు ఎ సస్‌టైనబుల్ సొసైటీ’ లక్ష్యంగా ముందుకు సాగుతుంది.
 అయితే ఈ పని మాత్రం ఆచరణలో అంత సులభమైనది కాదు. తల్లి మాదిరిగా శిశువుతో సాన్నిహిత్యం పెంచుకునే వ్యక్తి ఒక ఎడ్యుకేటర్ కావాలి. కుటుంబంలో తల్లి చేసే పని పవిత్రమై నది. శిశువుకు శారీరక అవసరాలుంటాయి. ఎదిగే పిల్లలకు పౌష్టిక ఆహారాన్ని ఇవ్వటం జరగాలి. పిల్లలకు పెట్టే ఆహారంలో ప్రేమను కూడా కలిపి తినిపిస్తే అది పిల్లలకు శక్తినిస్తుంది.

 శిశువు ఇంద్రియాలకు శిక్షణ ఇవ్వటానికి వన రులు కూడా ఎంతో అవసరం. శిశువు రంగులను గుర్తించటం, రంగులలో తేడాలను గుర్తించటం. అవసరం ఉపాధ్యాయుడు పిల్లల భాషలో మాట్లాడాలి. ఉపాధ్యాయుని దగ్గరకు శిశువు తల్లి దగ్గరకు వచ్చినట్లుగా పరుగెత్తుకు రావాలి. ఇందుకు ఎలాంటి భాష కావాలో ఆలోచించాలి. ఆ శిశువు కల్చర్ తెలియాలి.  అమెరికాలో ఉన్న ఆఫ్రో అమెరికన్ శిశువు లకు శిక్షణనిచ్చేందుకు అక్కడ ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. సామాజిక సుస్థిరత కోసం ఆ శోధనలు జరుగుతున్నాయి. కేజీ చదువు వెనుక ఇంత పెద్ద పరిశ్రమ ఉన్నది. మనం మాట్లాడే మాటలు ఎదుటివారిని గౌరవిస్తేనే వాళ్లు వింటారు.

భాష ఎదుటివారిని నొప్పించకూడదు. ఆప్యా యంగా ఆదరించే విధంగా ఉండాలి. కేజీ చదువు బెంచీలతో రాదు ఉపాధ్యాయుల ప్రవర్తనతో వస్తుంది. అబద్ధం ఆడకూడదని చిన్నప్పుడే పిల్లల్లో అవగాహన రావాలి. కేజీ స్కూలుకు అక్షరం కాదు పౌర సమాజ నిర్మాణానికి కావాల్సిన పునాది. అమెరికాలో ఆ కేజీ స్కూల్‌కు పోతే నేనూ చంటి బిడ్డనయ్యాను.
 

 

(వ్యాసకర్త: చుక్కారామయ్య ప్రముఖ విద్యావేత్త,  సామాజిక విశ్లేషకులు)

మరిన్ని వార్తలు