మడి చెక్కకు గ్లోబల్ ఉరితాళ్లు

14 Mar, 2015 00:12 IST|Sakshi
మడి చెక్కకు గ్లోబల్ ఉరితాళ్లు

భూమి లేక రూ. 4 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు నిలచిపోయాయంటున్న ప్రభుత్వం వాటి జాబితాను చూపడం లేదు. ఇప్పటికే సేకరించిన భూమిలో 45 శాతం ఐదు రాష్ట్రాల్లోనే ఖాళీగా పడి ఉందని అంచనా. టిస్కో స్టీల్ 1995లో సేకరించిన 3,799 ఎకరాలు అలాగే పడి ఉన్నాయి. ప్రభుత్వరంగ సంస్థలకు చెందిన 17 లక్షల ఎకరాల మిగులు భూములపై ప్రభుత్వం కన్ను వేయనే వేసింది. ఇన్ని భూములు ఉండగా వాటిని ఉపయోగించకుండా కొత్తగా బలవంతపు భూసేకరణలు ఎందుకు? ఇదంతా ప్రపంచ బ్యాంకు కనుసన్నల్లోనే జరుగుతోంది. 2015 నాటికి మన గ్రామీణ జనాభా నుంచి 40 కోట్ల మందిని పట్టణాలకు తరలించాలని అది 1996లోనే నిర్దేశించింది. ఈ బదలాయింపును వేగిరం చేయాలని 2008లో కోరింది. ఈ కారణంగానే మన పాలకులు వ్యవసాయరంగానికి వనరులు లేకుండా చేసి, రైతుల ఆదాయాలను అల్పస్థాయికి నెట్టి, వారు వ్యవసాయాన్ని వీడిపోయేలా చేస్తున్నారు.
 
రానున్న రోజుల్లో రైతుల భూముల స్వాధీనంపై పార్ల మెంటులోనూ, వీధుల్లోనూ కూడా పోరాటాలు ముమ్మ రం కానున్నాయి. ఒకవంక రైతు సంఘాలు మార్చి 18న ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ను ముంచెత్తడానికి సంసిద్ధమౌ తుంటే, మరోవంక అన్నాహజారే మార్చి 30 నుంచి పాదయాత్రకు సమాయత్తమవుతున్నారు. ఇక ప్రభు త్వం సంఖ్యాబలం లేని రాజ్యసభలో ఎదురు కానున్న గట్టి సవాలును ఎదుర్కొనడానికి కసరత్తు చేస్తోంది.
 
భూసేకరణ బిల్లు పదకొండు స్వల్ప సవరణలతో లోక్‌సభ ఆమోదం పొందింది. ఆ సవరణల్లో అత్యధికం 2013 నాటి చట్టంలో ఉన్నవే. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి భూపిందర్ సింగ్ బిల్లును సమర్థించుకోడానికి నానా తంటాలు పడి సాధించిందేమీ లేదు. అరుపులు కేకలతో కూడిన చర్చలు, చెవులు చిల్లులు పడే రణగొణ ధ్వనులు బిల్లు ఆమోదానికి ముందూ తర్వాతా కూడా కొనసాగుతున్నాయి. వాటిలో పడి భూమిని బలవం తంగా స్వాధీనం చేసుకోవడం కోసం ప్రత్యేక చట్టాన్ని తేవలసిన అవసరం వెనుకనున్న అసలు కారణాలు ప్రజ లకు వెల్లడి కాకుండా మరుగున పడిపోయాయి. రైతు అంగీకారం లేకుండానే భూమిని సేకరించడానికి అను కూలంగా ముందుకు తెస్తున్న కొన్ని ముఖ్య వాదనలను విశ్లేషించడానికి ఈ వ్యాసంలో ప్రయత్నిస్తాను.
 
భూమి అందుబాటులో లేకపోవడమనే సమస్య అభివృద్ధికి ఆటంకంగా మారిందనే వాదన పదే పదే వినిపిస్తోంది. భూమి అందుబాటులో లేక రూ.4,00, 000 కోట్ల ప్రాజెక్టులు నిలిచిపోయాయని అంటున్నారు. కానీ అలా నిలిచిపోయిన ప్రాజెక్టుల జాబితాను ఇవ్వ డంలో ప్రభుత్వం విఫలమైంది. మౌలిక సదుపాయాల రంగ ప్రాజెక్టుల అభివృద్ధిని పరిమితం చేస్తున్న అంశాల జాబితాలో భూమి సమస్య ఒకటని ‘ఆర్థిక సర్వే-2015’ పేర్కొనలేదు. పైగా మార్కెట్లోని అననుకూల పరిస్థితుల వల్ల, పెట్టుబడులు పెట్టేవారు ఆసక్తి చూపకపోవడం వల్ల అవి నిలిచిపోయాయని నిర్థారించింది. ఇకపోతే, భూమి అందుబాటులో లేకపోవడమే అందుకు కారణం అయ్యే ట్టయితే, 576కు పైగా ఎకనమిక్ జోన్స్ (ఆర్థిక మండ లాలు) పురోగతిని చూపడంలో ఎందుకు విఫల మయ్యాయనేది రెండో అంశం.
 
కార్పొరేట్లకు గ్రామీణ ఆస్తుల బదలాయింపు  

ప్రత్యేక ఆర్థిక మండలాల (సెజ్‌ల) అభివృద్ధి కోసం నోటిఫై చేసిన 45,635.63 హెక్టార్ల భూమిలో వాస్తవంగా కార్యకలాపాలు సాగుతున్నది కేవలం 28,488.49 హెక్టా ర్లలో లేదా సేకరించిన దానిలో 62 శాతం. ఈ సెజ్‌లు ఉపాధిని కల్పించినదీ లేదు, వస్తుతయారీ లేదా పారిశ్రా మిక వృద్ధికి దారితీసిందీ లేదు. వీటికి పర్యావరణ అను మతులుగానీ, సామాజిక ప్రభావ అంచనాగానీ అవస రం లేదని గుర్తుంచుకోవాలి. ైపైగా వాటికి రూ.1.75 లక్షల కోట్ల విలువైన సకల రకాల ట్యాక్స్ హాలిడేలను ప్రకటించారు. అయినా సెజ్‌లు ఫలితాలను చూపడం లో విఫలమయ్యాయి. ‘‘ప్రభుత్వం ప్రజల నుంచి భూమిని సేకరించడం ప్రధానంగా గ్రామీణ జనాభా నుంచి కార్పొరేట్ రంగానికి జరుగుతున్న సంపద బద లాయింపని రుజువవుతోంది’’ అంటూ కాగ్ ఈ వ్యవ హారంపై అతి సునిశితమైన వ్యాఖ్య చేసింది.
 
ఖాళీగా పడి ఉన్న భూములు పనికి రావా?

ఇప్పటికే సేకరించిన భూమిలో ఎంత ఖాళీగా పడివుందో ప్రభుత్వానికి సైతం తెలుసని నేను అనుకోను. కేవలం ఐదు రాష్ట్రాలలోనే నిరుపయోగంగా పడివున్న సేకరిం చిన భూమే 45 శాతమని ఒక ప్రైవేటు టీవీ చానల్ వెల్లడించింది. ఉదాహరణకు, టిస్కో స్టీల్ ప్లాంట్ కోసం ఒడిశాలోని గోపాల్‌పూర్‌లో 1995లో సేకరించిన 3,799 ఎకరాల భూమి ఇప్పటికీ నిరుపయోగంగానే ఉంది. ఇకపోతే, ప్రభుత్వరంగ సంస్థల వద్ద ఉన్న 17,00,000 ఎకరాల మిగులు భూముల మీద ప్రభుత్వం కన్ను వేయనే వేసింది. ఇప్పటికే ఇంత భూమి అందుబాటులో ఉండగా, ముందు వాటిని తగు రీతిలో ఉపయోగించ కపోవడానికి కారణం ఏమిటో అంతుపట్టదు.
 
పైగా, 2013 భూసేకరణ చట్టాన్ని మార్చాల్సిన అవ సరం ఉన్నదని ముఖ్యమంత్రులు కేంద్రానికి రాయడం వల్లనే  దాన్ని మార్చాల్సివచ్చిందంటూ చేస్తున్న వాదన హాస్యాస్పదం. బొగ్గు గనులున్న రాష్ట్రాల ముఖ్య మంత్రు లు బొగ్గు బ్లాకుల బహిరంగ వేలం వేయడాన్ని కూడా వ్యతిరేకించారని విస్మరించరాదు. కానీ సుప్రీంకోర్టు 204 బొగ్గు బ్లాకులను రద్దు చేసింది. బొగ్గు బ్లాకుల బహిరంగ వేలం ద్వారా ప్రభుత్వానికి రూ.15,00,000 కోట్ల రాబడి వస్తుందని అంచనా. స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రోత్సహించే మార్కెట్ ఆర్థిక వ్యవస్థలో... మార్కెట్టు ధరను ప్రాతిప దిక ధరగా నిర్ణయించి భూములను బహిరంగ వేలంలో కొనుక్కోమని ప్రైవేటు రంగాన్ని ఎందుకు అడగరాదో నాకు అర్థం కావడం లేదు.  గత 50 ఏళ్లలో ‘‘అభివృద్ధి ప్రాజెక్టుల’’ వల్ల 5 కోట్ల మంది ప్రజలు నిర్వాసితులయ్యారని రూర్కీలోని ఐఐటీ చేసిన ఒక అధ్యయనం అంచనా వేసింది. బాక్రా డామ్, పోంగ్ డామ్ నిర్వాసితులకు ఇంకా పునరావాసం కల్పిం చలేదని, ‘‘ప్రజావసరాల’’ పేరిట ప్రభుత్వం బలవం తంగా భూములను స్వాధీనం చేసుకోవడం వల్లనే ప్రాథ మికంగా భూ సంఘర్షణలు తలెత్తుతున్నాయని ఆ అధ్యయనంలో తేలింది. సేకరించిన భూములు చివరికి రియల్ ఎస్టేట్ సంస్థల చేతుల్లోకి పోయాయని, అవి లాభపడ్డాయని పలు కాగ్ నివేదికలు నిర్ధారించాయి.
 
‘సేకరణ’ గ్లోబల్ కుట్ర

2013-14 మధ్య వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే ‘రైట్స్ అండ్ రిసోర్సెస్ ఇనిషియేటివ్’ అనే సంస్థ జరిపిన అధ్య యనం భూసేకరణపై 252 సంఘర్షణలు తలెత్తినట్టు వెల్లడించింది. కాగా కొంతకాలం క్రితం ‘న్యూస్‌వీక్’ పత్రిక చైనాలో ఏటా దాదాపు 75,000 సంఘర్షణలు తలె త్తుతున్నట్టు, వాటిలో అత్యధికం రక్తపాతంతో కూడిన విగా ఉంటున్నాయని పేర్కొంది. గత పదేళ్లలో చైనాలో 28 లక్షల మంది గ్రామస్తులు ఆత్మహత్యలకు పాల్పడ్డా రని ఇటీవలి ఒక నివేదిక తెలిపింది. వీటిలో 80 శాతం ఆత్మహత్యలు బలవంతపు భూస్వాధీనం వల్ల జరిగినవే. అందువలన భారత శాసనకర్తలు బలవంతపు భూసేక రణ వల్ల ఉత్పన్నమయ్యే సామాజిక, ఆర్థిక అశాంతి విషయంలో రెట్టింపు జాగ్రత్త వహించాల్సి ఉంది.
 
నిజానికి భూమిని సరుకుగా మార్చే ఈ ప్రక్రియ ప్రపంచవ్యాప్త పన్నాగంలో భాగం.  చైనా, భారత్‌లలోని మొత్తం సాగుయోగ్యమైన భూమికి సమానమైన భూమి ని ప్రపంచవ్యాప్తంగా ప్రైవేటు పెట్టుబడి ఇప్పటికే వశం చేసుకుంది. భారత్ విషయానికి వస్తే... వచ్చే 20 ఏళ్లలో అంటే 2015 నాటికి 40 కోట్ల ప్రజలను అంటే బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీల మొత్తం జనాభాను గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు తరలించాలని ప్రపంచ బ్యాంకు 1996లోనే నిర్దేశించింది. ‘ప్రపంచ అభివృద్ధి నివేదిక’ 2008లో అది ఈ జనాభా బదలాయింపును వేగిరం చేయాలని కోరింది. ప్రధానంగా ఈ కారణంగానే మన పాలకులు ఉద్దేశపూర్వకంగా వ్యవసాయరంగానికి వన రులు లేకుండా చేసి, రైతుల ఆదాయాలను బలవం తంగా అల్పస్థాయికి నెడుతున్నారు. తద్వారా వారు వ్యవసాయాన్ని వీడి వలసలు పోయేలా చేస్తున్నారు.

గ్రామీణాభివృద్ధే శరణ్యం

పారిశ్రామికాభివృద్ధిని వ్యవసాయాభివృద్ధికి పోటీ పెట్టి చేస్తున్న చర్చ లోపభూయిష్టమైనది. ప్రపంచ వ్యా ప్తంగా సర్వత్రా ఉద్యోగాలులేని వృద్ధే ప్రమాణంగా కనిపి స్తున్న నేటి పరిస్థితుల్లో మన పారిశ్రామిక రంగం పెరు గుతున్న మన శ్రామికశక్తిలోని ఒక చిన్న భాగాన్ని కూడా ఇముడ్చుకోలేదు. గత పదేళ్లలో, 2004 నుంచి 2014 వరకు, అధిక వృద్ధిరేట్లున్నాగానీ 1.5 కోట్ల ఉద్యోగాలను మాత్రమే సృష్టించగలిగారు. అందువలన గ్రామీణ పరి శ్రమల స్థాపనను ప్రోత్సహించడం, భూమిలేని పేదలకు భూమిని అందించడం మాత్రమే ఆర్థికవ్యవస్థను పునరు జ్జీవింపజేయడానికి అర్థవంతమైన మార్గమౌతుంది. మహారాష్ట్రలోని దుర్భిక్ష ప్రాంత గ్రామం హిబ్రె బజార్ తమ ఊళ్లో 60 మంది లక్షాధికారులున్నారని చెప్పు కోగలుగుతుంటే... అది మిగతా దేశానికి ప్రమాణం కాజాలదనడానికి నాకు కారణమేమీ కనబడదు.   
 
(వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు)
 email: hunger55@gmail.com

మరిన్ని వార్తలు