మిషన్ కాకతీయ నుంచి మోడల్ విలేజ్

16 Feb, 2015 02:42 IST|Sakshi
ఎం.పద్మనాభ రెడ్డి

 సందర్భం
 తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయలో చెరువుల పునరుద్ధరణ అనేది మొదటి దశ మాత్రమే. తర్వాత చెరువును కేంద్ర బిందువుగా చేసి, గ్రామాలను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి వాటిని మోడల్ గ్రామాలుగా మార్చాలి.
 
 ఈ మధ్యకాలంలో దేశం మొత్తంమీద ఆయా ప్రభుత్వా లు చేపట్టిన పథకాలలో తెలం గాణ ప్రభుత్వం ప్రకటించిన ‘మిషన్ కాకతీయ’ ప్రథమ స్థా నంలో నిలుస్తుంది. సేద్యమే జీవనాధారమైన తెలంగాణలో పూర్వకాలం నుంచి వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనడానికి నీటి నిల్వలపై ఎంతో శ్రద్ధ కనపరిచారు. గ్రామ గ్రామాన చిన్న కుంటల నుంచి పెద్ద చెరువుల వరకు అలాగే భౌగోళిక పరిస్థితులను బట్టి ఒక దాని కింది భాగాన ఇంకొకటి చొప్పున గొలు సుకట్టు చెరువుల నిర్మాణం జరిపారు.

 గత 50, 60 సంవత్సరాలలో ఈ చెరువులు నిరాద రణకు గురయ్యాయి. చెరువులోకి నీరు పారే కాలువలు పూడిపోవడం, చెరువులలో పూడిక నిండటం, కబ్జాలు వంటి పలు కారణాలతో వందల ఎకరాలకు నీరు అం దించే చెరువులు పదుల ఎకరాలకే పరిమితమయ్యాయి. చెరువులలో నీటి నిల్వ తగ్గడంతో భూగర్భ జలాలు అడుగంటి దిగుబడులు తగ్గిపోయాయి. ఇక బోరు బావులలో కూడా వందల అడుగుల మేరకు తవ్వినా నీరు లేని పరిస్థితి ఏర్పడింది. చిన్న నీటిపారుదలపై శ్రద్ధ లేకపోవడంతో చెరువులు మరమ్మతులకు నోచుకోక పూడికతో, పిచ్చి మొక్కలతో నిండిపోయాయి. చెరువు నీటిపై ఆధారపడ్డ వ్యవసాయ రంగం కుదేలైంది.

 ఈ నేపథ్యంలో మిషన్ కాకతీయ ప్రణాళికను స్వాగతించాలి. చెరువుల పునరుద్ధరణతో గ్రామాల్లో వ్య వసాయం, మంచినీటి లభ్యత మెరుగుపరచవచ్చు. పైగా చెరువును కేంద్రబిందువుగా చేసి గ్రామం అన్ని రంగాలలో అభివృద్ధి చెందేలా కార్యక్రమం చేపట్టాలి. దానితో ఒక మోడల్ గ్రామం రూపొందాలంటే మిషన్ కాకతీయను, స్వచ్ఛభారత్ లాంటి కార్యక్రమాలతో అనుసంధానం చేయాలి. స్వచ్ఛభారత్ కార్యక్రమం కింద గ్రామంలో చేయవలసిన పనులలో ముఖ్యమైనవి.

 1) మిషన్ కాకతీయ కింద ఎంపికైన గ్రామంలో 100% మరుగుదొడ్ల నిర్మాణం జరగాలి. 2) ఇప్పటికీ గ్రామాలలో 50% జనాభా కట్టెలతోనే వంట చేస్తారు.  దానితో ఇల్లంతా పొగచూరడం, పిల్లలకు శ్వాసకోశ జ బ్బులు రావడం జరుగుతుంది. దీనిని నివారించడానికి పొగరాని పొయ్యిల నిర్మాణం జరగాలి. 3) ఇంటిలో వీలును బట్టి పొట్టి రకాలైన బొప్పాయి, జామ, మునగ, కరివేపాకు వంటి చెట్లు నాటాలి. వీటిలో పోషక విలు వలు అధికంగా ఉండి పిల్లలకు పోషకాహార లభ్యత మెరుగుపడుతుంది. 4) చెరువులో పూడిక తీసిన తరు వాత పెద్ద ఎత్తున తుమ్మచెట్లు నాటాలి. ఇవి నీటి పైభా గంలో ఒక గొడుగు మాదిరిగా విస్తరించి నీరు ఆవిరి కాకుండా ఆపుతాయి.

 5) ప్రస్తుతం 5 హెచ్.పి. సౌరశక్తి మోటారు మొత్తం ఖర్చు సుమారు 5 లక్షలపైబడి ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీ పోను రైతుకు సుమారు రూ.2 లక్షల వరకు వస్తుంది. దీనిపై మోడల్ గ్రామాల రైతులకు లక్ష కు ఒక సౌరశక్తి మోటారు అందజేస్తే4, 5 ఏళ్లలో సౌరశక్తితో నడిచే బోరుబావులు వాడకంలోనికి వస్తాయి. 6) మిషన్ కాకతీయ కింద ఎంపికైన గ్రామంలోని అన్ని వ్యవసాయ భూములలో భూసార పరీక్ష జరిపి, ప్రతి సర్వే నంబర్‌కు భూసార పరీక్ష కార్డు అందజేయాలి. 7) చెరువులో పూడిక తీసిన మట్టిని పొలాలలోనికి తరలిం చిన రైతులను ఆదర్శ రైతులుగా గుర్తించాలి. 8) రసాయ న ఎరువులు వాడని వారికి తాలూకా/ జిల్లా స్థాయిలో ప్రశంసాపత్రాలు ఇవ్వాలి. 9) గ్రామంలో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ వంటి కార్యక్రమాలు వీలును బట్టి చేప ట్టాలి. 10) ప్రతి బడిలో మరుగుదొడ్లు నిర్మించి, వాటిని ప్రతిదినం శుభ్రపరిచే వ్యవస్థ ఏర్పాటు చేయాలి.

 11) శాసనసభ్యుల, పార్లమెంట్ సభ్యుల ఫండ్ నుంచి మిషన్ కాకతీయ గ్రామాలలో మాత్రమే ఖర్చు చేయాలి. 12) గ్రామాల్లో మహిళా మండళ్లు, యూత్ క్లబ్‌లు, డ్వాక్రా గ్రూపులు, అంగన్‌వాడీ కేంద్రాలు వంటివి బాగా పని చేయడానికి సంబంధిత శాఖల సిబ్బంది మిషన్ కాకతీయ గ్రామాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. 13) వ్యవసాయరంగంలో నీటి పొదుపు కొరకు బిందు, తుంపర్ల సేద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. 14) చెరువు బాగు కాగానే రెండు పంటలు వరి వేయ కుండా, రెండవ పంట ఆరుతడి పంటలు వేసే విధంగా చర్యలు చేప ట్టాలి. 15) చెరువులో నీళ్లుంటే చేపల పెంపకం ఒక లాభ సాటి వృత్తి. దీనికి జిల్లా మత్స్యశాఖ మిషన్ కాకతీయ గ్రామాలలో దృష్టి కేంద్రీకరించాలి. 16) చెరువుగట్టుపై వెదురు మొక్కలు నాటాలి. గ్రామ స్థాయిలో వెదురు కుటీర పరిశ్రమకు ముడిసరుకు. 17) విద్యాశాఖ, గ్రామ పంచాయతీ మిషన్ కాకతీయ గ్రామంలో 100% పిల్లలు బడిలోనికి వెళ్లేలా చూడాలి.

 ఇలా జిల్లాస్థాయిలో, గ్రామాభివృద్ధికి సంబంధిం చిన అన్ని ప్రభుత్వ శాఖలు మిషన్ కాకతీయ గ్రామంలో పనిచేసి అట్టి గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా అభి వృద్ధి చేయడానికి ప్రణాళిక ఏర్పాటు కావాలి. జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమాలు కొత్త కాదు కాని ఒక సరైన ప్రణాళికతో మిషన్ కాకతీయలో ఎంపికైన గ్రామాలలో కేంద్రీకరించిన ఫలితాలు వస్తాయి. గ్రామాల్లో వ్యవసా యం చాలామటుకు యాంత్రీకరణకు గురైంది. ఈ నేప థ్యంలో గ్రామం మొత్తం ఒక ఆదర్శ గ్రామంగా అభి వృద్ధి చెందాలంటే స్వచ్ఛభారత్ కార్యక్రమంతో అను సంధానం చేస్తూ, ఒకటి లేక రెండేళ్ల గ్రామీణ అభివృద్ధికి సంబంధించిన అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
 (వ్యాసకర్త కార్యదర్శి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్)

>
మరిన్ని వార్తలు