దానాల్లో గొప్ప దానం ‘విలువ’

9 Dec, 2015 00:15 IST|Sakshi
దానాల్లో గొప్ప దానం ‘విలువ’

డేట్‌లైన్ హైదరాబాద్
 
ప్రస్తుతానికి దానం నాగేందర్ మరొక్కసారి పార్టీ ఫిరాయింపు వ్యవహారం ఆగినట్టే. మాటామంతీ అంతా అయిపోయింది.పోయిన సోమవారమే కాంగ్రెస్‌ను విడిచి తెలం గాణ రాష్ర్ట సమితిలో చేరడమే తరువాయి అనుకుంటుంటే ఆఖరి నిమిషంలో నాగేందర్ మనసు మార్చుకున్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నడుస్తున్న కాలంలో హైదరాబాద్ బ్రదర్స్‌లో ఒకడిగా ప్రసిద్ధి చెందిన దానం నాగేందర్ కాంగ్రెస్ నుంచి వలస పోతున్నాడంటే పెద్దగా ఎవరూ ఆశ్చర్యపోలేదు. తెలం గాణ రాష్ర్ట సమితి నాయకత్వం ఆయనను పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తున్నది అన్న అంశం కూడా ఎవరినీ ఆశ్చ ర్యపరచలేదు. అంతకు రెండు రోజుల ముందు టీఆర్‌ఎస్‌లో చేరిన టీడీపీ శాసనసభ్యుడు సాయన్న విలేకరులతో ఒక మాటన్నారు.

టీఆర్‌ఎస్‌లో సర్దుకు పోయి పని చేయగలరా వంటి ప్రశ్న ఒకటి అడిగితే, ‘అస్సలు ఇబ్బందే ఉండదు’ అన్నారాయన. అదెలా అంటే, ‘ఏముంది? అంతా తెలిసిన వాళ్లే, తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్లే. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కూడా తె లుగుదేశంలో మంత్రిగా ఉన్నారు కదా!’ అన్నారు సాయన్న. ఔను! ముఖ్యమంత్రి సహా పలు వురు మంత్రులు, నాయకులు పూర్వాశ్రమంలో తెలుగు దేశం వారే. అలాంటప్పుడు సాయన్నకు కొత్తగా ఎందు కుంటుంది? పార్టీ కార్యాలయం చిరునామా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి తెలంగాణ భవన్‌కు మారినంత తేలికైన విషయంగా అనిపించింది ఆయనకు.

సాయన్న వెంటే టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్సీ ప్రభాకర్‌కు కూడా పెద్దగా ఇబ్బంది ఏమీ అనిపించదు. టీఆర్‌ఎస్ కార్యాల యం నిండా ఎక్కడ చూసినా కాంగ్రెస్ నాయకులే కనిపించి, ఆయనకు కూడా అది మరో గాంధీభవన్ లాగా కనిపించింది తప్ప, కొత్త చోటికి వచ్చినట్టేమీ లేదు. టీడీపీ నుంచి వచ్చిన వారికి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లాగా, కాంగ్రెస్ నుంచి వచ్చిన వారికి గాంధీభవన్ లాగా కనిపించేంతగా ప్రజాస్వామ్యీకరణ చెందిందన్నమాట తెలంగాణ భవన్. ఎవరినైనా ఇముడ్చుకోగల సహనం, ఔదార్యం, విశాల హృదయం తెలంగాణ భవన్‌కు ఉండ డం గొప్ప విషయమే.

 

ఇంకా వస్తారు, రావాలి కూడా. సాధించుకున్న తెలంగాణకు సంపూర్ణత్వం సిద్ధించా లంటే తెలంగాణ భవన్ తప్ప అన్ని పార్టీల కార్యాల యాలకూ తాళాలు పడాలి. అప్పుడుగాని, మనం సాధించుకున్న తెలంగాణ కు అర్థం ఉండదు. రాష్ర్టంలో ఒకే పార్టీ కార్యాలయం ఉండాలి. దాని మీద ఒకే జెండా ఎగరాలి. ఇదే లక్ష్యం. ఈ అడుగులన్నీ దాని సాధన దిశగానే పడుతున్నాయి. జనవరి మాసాంతంలో జరగ బోయే గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో టీఆర్‌ఎస్ విజయం సాధిస్తే తప్ప తెలం గాణ రాష్ర్ట ఏర్పాటు సంపూర్ణం కాదు.

తడబడిన అభిమానులు
ఇదే లక్ష్యంగా పని చేస్తున్న టీఆర్‌ఎస్ కండువాలు కప్పు తూనే ఉన్నది. ఇతర పార్టీల నుంచి వచ్చే వారు కప్పిం చుకుంటూనే ఉన్నారు. అదే క్రమంలో దానం నాగేందర్ చేరిక కూడా దాదాపు ఖరారయింది. ఆయనకేవో డిమాండ్లు ఉన్నాయి. అవి కూడా దాదాపుగా ఒప్పు కున్నట్టే కాబట్టి సోమవారం ఆయన కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరతారని అంతా అనుకున్నారు. ఆయన అనుచరులు నగరమంతా దానం చేరికను ఆహ్వానిస్తూ, వెల్లడిస్తూ ఫ్లెక్సీలు కూడా కట్టారు. చివరి నిమిషంలో దానం పార్టీ మార్పిడి రద్దయింది. అనుచరులు యుద్ధ ప్రాతిపదికన ఫ్లెక్సీలను తొలగించేశారు. పార్టీ మారుడు వ్యవహారం ఇంత ఆషామాషీగా ఉంటుందా అని ఆశ్చర్యపోనక్కరలేదు.

నాగేందర్ షరతులకు ముఖ్య మంత్రి అంగీకారం లభించలేదు. పైగా తన సమక్షంలో కాకుండా, పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావు సమక్షంలో చేరమని కబురు పంపారట ముఖ్యమంత్రి. కేశవరావు సమక్షంలో చేరితే మరీ కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్‌లోనే చేరినట్టే ఉంటుందని నాగేందర్, ఆయన అనుచరులూ భావించినట్టున్నారు. కేశవరావు నిన్నటి దాకా కాంగ్రెస్ నాయకుడు. పీసీసీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అంత వేగంగా మరిచిపోవడం కష్టం కదా!

 

ఆ మాటంటే ఎక్కడ డి. శ్రీనివాస్ సమక్షంలో చేరండి అంటారోనని ఈ పార్టీ మార్పిడి ఆలోచనను ప్రస్తుతానికి మానుకు న్నారట దానం నాగేందర్. కేశవరావు కన్నా తాజా మాజీ పీసీసీ అధ్యక్షుడు శ్రీనివాస్. ఈ మధ్యనే ఆయన టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటికే ఒక తెలుగు దేశం బ్యాచ్ ఇంకో కాంగ్రెస్ బ్యాచ్ చేరిపోవడంతో, అసలు టీఆర్‌ఎస్ బ్యాచ్ తెలంగాణ భవన్‌లో తమ కెవరు దిక్కు అని దిక్కులు చూస్తున్నదట.

మొత్తానికి నాగేందర్ తన పార్టీ మార్పిడి ఆలోచ నను కాసేపు పక్కన పెట్టి గ్రేటర్ హైదరాబాద్ మున్సి పల్ ఎన్నికలకు కాంగ్రెస్‌ను సమాయత్తం చేసే పనిలో పడ్డారు. అయితే ఇది చివరి దాకా నిలిచే నిర్ణయం అని భావించవలసిన పని లేదు. ఏ క్షణాన్నయినా, అర్ధరాత్రి అని కూడా చూడకుండా పార్టీ మారిపోయే, మళ్లీ అదే వేగంతో తిరిగొచ్చే చాకచక్యం దానం నాగేందర్ సొంతం. 2004 ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నాగేం దర్‌కు ఆసిఫ్‌నగర్ టికెట్ నిరాకరించింది. అప్పటికి ఆయన సిట్టింగ్ సభ్యుడు.

 

ఆ ఎన్నికల సమయంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న డి. శ్రీనివాస్ నాగేందర్‌కు టికెట్ రాకుండా అడ్డుకున్నాడని ఆరోపించి నాగేందర్ రాత్రికి రాత్రి రాజకీయ బద్ధ శత్రువు చంద్రబాబునాయుడు ఇంటికి వెళ్లి పసుపుపచ్చ కండువా కప్పుకుని తెలుగు దేశంలో చేరిపోయి టికెట్ తెచ్చుకుని, అదే ఆసిఫ్‌నగర్ నుంచి టీడీపీ ఎమెల్యేగా గెలిచారు. ఎన్నికలలో తెలుగు దేశం ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. కొద్ది నెలల్లోనే దానం టీడీపీని వదిలి కాంగ్రెస్ గూటికి చేరారు. శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి మళ్లీ అదే నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికలలో పోటీ చేసి ఓడి పోయారు. డాక్టర్ రాజశేఖరరెడ్డి ప్రజాకర్షణ శక్తి కూడా నాగేందర్‌ను గెలిపించలేకపోయింది. ఇప్పుడయితే ఆ సమస్యే లేదు. ఆయన శాసన సభ్యుడు కారు. కానీ 2004లో ఎవరి కారణంగా అయితే తనకు టికెట్ రాలేదో అదే శ్రీనివాస్‌తో టీఆర్‌ఎస్‌లో చేరే విషయంలో నాగేందర్ చర్చలు జరిపారని, ఆయనతో టచ్‌లో ఉన్నా రని వార్తలొచ్చాయి. రాజకీయాలు అంటే ఇట్లానే ఉంటాయి మరి.

ఇలా ఇంకెందరో!
ఇలా పార్టీలు మారుతున్న వారంతా ఘన చరిత్ర కలవారే. కంటోన్మెంట్ సాయన్నను చూడండి! మొన్ననే ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పడగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా నియమించారు. అంతకు ముందు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తేనే అన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇవేవీ లెక్కలోకి రావన్నమాట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మరో శాసనసభ్యుడు ప్రకాష్ గౌడ్‌కు ఆ పదవి ఇచ్చారని వార్తలు వచ్చాయి. ఆయన కూడా టీఆర్‌ఎస్‌లో చేరతారని సాయన్న చేరికకు ముందే ప్రచారం జరిగింది. తన నియోజకవర్గం రాజేందర్‌నగర్ అభివృద్ధికి నిధులిస్తానంటే టీఆర్‌ఎస్‌లో చేరడానికి ఎప్పుడయినా సిద్ధమేనని ప్రకాష్ గౌడ్ బహిరంగంగానే చెప్పారు. త్వరలోనే చంద్రబాబు నాయుడు తెలంగాణ నుంచి టీటీడీకి మరో సభ్యుడిని వెతుక్కోవలసిరావచ్చు.

శాసనమండలికి స్థానిక సంస్థల నుంచి ప్రాతినిధ్యం వహించేందుకు రాష్ర్ట వ్యాప్తంగా 12 మందిని ఎన్నుకోవలసి ఉన్న తరుణంలో, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ముంచు కొస్తున్న నేపథ్యంలో జరుగుతున్న ఈ పార్టీ మార్పి డులను చూస్తే తెలంగాణ లో మరో రాజకీయ పార్టీ మిగులుతుందా లేదా అన్న సందేహం కలగక మానదు. కానీ ఇదంతా ఎక్కువ కాలం కొనసాగే బలం కాదనీ, తాత్కాలిక వాపేనని అందరికీ అర్థమయ్యే రోజు రాక తప్పదు. బలమైన ప్రతిపక్షం ఉంటేనే ప్రభుత్వాలు బాగా పనిచేయగలవనే ప్రజాస్వామ్య సూత్రం ఇప్పుడు అధికార పార్టీ చెవికి ఇంపుగా అనిపించదు. కానీ ఈ మొత్తం వ్యవహారం కప్పల తక్కెడగా మారాక తెలంగాణ రాష్ర్టసమితి తన సహజత్వాన్ని కోల్పోయిందన్న విష యం గుర్తిస్తే మంచిది.

-  దేవులపల్లి అమర్
datelinehyderabad@gmail.com

మరిన్ని వార్తలు