కొత్త పుస్తకాలు

19 Jun, 2016 23:36 IST|Sakshi
కొత్త పుస్తకాలు

అమృతం కురవని రాత్రి

 కథారచయిత: చింతపట్ల సుదర్శన్; పేజీలు: 102; వెల: 75; ప్రతులకు: నవచేతన పబ్లిషింగ్ హౌస్, బండ్లగూడ, హైదరాబాద్- 500068;

 ఫోన్: 040- 24224453

సెటైరిస్టుగానూ, అనువాదకుడిగానూ పేరొందిన చింతపట్ల సుదర్శన్ కథల సంపుటి ఇది. ఇందులో 14 కథలున్నాయి. ‘సుదర్శన్ రాసిన కథల్లో (ఒక కర్త ఖర్మ క్రియలో తప్ప) వ్యంగ్యం బాగా పండింది. వ్యంగ్యాత్మకంగా రచించబడిన ఈ కథల్లో ఈనాటి సమాజపు వికృతరూపం మనకు దిగ్భ్రమను కలిగిస్తుంది. ఈ కథల్లోని శైలి కవితాత్మకంగా సాగింది. చాలా క్లిష్టమైన మాంత్రిక వాస్తవికత అనే శిల్పాన్ని రచయిత చాలా చక్కగా, సులభంగా అర్థమయ్యేలా ప్రయోగించటం విశేషం’.

 

దహనం
నవలారచన: సాగర్ శ్రీరామకవచం; పేజీలు: 184; వెల: 80; ప్రతులకు: ఉషారాణి శ్రీరామ కవచం, 8-1-21, జమ్మిచెట్టు బజార్, లాయర్‌పేట్, ఒంగోలు. ఫోన్: 9885473934

 ‘దహనం నవల వాస్తవిక చారిత్రక స్థితిని ఆవిష్కరించడానికి ప్రయత్నించింది. బ్రాహ్మణ సమాజం ఎలా పతనమవుతూ వచ్చింది చూపిస్తుంది. 80 సంవత్సరాల నాటి మానవ సమాజ పోకడలకి అద్దం పడుతుంది. చరిత్రని, కాల్పనికతని, వాస్తవికతని, ఆనాటి వ్యక్తుల డొల్లతనాన్ని, అమాయకత్వాన్ని, జాతీయ పోరాటాన్ని, అసాంఘికతను ఈ నవల చిత్రించింది’.

 

పూలకుండీలు

 నవలారచన: శిరంశెట్టి కాంతారావు; పేజీలు: 136; వెల: 100; ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో. రచయిత ఫోన్: 08744- 256167

 ‘ఈ నవలలోని వస్తువు అత్యాధునికమైనది. ఇంగ్లీషు భాషలో ‘సరోగసీ’ అనే పదానికి తెలుగులో ‘అద్దెగర్భం’ అని అనువాదం చేస్తూ అది కేంద్రంగా జరుగుతున్న వ్యాపారం మీద తెలుగులో కాసిని కథలు వచ్చాయి. బహుశా నవల మాత్రం ఇదే మొదటిది’. ‘విరివిగా కథలు రాస్తున్న కాంతారావు సమకాలీన సమాజంలో మండుతున్న ఇలాంటి వస్తువును తీసుకుని నవల రాయడం ఆయన పరిశీలనకు గుర్తు’.

 

 అగ్నిసుమం

 కవి: కె.శరచ్చంద్ర జ్యోతిశ్రీ; పేజీలు: 72; వెల: 60; ప్రచురణ: అభ్యుదయ రచయితల సంఘం (అరసం), గుంటూరు శాఖ. ప్రతులకు: అన్ని విశాలాంధ్ర, నవచేతన శాఖలు.

 ‘అభ్యుదయ రచయితగా నేడు పాలక పక్షాలు అనుసరిస్తున్న అసహన సంస్కృతిని తీవ్రంగా నిరసిస్తాడు శరత్. (ఇతని) కవిత్వంలో జాతీయత, అంతర్జాతీయత, విస్తృతంగా కనిపిస్తాయి. ఇంకా స్థానికత, హేతువాద భావనలు, తాత్విక చింతనలు వున్నాయి. ఇతని ఆలోచనలకు కేంద్రం మార్క్సిజమని స్పష్టమౌతుంది’.

 

పేరులేని శ్రీమతులు

 రచన: రెవ॥సామ్యేల్‌బాబు బైరపోగు; పేజీలు: 160; వెల: 60; ప్రతులకు: రచయిత, ఎస్. యూనిక్ రెసిడెన్సీ, 202, సైదాబాద్, హైదరాబాద్-59; ఫోన్: 9347256600

 బైబిల్‌లో కొందరు గొప్ప భార్యలున్నారు. కానీ వారికి పేర్లు లేవు. కయ్యీను భార్య, నోవహు భార్య, లోతు భార్య, యోబు భార్య, యోషయా భార్య అనే వారిని పిలుస్తారు. అలాంటి ఇల్లాళ్ల జీవిత విశేషాలను రచయిత ఈ పుస్తకంలో పొందుపరిచారు. పైగా ఇతర గ్రంథాల ఆధారంగా వారి అసలు పేర్లు కూడా పుస్తకం చివర చేర్చారు.

 

 మీ రచనలు  పంపవలసిన చిరునామా: సాహిత్యం, సాక్షి తెలుగు దినపత్రిక, 6-3-249/1, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్-34; ఫోన్: 040-23256000; మెయిల్: sakshisahityam@gmail.com

 

మరిన్ని వార్తలు