పటేల్ గిరీ!... పావురంపై గురి?

15 Nov, 2014 00:13 IST|Sakshi

సాంఘిక శాస్త్రం
 
నెహ్రూ 125వ జయంతి పేరుతో కాంగ్రెస్ పార్టీ ఒక అంతర్జాతీయ సెమినార్‌ను ప్రకటించింది. ఈ సెమినార్‌లో పాల్గొనడానికి దేశ, విదేశాలలోని ఎందరెందరో ప్రముఖులకు ఆహ్వానాలందాయి. కానీ, ఈ దేశ ప్రధానమంత్రిని మాత్రం పిలవలేదు. ఎందుకంటే, ప్రధానమంత్రి భారతీయ జనతా పార్టీ వ్యక్తి. నెహ్రూను కాంగ్రెస్ పార్టీ ఆస్తిగా భావిస్తున్నారు, కనుక పిలవలేదు. ఒక ప్రపంచ స్థాయి నాయకునికి, విశ్వమానవ ప్రేమికునికి ఇంత సంకుచితంగా నివాళి ఘటిస్తారా?
 
‘‘పటేల్.... ఈ మాట తెలుగువాళ్లకు చిరపరిచితం. తెలంగాణ ప్రాంతంలోని గ్రామాధికారి. ఆంధ్ర ప్రాంతంలో మునసబుకు సమాంతరం. తెలంగాణ ప్రాం తం చిరకాలం రాచరికవ్యవస్థలో మగ్గిన కారణంగా, ఫ్యూడల్ దోపిడీకి, పెత్తనా నికి, దాష్టీకానికి ప్రతీకగా పటేల్ అనేమాట నిలిచిపోయింది. అందుకే ఈ వ్యవస్థ రద్దయినప్పుడు ప్రజల నుంచి హర్షామోదాలు వ్యక్తమైనాయి. ఈ దేశా న్ని కాంగ్రెస్‌పార్టీ పరిపాలించిన కాలంలో కొంత నిర్లక్ష్యానికి గురైన జాతీయో ద్యమ నాయకుడు సర్దార్ పటేల్ స్మృతికి ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం విశేషంగా ప్రాధాన్యమిస్తున్నది. ఈ విషయంపై ప్రచార మాధ్యమాల్లో విస్తృతంగా చర్చ కూడా నడుస్తున్నది. ఈ సందర్భంగా సర్దార్ పటేల్ పేరు వింటున్నప్పుడు మన పాత పటేల్ కూడా గుర్తుకొస్తున్నాడు. అంతమాత్రాన ఆ పటేల్‌కూ, ఈ పటేల్‌కూ ఏదో సంబంధం ఉన్నట్టు కాదు. అస్సలు లేదు. ఉండకూడదు.
 
పావురం... అంటే కపోతం, శాంతికి చిహ్నం. దేశ తొలిప్రధాని పండిత్ జవహర్‌లాల్ నెహ్రూకు, పావురానికీ ఎంతో అనుబంధం. చిత్రకారులు గీసిన నెహ్రూ చిత్తరువుల్లో ఆయన ఎదపై ఎర్రగులాబీ ఎంత స్ఫుటంగా ఉంటుందో ఆయన చేతుల్లో ఎగరబోతున్న పావురం కూడా అంతే ప్రస్ఫుటంగా ఉంటుంది. శాంతిదూతగా పేరుగాంచిన నెహ్రూకు బ్రాండ్ అంబాసిడర్ పావురం. పావురం అంటే ప్రేమ అనే అర్థం కూడా ఉంది. జయంతి సందర్భంగా మళ్లీ నెహ్రూ మీద సాగుతున్న చర్చను చూస్తూవుంటే ఈ దేశంమీద, ప్రజలమీద, ప్రజాస్వామ్యం మీద, లౌకికభావనమీద ఆయనకున్న పావురం(ప్రేమ) కూడా గుర్తుకొస్తున్నది.
 
పటేల్‌కూ, పావురానికి ఏమైనా పోలికవుందా? ఏమీ లేదు. ఫ్యూడల్ పటేల్‌కు, శాంతికపోతానికి వైరుధ్యం ఉంది. ఫ్యూడల్ పటేల్ అణచివేతకు గుర్తు, శాంతికపోతం స్వేచ్ఛకు సంకేతం. సర్దార్ పటేల్‌కూ, జవహర్‌లాల్ నెహ్రూకు ఏమైనా వైరుధ్యం ఉందా? ఏమీలేదు. పోలిక ఉంది. ఇద్దరూ శిఖర సమానులైన జాతీయోద్యమనేతలు. నవభారత నిర్మాణానికి పునాదులు వేయ డంలో ఒకరికొకరు చేదోడువాదోడుగా కలసి పనిచేసినవారు. అభిప్రాయాల్లో భేదాలున్నాయి. ఆలోచనల్లో తేడాలున్నాయి. నెహ్రూ ఉదారవాది, పటేల్ మిత వాది. నెహ్రూ సంపూర్ణ లౌకికవాది. పటేల్‌కు మెజారిటీ హిందువులపట్ల కొంత సానుభూతి. నెహ్రూ సౌమ్యుడు, సంప్రదింపుల ద్వారా సమస్యల పరిష్కారాన్ని కోరుకునేవాడు.

అవసరమైతే కఠినంగా వ్యవహరించడానికి వెనుకాడనితత్వం పటేల్‌ది. ఈ మాత్రం భిన్నాభిప్రాయాలు, భిన్న ఆలోచనలు కాంగ్రెస్‌పార్టీలో స్వాతంత్య్ర పోరాటకాలం నుంచీ ఉన్నాయి. మితవాద ధోరణుల నుంచి, మార్క్సిస్టు ఆలోచనా స్రవంతుల వరకూ ఎన్నో పాయలు కలసి ప్రవహించిన గంగానదిలా సాగింది కాంగ్రెస్ ప్రయాణం. ఉమ్మడి లక్ష్యాలను సమష్టిగానే కాంగ్రెస్‌పార్టీ సాధించింది. భిన్నాభిప్రాయాలు ఏనాడూ శత్రువైరుధ్యాలుగా మారలేదు.
 
నెహ్రూ చనిపోయి యాభయ్యేళ్లయింది. సర్దార్ పటేల్ అంతకుముందే చని పోయారు. ఇంతకాలానికి ఇప్పుడు నెహ్రూ వర్సెస్ పటేల్ అనే రచ్చ బయ ల్దేరింది. ప్రస్తుత రాజకీయపార్టీల స్వార్థప్రయోజనాలకోసం ఈ రచ్చ అవసర మైంది. సర్దార్ పటేల్‌ను భారతీయ జనతాపార్టీ బహిరంగంగా కబ్జా చేసింది. నెహ్రూను ప్రస్తుత కాంగ్రెస్ నాయకత్వం కుటుంబ ఆస్తిగా ప్రకటించుకుంటోం ది. నెహ్రూ 125వ జయంతి పేరుతో కాంగ్రెస్‌పార్టీ ఒక అంతర్జాతీయ సెమినా ర్‌ను ప్రకటించింది.

ఈ సెమినార్‌లో పాల్గొనడానికి దేశ, విదేశాలలోని ఎంద రెందరో ప్రముఖులకు ఆహ్వానాలందాయి. కానీ, ఈ దేశ ప్రధానమంత్రిని మాత్రం పిలవలేదు. ఎందుకంటే, ప్రధానమంత్రి భారతీయ జనతాపార్టీ వ్యక్తి. నెహ్రూను కాంగ్రెస్ పార్టీ ఆస్తిగా భావిస్తున్నారు, కనుక పిలవలేదు. ఒక ప్రపంచ స్థాయి నాయకునికి, విశ్వమానవ ప్రేమికునికి ఇంత సంకుచితంగా నివాళి ఘటి స్తారా? బీజేపీ-ఆరెస్సెస్‌లతో కూడిన సంఘ్ పరివార్ భావజాలానికీ, నెహ్రూ భావజాలానికీ సాపత్యం కుదరదు. నెహ్రూ లౌకికవాదం, ఉదారవాదం, సోష లిస్టు స్నేహం వగైరాల పొడ సంఘ్ పరివార్‌కు గిట్టదు. దేశంలో బీజేపీ ప్రధాన రాజకీయపక్షంగా ఎదిగిన నేపథ్యంలో సంఘ్ పరివార్‌కు ఒక జాతీయహీరో కావాలి. జాతీయోద్యమంలో దాని భావజాలానికి ఒక ప్రతీక కావాలి. ఒక మస్కట్ కావాలి. నెహ్రూ కాంగ్రెస్ మస్కట్‌గా మారాడు.

మహాత్మాగాంధీని కబ్జా చేయడం సాధ్యంకాదు. ఆయన భావజాలం కూడా సంఘ్ పరివార్‌కు సరి పడేది కాదు. అలాగని విస్మరించనూలేదు. అందుకే ఆయన బోధించిన అనేకా నేక అంశాల్లో ఒకటైన పారిశుధ్యాన్ని తీసుకొని ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమాన్ని ప్రకటించారు. ఇంతటితో పారిశుధ్య ప్రచారక్ పాత్రకు మహాత్ముడు పరిమితం. జాతీయోద్యమం నుంచి తమకు కావలసిన హీరోను సర్దార్‌పటేల్ రూపంలో సంఘ్ పరివార్ చాలాకాలం కిందటే కనిపెట్టింది. నెహ్రూ భావజాలాన్నీ, తద్వారా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడం కోసం దశాబ్దం క్రితం నుంచే పటేల్‌ను పక్కకు తీసే కార్యక్రమాన్ని పరివార్ చేపట్టింది.

నెహ్రూ స్థానంలో పటేల్ తొలి ప్రధాని అయివున్నట్లయితే దేశ భవిష్యత్తు గొప్పగా ఉండేదనే అభిప్రాయాన్ని అది ప్రచారంలో పెట్టింది. బాబ్రీమసీదు విధ్వంసం అనంతరం బీజేపీ నాయ కుడు అద్వానీకి అభినవ సర్దార్ అనే బిరుదును కూడా ఇచ్చేశారు. ఇప్పుడు ఏకంగా గుజరాత్‌లో 200 మీటర్ల ఎత్తయిన పటేల్ విగ్రహాన్ని ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్నారు. తప్పేమీలేదు. ఒక జాతీయోద్యమ నాయకునికి ఘనమైన స్మృతి చిహ్నాన్ని నెలకొల్పడం స్వాగతించదగ్గదే. కానీ ఒక పెద్దగీతను చిన్న బుచ్చడం కోసం మరో పెద్ద గీత గీయాలన్న సూత్రం స్ఫూర్తితో ఈ భారీ విగ్ర హం ద్వారా నెహ్రూ స్థాయిని తగ్గిస్తామనుకుంటే మాత్రం జనం నవ్వుకుం టారు. ఒకటి రెండు సందర్భాలలో పటేల్ హిందూ అనుకూలవైఖరి తీసుకు న్నారు.

మహాత్మాగాంధీ హత్యతో ఆరెస్సెస్‌పై నిషేధం విధించిన పటేల్ ఆ సంస్థ ఇకనుంచి తాము సాంస్కృతిక కార్యక్రమాలకే పరిమితమవుతామని ప్రక టించిన వెంటనే నిషేధాన్ని ఎత్తివేశారు. కొన్ని సందర్భాల్లో నెహ్రూ ఉదారవాద విధానాలను బహిరంగంగానే వ్యతిరేకించారు. ఇలాంటి కొన్ని సంఘటనలను భూతద్దంలో చూసుకున్న పరివార్ కాంగ్రెస్ పార్టీ పటేల్‌ను తమ హీరోగా క్రమ క్రమంగా తెరమీదకు తెచ్చింది. ఆ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. ఇక సర్దార్ పటేల్ కాషాయ హీరో. మస్కట్ మాత్రమే సర్దార్ పటేల్. మస్తిష్కం నిండా ఫ్యూడల్ పటేల్. పరిపాలనలో పటేల్‌గిరీ ఛాయలు కనబడుతున్నాయి. చరిత్ర పుస్తకాల్లో మతభావాలు ప్రవేశించబోతున్నాయి. ప్రత్యామ్నాయాలు లేకుండానే ప్రణాళికా సంఘాల్లాంటివి (నెహ్రూ ఛాయలు) రద్దయిపోతున్నాయి.

మహా రాష్ర్ట ప్రభుత్వం బలనిరూపణ సందర్భంగా ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసిన తీరు మనకు కనిపించింది. కశ్మీర్ వంటి సున్నిత రాష్ర్టంలో హిందువును ముఖ్యమంత్రిని చేయాలనే తెంపరితనం కనబడుతున్నది. ఆలోచనల మీద నిఘా వేస్తున్నారు. అభిప్రాయాలకు కాపలా కాస్తున్నారు. ఆడ-మగ స్నేహంపై ఆంక్షలు పెడుతున్నారు. ‘మోరల్ పోలీసింగ్‌‘ మొదలైంది. ఇదంతా ఏరకమైన పటేల్ గిరీ? సర్దార్ పటేల్ గిరీ మాత్రం కాదు.
 
ఇప్పుడు పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ ఇమేజ్‌పై పరోక్ష యుద్ధం జరుగు తున్నది. ఆ ఇమేజ్ మాటున ఉన్న అసలు వ్యక్తిని ఒక్కక్షణం స్ఫురణకు తెచ్చు కుందాం. నెహ్రూ తొలి భారత ప్రధాని. పదిహేడేళ్లపాటు ఆయన ప్రధానిగా ఉన్నారు. అంతకుముందు స్వాతంత్య్ర పోరాటంలో మరో పదిహేడేళ్లు జైల్లో ఉన్నారు. జైలు జీవితాన్ని ఆయన చరిత్ర పరిశోధనకు అంకితం చేశారు. భారత దేశచరిత్ర, సంస్కృతితో పాటు ప్రపంచదేశాలు- వాటి పరిణామాలను విస్తృ తంగా అధ్యయనం చేశారు. జైల్లో ఉండగానే ఆయన రాసిన గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ, డిస్కవరీ ఆఫ్ ఇండియా వంటి గ్రంథాలు ప్రసిద్ధ చరిత్రకారులు రాసిన పాఠ్యపుస్తకాలకు దీటుగా గౌరవాన్ని పొందాయి.

భారతదేశ చరిత్రను ప్రత్యేక శ్రద్ధాసక్తులతో ఆయన పరిశోధించారు. తొలినాటి షోడశ మహాజనపద గణరాజ్యాలనూ, వాటి ప్రజాస్వామిక లక్షణాలను సంభ్రమాశ్చర్యాలతో తిలకిం చాడు. రాజేంద్రచోళుడు ఆగ్నేయాసియాను జయించకముందే, కనిష్కుడు సెంట్రల్ ఆసియాను పాలించకముందే మనదేశంలో వర్ధిల్లిన బౌద్ధం యావత్తు ఆసియాఖండంలో గురుపీఠం సాధించిన వైనాన్ని ఆనందోద్వేగాలతో పరిశీలిం చాడు. అనేకజాతులు, అనేకభాషలు, అనేక సంస్కృతులు, అనేక తెగలు, పొంత నలేని ఆచారవ్యవహారాలు, ఎంత వైవిధ్యభరితమైన దేశం? అయినా, సహస్ర భిన్నాంశాలను కలుపుతూ ఏదో అంతర్వాహిని ప్రవహిస్తున్నది. ఆ అంతర్వా హినిలో భారతీయ ఆత్మను నెహ్రూ సందర్శించాడు. భిన్న జాతుల ప్రదేశంగా ఉన్న భారతదేశాన్ని ఒక భారతజాతిగా నిర్మించడానికి నెహ్రూకు చరిత్ర అధ్య యనం ఉపకరించింది. ఈ అధ్యయనం పర్యవసానమే నెహ్రూ ఉదారవాదం, లౌకికవాదం, ప్రాపంచిక దృక్పథం.
 
నెహ్రూ పరిపాలనాకాలంలో కొన్ని పొరపాట్లు జరిగి ఉండవచ్చు. చైనా యుద్ధం, షేక్ అబ్దుల్లా అరెస్ట్ వంటి కొన్ని తప్పిదాలకు నెహ్రూ కారకుడే. అయితే వాటన్నిటినీ మించి వెనుకబడిన ఈ వ్యవసాయక దేశాన్ని ఆధునిక భారత్‌గా అడుగులు వేయించిన వ్యక్తి నెహ్రూ. భారతదేశంతోపాటు వలస పాలన నుంచి విముక్తి పొందిన అనేక దేశాలు ప్రజాస్వామ్య ప్రయోగంలో విఫలమైనప్పటికీ భారత్ మాత్రం అగ్రశ్రేణి ప్రజాస్వామ్యంగా వర్ధిల్లగలిగిం దంటే అది నెహ్రూ చలవే. నాజర్, సుకర్ణో. టిటో వంటి నేతలను కలుపుకుని నెహ్రూ ప్రారంభించిన అలీనోద్యమం మరో ప్రపంచయుద్ధం జరగకుండా నిరోధించిందనడంలో సందేహంలేదు. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో భార తీయ పెట్టుబడిదారి వర్గం రైల్వేలు, ఉక్కుపరిశ్రమలు వంటి భారీ పరిశ్రమలను స్థాపించేంత బలంగా లేదు. అందుకే భారీ పరిశ్రమలను ఆయన ప్రభుత్వ రంగంలో ప్రారంభిస్తూ మిశ్రమ ఆర్థికవ్యవస్థను నిర్మించారు.

ఈ ప్రభుత్వరంగ సంస్థలే భవిష్యత్తులో ఒక బలమైన మధ్యతరగతి ఆవిర్భావానికి కారణమైన విషయం మరువరాదు. ఇప్పటికీ దేశంలో ప్రతిష్టాత్మక సంస్థలుగా వెలుగొందు తున్న ఐఐటీలు, ఐఐఎమ్‌లూ నెహ్రూ మానసపుత్రికలే. అణ్వస్త్ర రంగంలో, అంతరిక్ష రంగంలో దేశం సాధించిన విజయాలూ నెహ్రూ దూరదృష్టి ఫలితాలే. మతాలుగా, జాతులుగా, ప్రాంతాలుగా ఈ దేశం విచ్ఛిన్నం కాకుండా ఒక భారతజాతిగా అజేయంగా నిలబడిందంటే అందుకు కారణం నెహ్రూ అవలంబించిన ఉదారవాద, లౌకిక విధానాలే. మేరు పర్వతం లాంటి నెహ్రూ వ్యక్తిత్వాన్ని మరుగుజ్జుగా చూపడం ఎవరికీ సాధ్యమయ్యే పనికాదు.     
 

మరిన్ని వార్తలు