విద్యుత్‌ రంగంలో ఏం జరుగుతోంది?

27 Aug, 2016 01:50 IST|Sakshi
విద్యుత్‌ రంగంలో ఏం జరుగుతోంది?

సగటు మనిషికి విద్యుత్‌ గురించిన సూక్షా్మంశాలు తెలిసేది తక్కువే. స్విచ్‌ ఆన్‌ చేయడం, కరెంట్‌ వాడుకోవడం, అవసరం తీరాక స్విచ్‌ ఆఫ్‌ చేయడం. ఏ నెల్లో అయినా కరెంటు బిల్లు వంద రూపాయలు ఎక్కువ వస్తే గుండెలు బాదుకోవటం. మానవ జీవితానికి, ఆర్థిక వ్యవస్థలోని సకల రంగాలకు జీవధాతువుగా నిలుస్తున్న విద్యుత్‌ గురించి సగటు మనిషి అవగాహన అత్యంత పరిమితమే. కానీ ఒక రాష్ట్రం రెండుగా ముక్కలవడానికి దారి తీసిన ప్రధాన కారణాల్లో విద్యుత్‌ కూడా ఒకటి అని తెలిసినప్పుడు దాని చుట్టూ అల్లుకున్న విపరిణామాలను అర్థం చేసుకోకుండా పక్కన పెట్టడం నిపుణులకు సాధ్యం కాని పని. అందుకే విద్యుత్‌ శాఖలో పనిచేస్తున్న కె. రఘు గత రెండు దశాబ్దాలుగా విద్యుత్‌కి సంబంధించిన పలు అంశాలపై అధ్యయనం చేస్తూనే ఉన్నారు. కరెంట్‌ ఉత్పత్తి, పంపిణీ, వినియోగానికి సంబంధించిన కీలక అంశాలను, వాటిలోని లాభనష్టాలను ప్రజా వేదికలపై విస్తృతంగా వివరించడంతోపాటు పత్రికల్లో వ్యాసాలు రాశారు. ఈ క్రమంలో ఈయన ఇటీవల తీసుకొచ్చిన పుస్తకమే ‘తెలంగాణ విద్యుత్‌రంగంలో ఏం జరుగు తున్నది?’ ఇది తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో వెలు వడిన తొలి పుస్తకం కావడం విశేషం.


పుస్తక రచయిత కె. రఘు తెలంగాణ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (టీజేఏసీ) అధికార ప్రతినిధి. తెలం గాణ ఉద్యమ సమయంలో విద్యుత్‌కు సంబంధించిన ఏ సందేహం వచ్చినా నివృ త్తికోసం ఈయన వైపే అందరూ చూసేవారంటే ఆశ్చర్యపడవలసింది లేదు. ఈ నేపథ్యంలో కొత్త రాష్ట్రం ఏర్పడిన రెండేళ్ల కాలంలో విద్యుత్‌ రంగంలో జరిగిన పరిణామాలు, వాటి మంచి చెడులపై అత్యంత సమతూ కంతో ఆయన రాసిన ఈ పుస్తకం ఆలోచనలు రేకెత్తిస్తోంది.


తెలంగాణ ఏర్పాటైన నాటినుంచి విద్యుత్‌ రంగంలో చేపట్టిన ప్రాజెక్టుల గురించి ఈ పుస్తకం కూలంకషంగా వివరించింది. రాష్ట్ర విభజన సమ యంలో ఉన్న కరెంటు కష్టాల నుంచి గట్టెక్కడానికి ఆగ మేఘాల మీద రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ ఉత్పత్తి, కొనుగోలుపై తీసుకున్న తక్షణ నిర్ణయాలు దీర్ఘకాలంలో తెలంగాణ మెడకు ఎలా చుట్టుకోబోతున్నాయో రచ యిత సోదాహరణంగా తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌తో ఆకస్మి కంగా చేసుకున్న విద్యుత్‌ ఒప్పందం కొన్నేళ్లలోనే రాష్ట్రం మొత్తానికి గుదిబండగా మారనుందని గణాంక సహి తంగా వివరించారు. ప్రపంచమంతా విద్యుత్‌ ప్రాజె క్టులు ప్రస్తుతం అధునాతనమైన సూపర్‌ క్రిటికల్‌ (500 నుంచి 800 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం) టెక్నాలజీతో నడుస్తుండగా, ప్రాజెక్టు నిర్మాణ కాలాన్ని ఏడాదిపాటు తగ్గించవచ్చనే ఏకైక కారణంతో ప్రభుత్వం సబ్‌ క్రిటికల్‌ (270 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం) టెక్నాలజీతో భద్రాద్రి ధర్మల్‌ పవర్‌ ప్రాజెక్టును తలపెట్టడం అసం బద్ధ చర్య అని, దీంతో ఉత్పత్తి ఖర్చు పెద్దఎత్తున పెరగ డమే కాకుండా ఆ భారం మొత్తం వినియోగదారులపైనే మోపుతారని రఘు పేర్కొన్నారు.  స్వల్ప కాలిక విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల విష యంలో కూడా ఏపీ కంటే అధిక ధరకు తెలంగాణ కోట్‌ చేయడం ఎవరి ప్రయోజ నాల కోసమని రచయిత నిలదీశారు.


రాష్ట్ర విద్యుత్‌ తీరుతెన్నులపై అత్యంత విలువైన ఈ పుస్తకంలో రచయిత మొత్తం 26 వ్యాసాలు పొందుపర్చారు. వీటిలో కొట్టొచ్చేటట్టు కనిపించే అంశం ఏమిటంటే, ప్రభుత్వాన్ని కానీ, అధికారులను కానీ పల్లెత్తుమాట అనకుండా విషయానికి మాత్రమే కట్టు బడుతూ రచయిత పాటించిన అసాధారణ సమ తుల్యమే. అత్యంత సంక్లిష్ట అంశంపై పాటించిన ఇంతటి సౌమ్య వర్తనను కూడా ప్రభుత్వాధికారులు జీర్ణించుకోలేకపోవడం విచారకరం. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించడం ఏమిటి అంటూ నేరుగా విమర్శించారు కూడా. ప్రజాభి ప్రాయాన్ని ఖాతరు చేయకుండా స్వంత నిర్ణయాలు ఏకపక్షంగా తీసుకుంటే వచ్చే ఫలితాలు ఎవరికి నష్టకరంగా మారతాయో రచయిత సుస్పష్టం చేసిన నేపథ్యంలో కావలసింది పాలనతో సహా అన్ని రంగాల్లో పారదర్శకతే. ఈలోగా విద్యుత్‌రంగ కరదీపికగా రూపొందిన ఈ చిన్ని, విలువైన పుస్తకాన్ని అక్కున చేర్చుకోవలసిన బాధ్యత తెలుగు ప్రజలందరిదీ.
-ప్రత్యూష

మరిన్ని వార్తలు