ఆధునిక భారత చరిత్రలో ధృవతార సావిత్రీబాయి ఫూలే

3 Jan, 2015 01:28 IST|Sakshi
ఆధునిక భారత చరిత్రలో ధృవతార సావిత్రీబాయి ఫూలే

భారతదేశంలో ప్రముఖ సంఘ సంస్కర్తలలో సావిత్రీబాయి ఫూలే ఒకరు. ఆమె దేశంలో తొలి ఆదర్శ ఉపాధ్యాయిని. బ్రిటిష్ పాలన నాటి ప్రజల స్థితిగతులు, విద్య, సాంఘిక దురాచారాలు, సతీ సహగమనం, బాల్య వివాహాలు సావిత్రీబాయిని కదిలించాయి. మహారాష్ట్రలో సతారా జిల్లాకు చెందిన నయ్‌గావ్‌లో 1831వ సంవత్సరం జనవరి 3వ తేదీన సావిత్రీబాయి జన్మించింది. ఈమెది కూడా బాల్య వివాహమే. ఆమె వివాహం సంఘసంస్కర్త జ్యోతిరావు ఫూలేతో జరిగింది. వివాహానంతరం సావిత్రీబాయికి విద్యాభ్యాసం చేసి ఉపాధ్యాయ శిక్షణ ఇప్పించారు. కుల వ్యవస్థ నిర్మూలనకు, పీడిత ప్రజానీకం పట్ల ఆమె మనసులో ఆలోచనలను గుర్తించిన జ్యోతిరావు ఫూలే బాలికల పాఠశాల ప్రారంభించడానికి ప్రయత్నం చేశారు.
 
 1848వ సంవత్సరంలో మహారాష్ట్రలోని పుణే లో ఒక ఇంట్లో బాలికల పాఠశాలను సావిత్రీబాయి ప్రారంభించింది. ఆమె ప్రధానోపాధ్యాయినిగా 9 మంది పిల్లలతో బడి నడిపేది. ఈ పాఠశాల నడపటం ఉన్నత, అగ్రవ ర్ణాలకు నచ్చలేదు. దీంతో సావిత్రీ బాయిపై వేధింపులకు, భౌతికదాడు లకు పూనుకున్నారు. పాఠశాలకు నడిచే దారిలో ఆమెపై బురద చల్ల డం, రాళ్లు విసరడం, అసభ్య పదజా లాన్ని వాడటం వంటివి చేశారు. బుర దతో మలినమైన చీరను పాఠశాలకు వెళ్లిన తరువాత మార్చుకుని, మరల వచ్చేటప్పుడు బురద చీరను కట్టుకుని వచ్చేది. ఎవరైనా అడిగిన ప్పుడు ధైర్యంగా ‘నా విధిని నేను నిర్వహిస్తున్నాను’ అని చెప్పేది. అయినా రోజూ వేధింపులకు విసిగి ఒకరోజు ఒకడి చెంప పగులకొట్టింది.
 
 పట్టు వీడక వారు సాగించిన విద్యా ఉద్యమా నికి తక్కువ కాలంలోనే సహకారం గుర్తింపు లభిం చాయి. ఒక ముస్లిం వ్యక్తి తన ఇంటిని బడికి కేటా యించాడు. కొంత మంది పుస్తకాలు సేకరించారు. మోరోవిఠల్, వాల్వేకర్, దియోరావ్ వంటి ప్రముఖులు పాఠశాల నిర్వహ ణకు సహకరించారు. 1851లో మరల పాఠశాల ప్రారంభించారు. బాలికల చదువు కోసం, విద్యాభి వృద్ధి కోసం సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేసింది. ఈ కృషిని గుర్తించిన ఆనాటి ప్రభుత్వం 1851, నవంబర్ 16న విద్యాశాఖ ఆధ్వర్యంలో శాలు వాలతో ఘనంగా సత్కరించింది.
 
 తన జీవితాన్ని త్యాగం చేసి విద్యాబోధనకు, బాలికలకు అంకిత మైంది. సాంఘిక దురాచారాల నిర్మూలన కోసం పెద్దలతో ఘర్షణ పడవలసివచ్చినా బెదరలేదు. వితంతువులకు శిరోముండనం చేయబోమంటూ క్షురకులను చైతన్యవంతులను చేసింది. అనాథ స్త్రీలకు, పిల్లలకు శరణాలయాలు, ఆశ్రమాలు ఏర్పా టు చేయించింది. సత్యశోధక సమాజంలో మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసి కులాంతర వితంతు వివాహాలు జరిపించింది. 1890లో భర్త జ్యోతిరావు ఫూలే మరణిస్తే అంత్యక్రియలు జరిపే సందర్భంలో బంధువులు, దత్తపుత్రులు ఘర్షణ పడుతుంటే తానే చితికి నిప్పు అంటించి అంత్యక్రియలు పూర్తి చేసిం ది. ఆమె తెగువకు యావత్ భారతదేశం దిగ్భ్రాంతి చెందింది.
 
సామాజిక సేవలో అంతిమశ్వాస
 1890వ దశకంలో ప్లేగు వ్యాధి బారినపడిన పిల్లల కోసం వైద్య శిబిరాలు నిర్వహించింది. దుర్భరమైన కరువు పరిస్థితుల్లో కూడా రోజుకు 2 వేల మంది పిల్లలకు భోజనాలు పెట్టించింది. 1897వ సంవత్స రం, మార్చి 10న ఒక పిల్లవాడికి సేవ చేస్తుండగా ఆమెకు ఆ వ్యాధే సోకి మరణించింది. క్రాంతి బాయిగా ప్రజలందరూ పిలుచుకునే సావిత్రీబాయి ఫూలే ఆధునిక భారతదేశ చరిత్రలో ధృవతారగా వెలుగొందుతూనే ఉంటుంది.
 (నేడు సావిత్రీబాయి ఫూలే 185వ జయంతి)
 కె.విజయగౌరి  యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షులు

మరిన్ని వార్తలు