‘భద్రత’పై వీరూ వారూ ఒకటే తీరు

29 Apr, 2017 00:38 IST|Sakshi
‘భద్రత’పై వీరూ వారూ ఒకటే తీరు

జాతిహితం
మావోయిస్టు ప్రాంతాలలో, ఈశాన్యంలో కొనసాగుతున్న సమస్యలూ, పెచ్చరిల్లుతున్న గోరక్షకుల దాడులూ, భద్రతా బలగాలకు వాటిల్లుతున్న నష్టాలూ కలిస్తే బీజేపీ భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది. మోదీ ప్రభుత్వం యూపీఏలా బలహీనమైనదిగా, దిక్కు తోచనిదిగా, ఊగిసలాడేదిగా కనబడటానికి వీల్లేదు. కానీ అంతర్గత భద్రతా వైఫల్యాలు పోగుపడుతున్నాయి. అవి మోదీ జనాకర్షణను బద్ధలుకొట్టే స్థాయికి చేరవచ్చు. ఇలాంటి విషయాల్లో ప్రజలు ఆగ్రహిస్తే ఇక మీకు ఓటు వేయనేకూడదనే నిర్ణయానికి రావచ్చు.

అంతర్గత భద్రతాపరంగా తగులుతున్న ఎదురు దెబ్బలకు ట్వీటర్‌ లేని రోజుల్లోనైతే భారత ప్రభుత్వం సరిగ్గా ఎలా స్పందించి ఉండేది? దాదాపుగా ట్వీటర్‌ ఉన్న నేటి రోజుల్లో లాగానే స్పందించి ఉండేది. ఈ విషయానికి సంబంధించి ఎన్డీఏ అనుసరిస్తున్న తీరు దాదాపుగా యూపీఏ వైఖరినే పోలి ఉంది. యూపీఏ అత్యంత అనువుగానూ, వేగంగానూ స్పందిస్తుండటం ఒక్కటే ఉన్న తేడా. రెండూ చేసేది ‘‘పిరికి’’, ‘‘విద్రోహకర’’, ‘‘జాతి వ్యతి రేక’’ అనే సుపరిచితమైన పద క్షిపణులను ప్రయోగించడమే. ఇక  డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ ప్రాచుర్యంలోకి తెచ్చిన ‘‘హేయమైన’’ అనే మహావిధ్వంసక ఆయుధం ఉండనే ఉంది.

ఆ తగిలిన ఎదురుదెబ్బే గనుక ఈ వారం బస్తర్‌ అంత్యక్రియలకు హాజరుకావాల్సి రావడం లాంటి అత్యంత ఇబ్బందికరమైన దైతే... ఆగ్రహంతో ట్వీట్లను సంధించాక అత్యున్నత స్థాయి సమావేశాలు జరి గాక జవాన్ల త్యాగాలను వృ«థా పోనివ్వమనే వాగ్దానాలు వెలువడతాయి. ఆ తర్వాత 48 గంటలలోనే, అంతకంటే ముందే కాకున్నా, మరేదో దుర్గంధాన్ని వెదజల్లే ఘటన ఆ రోజుకు జరిగి దీన్ని మరచిపోతారు. బస్తర్‌ ఘటన జర గడంతోనే అంతకు ముందే జరిగిన కుప్వారాను మరచిపోయినట్టే, బస్తర్‌ కూడా కొన్ని గంటల్లో మరుగున పడిపోయింది. వినోద్‌ ఖన్నా మరణ వార్తే అందుకు కారణం.


యూరీ ఘటన తర్వాత జరిగిన సర్జికల్‌ స్రై్టక్‌ను (లక్ష్యిత దాడి) మిన హాయిస్తే... యూపీఏ ప్రభుత్వానికి వెన్నెముక లేదంటూ ఒకప్పుడు బీజేపీ నేతలు అతి మొరటుగా తీవ్ర ఖండనలు చేసినట్టుగానే నేటి ప్రభుత్వమూ స్పందిస్తోంది. స్మృతి ఇరానీ గాజులు పంపి హేళన చేయడాన్ని గుర్తుకు తెచ్చు కోవచ్చు. 26/11 ముంబై ఉగ్ర దాడులలో జాతీయ భద్రతా బలగాలు ఇంకా ఉగ్రవాదులతో పోరాడుతుండగానే... నరేంద్ర మోదీ ఆ పక్కనే ఉన్న ఒబె రాయ్‌ హోటల్‌ వద్దకు వచ్చి వాలడాన్ని కూడా మనం గుర్తుకు తెచ్చుకోవాలి.  పక్కరాష్ట్రం సీఎం అలా రావడం అసాధారణమైనది. మన్మోహన్‌ సింగ్, శివ రాజ్‌ పాటిల్‌లనూ, ఆ తదుపరి సుశీల్‌ కుమార్‌ షిండేను అవహేళన చేశారు.  


యూపీఏకు ఎసరు తెచ్చిన అంతర్గత భద్రతా వైఫల్యాలు
యూపీఏ ప్రభుత్వం అంతర్గత భద్రతా వ్యవహారాలకు సంబంధించి వరు సగా తప్పులు, శుద్ధ మూర్ఖపు పనులు చేసింది. దీంతో ఆ ప్రభుత్వం అంత ర్గత భద్రతా సమస్యల విషయంలో బలహీనమైనదని, దాని నాయకత్వం వెన్నెముకలేకపోవడాన్ని మించి అధ్వానమైనదని ప్రజలకు నమ్మకం కలి గింది. దేశం లోపలి జిహాదీలు, మావోయిస్టులు ఇరువురితోనూ యూపీఏ కుమ్మక్కయిందన్నట్టుగా చూశారు. బాట్లా హౌస్‌ ఎన్‌కౌంటర్‌ తర్వాత కాంగ్రెస్, ముస్లిం జిహాదీ గ్రూపులకు సంబంధించి ద్విముఖ వైఖరిని అను సరించింది. ఇది, ఆ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ మెత కగా ఉంటోందనే భయాలను ధ్రువీకరించింది (ఆ ఎన్‌కౌంటర్లో ఇద్దరు భారత ముజాహిదీన్లతోపాటు ఒక పోలీసు ఇన్‌స్పెక్టర్‌ కూడా మరణించారు).

ఆ ఇన్‌స్పెక్టర్‌కు మరణానంతరం శాంతికాలపు అత్యున్నత సాహస పురస్కారమైన అశోకచక్రను ప్రదానం చేశాక అది అనుసరించిన దాటవేత ధోరణి ప్రత్యేకించి హానికరమైనది. ఇక మావోయిస్టుల విషయానికి వస్తే రెండు విషయాలు అదే భావనను ధ్రువీకరించాయి. ఒకటి, పి.చిదంబరం మావోయిస్టుల పట్ల అనుసరించిన వైఖరిని రాజకీయంగా తోసిపుచ్చడం. నిజానికి ఆయన విధానం వల్ల ఇద్దరు పొలిట్‌ బ్యూరో సభ్యులు మరణిం చడమే గాక కొందరు అరెస్టయ్యారు కూడా. ఇక రెండవది, దేశద్రోహ ఆరోపణలకు శిక్ష పడ్డ డాక్టర్‌ బినాయక్‌ సేన్‌ను ప్రణాళికా సంఘానికి సంబంధించిన ఒక ముఖ్యకమిటీలో సభ్యునిగా తీసుకోవడం. 2014లో బీజేపీ ఘన విజయం  తదుపరి జరిగిన విశ్లేషణంతా యూపీఏ 2 ఆర్థిక విధానపరమైన నిష్క్రియా పరత్వంపైనే సాగింది. కానీ అంతర్గత భద్రతాపరమైన సవాళ్ల విషయంలో అది పిరికితనంతో వ్యవహరిస్తోందన్న భావనే ఆ ప్రభుత్వంపై భ్రమలు తొల గడాన్ని.. మహోపద్రవకరమైన ప్రభుత్వ వ్యతిరేకతగా మార్చింది.


ప్రధాని మోదీ తన మూడేళ్ల పదవీ కాలం తర్వాత తనకు సంక్రమించిన అంతర్గత భద్రతాపరమైన మంచీ చెడుల పట్టీతో పోలిస్తే తన పనితీరును ఎలా ఉందని అంచనా వేయగలుగుతారు? 2014లో కశ్మీర్‌ సమంజసమై నంత శాంతంగానే ఉంది, అదిప్పుడు భగ్గున మండుతోంది. కశ్మీర్‌ లోయలో ఇంతకు ముందూ ఇలాంటి తీవ్ర తిరుగుబాట్లు జరిగాయి నిజమే. కానీ కశ్మీ ర్‌కు సంబంధించిన అనుభవజ్ఞులను ఎవరినైనా అడిగి చూడండి.. అక్కడి ప్రజలు ఇంతకు మునుపెన్నడూ ఇంతగా విరక్తిచెంది లేరని చెబుతారు. ప్రత్యర్థి పీడీపీతో కలవాలని ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయం కుప్పకూలింది. పరస్పర విరుద్ధ భావజాలాలను సమన్వయించడంలో అత్యు న్నత స్థాయి నాయకత్వపు వైఫల్యమే అందుకు ప్రధాన కారణం.

గత ఎన్నికల తర్వాత ఈ అసహజమైన కలయిక తప్ప మరే ఇతర ఏర్పాటైనా రెండు జాతుల సిద్ధాంతాన్ని మరో రూపంలో ముందుకు తెస్తుంది, రాష్ట్రాన్ని ‘‘ముస్లిం’’ లోయ, ‘‘హిందూ’’ జమ్మూలుగా విభజిస్తుందనేదే ఆ కలయికకు నైతిక, వ్యూహాత్మక, రాజకీయ సమర్థనగా ఉండేది. ఆ కూటమి సక్రమంగా పని చేయగలిగేలా బీజేపీ మరింత సహనాన్ని ప్రదర్శించాల్సింది. గోమాంస నిషేధం, ముసారత్‌ అలాం విడుదలవైపు ముఫ్తీ మొహమ్మద్‌ సయీద్‌ దృష్టిని మళ్లనీయకుండా ఉండాల్సింది. నికరంగా కలిగిన ఫలితమే నేటి ఆగ్రహభరితమైన, హింసాత్మకమైన అల్లర్లు.


మోదీ వాగ్దానం చేసినది ఇదేనా?
తాజాగా తగిలిన రెండు ఎదురుదెబ్బలు మినహా మావోయిస్టుల విష యంలో మోదీ ప్రభుత్వం పురోగతిని ప్రదర్శించింది. తగినంత క్షేత్ర స్థాయి నిఘా సమాచారంగానీ, పారా మిలిటరీ బలగాల మోహరింపుగానీ లేకుం డానే చేపట్టిన రోడ్ల నిర్మాణ కార్యక్రమంలోని బలహీనతలను ఇటీవలి రెండు ఎదురుదెబ్బలూ బట్టబయలు చేశాయి. ఈ రెండు ఘటనలలోనూ భద్రతా బలగాల స్పందన అధ్వానంగా ఉన్నట్టు, అప్రతిష్టాకరమైన నాయకత్వ వైఫ ల్యాలు, తేలికగా మంచి ఆయుధాలను కోల్పోవడం కనిపించాయి. గత రెండు నెలల్లో మావోయిస్టులు ఒక అటవీ యుద్ధ బెటాలియన్‌కు ఉండే అత్యున్నత స్థాయి ఆయుధ సంపత్తికి సమానమైన ఆయుధాలను కొల్లగొట్టారు.

వాటిలో అసాల్ట్‌ రైఫిల్స్, లైట్‌ మెషిన్‌ గన్స్, గ్రనేడ్‌ లాంచర్స్, వీహెచ్‌ఎఫ్‌ రేడియో సెట్లు, బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు ఉన్నాయి. మావోయిస్టులు తమ పాశవికత గుర్తుండిపోయేలా కొందరు జవాన్ల మృతదేహాలను ఛిద్రంచేసే వరకు ఘటనాస్థలిలోనే ఉన్నారు కూడా. భద్రతా దళాలలో రేగే ఆగ్రహాన్ని, తమకు ఏర్పడే సంకటాన్ని దృష్టిలో ఉంచుకుని సీఆర్‌పీఎఫ్‌ అగ్ర నాయకత్వం ఆ విషయాన్ని ఖండించింది. కానీ ఆలస్యం జరగనే జరిగిపోయింది. జవాన్లలో ఆ ఘోర చిత్రాలు పంపిణీ అవుతూనే ఉన్నాయి. మీడియాలోని బాధ్యతా యుతమైన విభాగం వాటిని ప్రచురించకున్నా, అవి బయటకు రావడానికి ఎంతో కాలం పట్టదు. 2014లో మోదీ వాగ్దానం చేసినది ఈ పరిస్థితిని మాత్రం కాదు.


ఈ వారం జరిగిన మాటు దాడి ఉదయం 11.30కి జరిగింది. అంటే నిజంగానే గట్టి ప్రభుత్వం ఏదైనా గానీ హంతకులను అటకాయించడానికి, వేటాడటానికి తగినంత పగటి వెలుతురుంది. కాబట్టి హెలికాప్టర్లలో మరింత సుశిక్షితులైన తాజా బలగాలను రంగంలోకి దించాల్సింది. అది జరగకపోవ డానికి ఒక కారణం, సీఆర్‌పీఎఫ్‌ బలగాలకు అవసరమైన సాధనసంపత్తి లేక పోవడం. ‘‘గట్టి, జాతీయవాద’’ ఎన్డీఏ ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం ప్రద ర్శించిన అదే సంసిద్ధతారాహిత్యాన్ని, దృష్టి కేంద్రీకరణ కొరవడటాన్ని కొన సాగించింది. సరిగ్గా అందుకే యూపీఏను బీజేపీ అప్పట్లో విమర్శించింది.


ప్రమాదకరమైన ఎత్తుగడలు
నేటి భారత అంతర్గత భద్రతా పటాన్ని 2014 మే నాటి పటంతో పోల్చి చూస్తే, నేటి చిత్రమేమీ మోదీని పొగడదగ్గదిగా ఉండదు. గురుదాస్‌పూర్, పఠాన్‌కోట, యూరీ ఉగ్రదాడుల తదుపరి మోదీ ప్రభుత్వం విఫలమైందన్న భావన ఉప్పొంగుతుండగా జరిపిన సర్జికల్‌ స్రై్టక్స్‌ ఆయన ఆ వెల్లువ నుంచి గట్టెక్కడానికి తోడ్పడ్డాయి. కానీ ఒకే చెక్కును మళ్లీ మళ్లీ నగదుగా మార్చు కుంటూ ఉండలేరు. కశ్మీర్‌ అదుపు తప్పడాన్ని... ఆయనా, ఆయన  పార్టీ చాక చక్యంగా... పాక్‌ను తప్పుపట్టడం, ఇస్లామిజం పెరుగుదల, సైనికులు వారికి విరుద్ధంగా రాళ్లు రువ్వే ద్రోహులు అంటూ మిగతా దేశానికంతటికీ ఒక రాజ కీయ సందేశాన్ని çపంపడానికి వాడుకోగలిగారు. ఇది ఆ పార్టీకి అనుకూలంగా ఓట్ల కేంద్రీకరణ జరగడానికి కూడా తోడ్పడి ఉండొచ్చు.


కానీ ఈ ఎత్తుగడలు సుస్థిరమైనవి కావు, ప్రమాదకరవైనవి. కుప్వారాలా ముగిసే ఒక ఘటన లేదా యూరీ నరమేధంలాంటి ఒక్క ఘటన జరిగితే చాలు. లేదా ఏదైనా ఒక సీఆర్‌పీఎఫ్‌ లేదా సైనిక దళం నెలల తరబడి ఒత్తిడికి గురై, అదువు తప్పి హింసాత్మకమైన ఓ బృందంపై కాల్పులకు దిగితే... అది 1990 నాటి గాక్‌డాల్‌ తరహా నరమేధానికి తలుపులు తెరుస్తుంది. 27 ఏళ్ల క్రితం జరిగినా ఆ ఘటన నేటికీ మాయని మచ్చగానే మిగిలి ఉంది. ఇప్పుడు చెప్పిన పరిస్థితులేవీ దురదృష్టవశాత్తూ అవాస్తవికమైనవి కావు.


కశ్మీర్‌ సమస్యను మరింత పెద్దదిగా, నిరాశామయమైనదిగా చేసి చూపే పక్షపాతపూరితమైన రాజకీయాలు ఇంతవరకూ ఫలితాలను ఇచ్చి ఉంటే ఉండొచ్చు. కానీ మావోయిస్టు ప్రాంతాలలో, ఈశాన్యంలో కొనసాగుతున్న ఇబ్బందులూ, నానాటికీ పెచ్చరిల్లుతున్న గోరక్షకుల దాడులూ, భద్రతా బల గాలకు వాటిల్లుతున్న నష్టాలూ కలిస్తే బీజేపీ భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది. ఈ సమస్యలపై అది బలహీనమైనదిగా, దిక్కుతోచనిదిగా, అనిశ్చి తితో ఊగిసలాడేదిగా కనబడటానికి వీల్లేదు. ప్రత్యేకించి తనకు ముందటి యూపీఏ ప్రభుత్వం అలాంటిదే కాబట్టి అసలే అలా అనిపించకూడదు.

మోదీకి ఉన్న జనాకర్షణశక్తి ప్రబలమైనదే గానీ మరణాల పెరుగుదల, పరి స్థితి అదుపు తప్పడం కొనసాగుతుండటాన్ని అది కప్పిపుచ్చలేదు. త్వరలోనే దాన్ని బలహీనతగా, అసమర్థతగా చూడటం మొదలవుతుంది. అంతర్గత భద్రతా వ్యవహారాలలోని వైఫల్యాలు ఇప్పుడు కుప్పగా పోగుపడుతు న్నాయి. అవి మోదీ జనాకర్షణను బద్ధలుకొట్టే స్థాయికి చేరే దశ రానూ రావచ్చు. ఇలాంటి విషయాల్లో ప్రజలు ఆగ్రహించినప్పుడు మీకు గాజులు పంపడానికైనా వెనుకాడరని ఎన్నికల చరిత్ర చెబుతోంది. వాళ్లు ఇక మీకు ఓటు వేయనేకూడదనే నిర్ణయానికీ రావచ్చు.


twitter@shekargupta
శేఖర్‌ గుప్తా

మరిన్ని వార్తలు