జై జవాన్ సరే, కిసాన్ సంగతేమిటి?

6 Sep, 2015 08:09 IST|Sakshi
జై జవాన్ సరే, కిసాన్ సంగతేమిటి?

త్రికాలమ్
 
 కొన్ని దృశ్యాలు ఎన్నటికీ మరపురావు. కొన్ని నినాదాలు దశాబ్దాలు దాటినా చెవులో మార్మోగుతూనే ఉంటాయి. తాష్కెంట్‌లో లాల్‌బహద్దూర్ శాస్త్రి శవ పేటికను సోవియట్ యూనియన్ ప్రధాని కోసిగిన్, పాకిస్తాన్ అధ్యక్షుడు ఫీల్డ్ మార్షల్ అయూబ్ ఖాన్ మోసుకొని నడుస్తున్న సన్నివేశం ఆ తరంవారిని కలచి వేస్తూనే ఉంటుంది. పాకిస్తాన్‌తో జరిగిన సరిహద్దు పోరాటం సందర్భంగా యుద్ధానికి జాతిని సమాయత్తం చేస్తూ నాటి ప్రధాని లాల్ బహద్దూర్ ప్రచారం చేసిన నినాదం ‘జై జవాన్, జై కిసాన్’ను 2014 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోదీ శక్తిమంతంగా వినియోగించుకున్నారు. శాస్త్రి 'జై జవాన్, జై కిసాన్'నినాదాన్ని యూపీఏ ప్రభుత్వం 'మర్ జవాన్, మర్ కిసాన్'గా ఆచరణలో మార్చివేసిందంటూ ఎద్దేవా చేశారు.

సరిహద్దులో పాకి స్తాన్ కాల్పుల్లో మన జవాన్లు చనిపోతున్నా, గ్రామాలలో వ్యవసాయం గిట్టు బాటు కాక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా యూపీఏ సర్కార్‌కు చీమ కుట్టినట్టయినా లేదంటూ నిప్పులు చెరిగారు. అప్రతిహతంగా జరిగిన ప్రచార యాత్ర ఫలితంగా నరేంద్రమోదీ ప్రధాని పీఠం అలంకరించారు. అటు వంటిమోదీ హయాంలో సైతం సరిహద్దులో పాకిస్తాన్ సైనికులు కాల్పులు జర పడం, భారత జవాన్లు మరణించడం కొనసాగుతూనే ఉంది. ఈ విషయంలో తాను చేయగలిగింది ఏమీ లేదని ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత నరేంద్రమోదీ గ్రహించి ఉంటారు. కానీ జవాన్లకు మాత్రం పెద్ద ఉపకా రమే చేశారు. ఒకే ర్యాంకు మాజీ సైనికులకు ఒకే స్థాయి పింఛను (ఒన్ ర్యాంక్, ఒన్ పెన్షన్-ఓఆర్‌ఓపీ) కావాలంటూ నాలుగు దశాబ్దాలకు పైగా జవాన్లు పోరా టం చేస్తున్నారు. ఈ పథకాన్ని తాను అధికారంలోకి వచ్చిన తర్వాత వంద రోజుల్లోనే అమలుచేస్తానంటూ మోదీ ఎన్నికల వాగ్దానం చేశారు. మొన్న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి మాట్లాడినప్పుడు ఓఆర్‌ఓపీ ఖరారైనట్టేనంటూ ప్రకటించారు.

వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. అయినా సరే, అప్పటికే ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో ఆందోళన చేస్తు న్న మాజీ సైనికులు పోరాటానికి స్వస్తి చెప్పలేదు. ఓఆర్‌ఓపీని ఆమోదిస్తున్న ట్టు రక్షణమంత్రి మనోహర్ పారికర్ ప్రకటించడంతో సుదీర్ఘ వివాదానికి తెరప డింది. ఈ చారిత్రక నిర్ణయం ఫలితంగా మాజీ సైనికులకు పింఛను, భద్రత పెరగడంతోపాటు ప్రస్తుతం సైన్యంలో ఉన్న జవాన్ల ఆత్మస్థయిర్యం పెరుగుతుంది.


 సైనికుల జీతాల సవరణకు నియమించిన మూడవ పే క మిషన్ నివేదిక ఆధారంగా ఓఆర్‌ఓపీ పథకాన్ని 1973లో కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. అప్పటి వరకూ సైనికులకు ఉద్యోగ విరమణ సమయంలో వస్తున్న జీతంలో 75 శాతం పింఛనుగా చెల్లించేవారు. దాన్ని 50 శాతానికి తగ్గించారు. మాజీ సైని కుల పింఛన్లలో వ్యత్యాసాలు పెంచే అన్యాయమైన విధానం ఇంతకాలం కొన సాగుతూ ఉంది. పదిహేను సంవత్సరాల కిందట ఒక ర్యాంకులో పదవీ విర మణ చేసిన అధికారి కంటే నిరుడు అదే ర్యాంకులో అంతేకాలం సర్వీసు చేసి ఉద్యోగ విరమణ చేసిన అధికారికి ఎక్కువ పింఛను వస్తుంది. సైనికుల సగటు వయసు 30 సంవత్సరాల ప్రాంతంలో ఉండే విధంగా సైనికులలో 85 శాతం మందిని 35 నుంచి 37 సంవత్సరాల వయసులోనే ఉద్యోగం నుంచి విరమింప జేస్తారు. 40 నుంచి 54 ఏళ్లలోపు రిటైరయ్యేవారి శాతం 12 లేదా 13 ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 60 ఏళ్ల వరకూ ఉద్యోగం చేస్తారు. వారి ఉద్యోగ కాలంలో మూడు లేదా నాలుగు వేతన సవరణ సంఘాల సిఫార్సులు అమలు జరుగుతాయి. జవాన్ల ఉద్యోగ కాలంలో ఒకటి లేదా రెండు వేతన సంఘాలకు మించి ఉండవు. సైనికుల జీతంలో పింఛను శాతాన్ని 75 నుంచి 50 శాతానికి తగ్గించిన ప్రభుత్వం కాలక్రమేణా ప్రభుత్వ ఉద్యోగుల జీతంలో పింఛను శాతాన్ని 33 నుంచి 50కి పెంచింది.
 కోటి ఓట్లు
 నిరుడు జరిగిన సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఓఆర్‌ఓపీ పథకం ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చింది. ఎన్నికల సమయంలో మాజీ సైనికులను నిర్లక్ష్యం చేయ డం నష్టదాయకమని రెండు ప్రధాన పార్టీలకూ తెలుసు. మాజీ సైనికులు దాదాపు పాతిక లక్షల మంది ఉంటే, యుద్ధంలో మరణించిన సైనికుల భార్య లూ, భర్తల ఉద్యోగ విరమణ తర్వాత వితంతువులైనవారూ ఆరు లక్షల మంది ఉంటారని అంచనా. మొత్తం మాజీ సైనికుల కుటుంబాలలో కోటిమంది దాకా ఓటర్లు ఉంటారు. ఈ ఓటర్లను ఆకట్టుకోవడానికైనా ఓఆర్‌ఓపీ అమలు చేస్తా మంటూ రెండు పార్టీలూ వాగ్దానం చేసి ఉంటాయి. నరేంద్రమోదీ అధికారం లోకి వచ్చిన తర్వాత మాజీ సైనికులు పదమూడు మాసాలు వేచి చూశారు. పత కాలను వాపసు ఇవ్వడం, రక్షణ మంత్రి సమావేశాలను బహిష్కరించడం వంటి నిరసన ప్రదర్శనలు చేశారు. అప్పటికీ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసు కోకపోవడంతో మాజీ సైనికులు తమ డిమాండ్ల సాధనకోసం ప్రత్యక్ష పోరాటం ప్రారంభించారు. రిలే నిరాహార దీక్షలు సాగించారు. ఇద్దరు మాజీ సైనికాధికారులు నిరవధిక నిరాహార దీక్ష మొదలు పెట్టారు. పరిస్థితి అదుపు తప్పుతోంది. ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి ముంచుకొస్తున్న దశలో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. పాకిస్తాన్‌తో 1965నాటి సరిహద్దు పోరాటం ముగిసి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శనివారంనాడు మాజీ జవాన్లకు పారికర్ శుభవార్త వినిపించారు.


 ఓఆర్‌ఓపీ పథకం అమలు చేయాలంటే అదనంగా 8,000 కోట్ల పైచిలుకు ఖర్చు అవుతుందనీ, ఇది ఏటా పెరుగుతూ పోతుందనీ రక్షణ మంత్రి వివరిం చారు. ఈ నిర్ణయం 2014 జూలై ఒకటి నుంచి అమలులోకి వస్తుందనీ, అప్పటి నుంచీ రావలసిన బకాయిలను నాలుగు అర్ధసంవత్సరం వాయిదాలలో చెల్లి స్తామనీ, వితంతువులకు మాత్రం ఒకే విడతలో పూర్తి మొత్తం ఇస్తామనీ పారికర్ చెప్పారు. 2013 నాటి వేతనాలను ప్రాతిపదికగా తీసుకొని సగటు వేతనాన్ని నిర్ణయించి పింఛను ఖరారు చేస్తారు.

ర్యాంకూ, సర్వీసూ (పని చేసిన సంవత్సరాలూ) సమానంగా ఉంటూ ఉద్యోగ విరమణ చేసినవారందరికీ ఒకే రకమైన పింఛను నిర్ణయిస్తారు, ఉద్యోగ విరమణ తేదీతో నిమిత్తం లేకుండా. పింఛను బకాయీల మొత్తం చెల్లించాలంటే పది నుంచి పన్నెండు వేల కోట్ల రూపాయలు అవసరమని అంచనా. పెద్ద భారాన్నే ఎన్‌డీఏ ప్రభుత్వం నెత్తికి ఎత్తుకుంది. ఓఆర్‌ఓపీ పథకాన్ని ఆమోదించడంతో పాటు తక్కిన డిమాండ్లను కూడా అంగీకరించాలంటూ ఉద్యమ నాయకులు పట్టుబట్టారు. రక్షణ మం త్రితో సమాలోచనల తర్వాత స్వచ్ఛంద ఉద్యోగ విరమణపైన స్పష్టత వచ్చింది. ఇతర అంశాలపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుండా ఒక న్యాయమూర్తి నాయకత్వంలో ఏకసభ్య సంఘం ద్వారా ఆరు మాసాలు అధ్యయనం జరిపిస్తా మనీ, ఆ సంఘం సిఫార్సుల ప్రాతిపదికపైన అంతిమ నిర్ణయం తీసుకుంటా మని రక్షణమంత్రి చెప్పడం తమకు ఆశాభంగం కలిగించినట్టు మాజీ సైనికుల ఉద్యమ నాయకుడు మేజర్ జనరల్ (రిటైర్డ్) సత్బీర్ సింగ్ ప్రకటించారు.
 మోదీ చేసిన ఉపకారం
 చిన్న సమస్యలు అపరిష్కృతంగా మిగిలిపోయినప్పటికీ దశాబ్దాలుగా కొరుకు డుపడని ప్రధానమైన సమస్యను పరిష్కరించడంలో విజయం సాధించడాన్ని ఎన్‌డీఏ ప్రభుత్వం సగర్వంగా చాటుకోవడం సహజం. పారికర్ నిరాడంబరం గా ప్రకటన చేసినప్పటికీ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పూర్తి స్థాయిలో ప్రధాని మోదీని అభినందించారు. మొత్తం ఖ్యాతి ఎన్‌డీఏ సర్కార్‌కు ఎక్కడ పోతుందో నని మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ తెరమీదికి వచ్చారు. ఓఆర్‌ఓపీ పథకాన్ని ఎన్‌డీఏ ప్రభుత్వం నీరుగార్చిందంటూ విమర్శించారు. పదేళ్ల యూపీఏ పాల నలో మాజీ సైనికుల పింఛన్ల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించేందుకు మూడుసార్లు పింఛన్లను పెంచామనీ, 2014 ఫిబ్రవరిలో నాటి ఆర్థిక మంత్రి చిదంబరం పార్లమెంటులో ప్రవేశ పెట్టిన అనామతు బడ్జెట్‌లో ఓఆర్ ఓపీ పథకంకోసం 500 కోట్ల రూపాయలు కేటాయించారనీ, అవసరమైతే కేటాయింపులు పెంచుతా మని కూడా చెప్పారనీ ఆంటోనీ గుర్తు చేశారు. 2014-15 నుంచి ఓఆర్‌ఓపీని అమలు చేయాలని యూపీఏ కృతనిశ్చయంతో ఉన్నదని కూడా అన్నారు. ఆ అవకాశం ప్రజలు యూపీఏకి ఇవ్వలేదు.

అవకాశం ఇచ్చిన పదేళ్లలో ప్రవేశ పెట్టిన పది బడ్జెట్లలో ఓఆర్‌ఓపీ పథకం కోసం నిధులు కేటాయించలేదు. పైగా 2008లో ఆరవ వేతన సంఘం ఓఆర్‌ఓపీ పథకాన్ని అమలు చేయడం సాధ్యం కాదంటూ కుండబద్దలు కొట్టింది. ఓఆర్‌ఓపీ అమలులో కొంత కీర్తిని దక్కించు కోవాలని కాంగ్రెస్ తాపత్రయ పడినా వాస్తవాలు సహకరించే విధంగా లేవు. ఓఆర్‌ఓపీ పథకాన్ని అమలు చేయాలన్న ప్రయత్నం యూపీఏ నిజాయితీగా చేసి ఉంటే అందుకోసం అనామతు కేటాయింపులు 500 కోట్ల రూపాయలతో సరిపుచ్చేది కాదంటూ అమిత్ షా తప్పుపట్టారు. ఆ మాటకు వస్తే 2015-16 బడ్జెట్ ప్రతిపాదనలలో ఎన్‌డీఏ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కేటాయించింది కూడా వెయ్యి కోట్ల రూపాయలే. పూర్తి బడ్జెట్‌లో ప్రత్యేకించిన వెయ్యి కోట్లకూ, ఇప్పుడు రక్షణ మంత్రి అంచనా వేస్తున్న 8,300 కోట్లకూ మధ్య చాలా వ్యత్యాసం ఉన్నది.


 వాస్తవం ఏమంటే ఇటీవలి వరకూ ఆర్థిక మంత్రి కానీ, రక్షణ మంత్రి కానీ, రక్షణశాఖ కార్యదర్శి కానీ ఓఆర్‌ఓపీ పథకం అమలు చేయవలసి వస్తే వాస్తవం గా ఎంత ఖర్చు అవుతుందో అంచనా వేయలేదు. ఆ పని మోదీ ప్రధాని అయిన కొన్ని మాసాల తర్వాతే ప్రారంభమైంది. పింఛన్లను సంవత్సరానికి లేదా రెండు సంవత్సరాలకు ఒకసారి సవరించాలన్న మాజీ సైనికుల కోర్కెను ప్రభుత్వం మన్నించలేదు. ఏటా సవరించడం ప్రపంచంలో ఎక్కడా లేదని అరుణ్ జైట్లీ కొట్టిపారేశారు. ఐదేళ్లకు ఒకసారి సమీక్షించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సమస్య జటిలమైనది కనుక కొంత జాప్యం జరిగినప్పటికీ మాజీ సైనికులకు మేలు చేయాలన్న సంకల్పం నెరవేరింది. చాలాకాలంగా మాజీ జవాన్లనూ, మాజీ సైనికాధికారులనూ వేధిస్తున్న సమస్యను సంతృప్తికరంగా పరిష్కరించి నందుకు నరేంద్రమోదీనీ, మనోహర్ పారికర్‌నీ, ఎన్‌డీఏ ప్రభుత్వాన్నీ బేషర తుగా అభినందించాలి.


 జవాన్ల పింఛన్ల సమస్య పరిష్కరించారు, సంతోషం. మరి కిసాన్ల మాటే మిటి? విదర్భ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోనే కాకుండా పంజాబ్, హరియా ణా వంటి హరిత విప్లవం సాధించిన సంపన్న రాష్ట్రాలలో సైతం రైతులు అప్పు ల బాధ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వ్యవసాయాన్ని గిట్టుబా టు వ్యాసంగం చేయడంపైన కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టి సమగ్ర వ్యవ సాయ విధానాన్ని రూపొందించకపోతే మోదీ విజయం పాక్షికమే అవుతుంది. -  కె.రామచంద్రమూర్తి

మరిన్ని వార్తలు