గిల్‌గమెష్‌: ప్రపంచ ప్రాచీన పురాణం

24 Apr, 2017 00:45 IST|Sakshi
గిల్‌గమెష్‌: ప్రపంచ ప్రాచీన పురాణం
‘సిధ్యురి’ మరొక స్త్రీ పాత్ర. ‘ఉట్‌నపిస్తిమ్‌’ నివసించే ప్రాంతానికి ఎలా చేరుకోవాలో గిల్‌గమెష్‌కు తెలియజేస్తుంది. అయితే అమరత్వం సాధించటం సాధ్యం కాదనీ, మనుషులు పరిశుద్ధంగా, ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలనీ చెబుతుంది. వివాహం చేసుకొని భార్యను సుఖపెట్టటం, పిల్లల్ని రక్షించటం మగవాడి విధి అని తెలియజేస్తుంది. ప్రపంచ సాహిత్యం మొత్తంలో దీన్ని మించిన హితబోధ లేదనటం అతిశయోక్తి కాదేమో!
 
ఏ పురాణాన్నైనా పుక్కిటి పురాణమని పూర్తిగా తీసిపారవెయ్యకూడదు. రామ రావణ యుద్ధం పురాణం; రావణుడి పొట్టలో అమృతభాండం ఉండటం పుక్కిటి పురాణం. పురాణాన్ని నమ్మటం విజ్ఞత; పుక్కిటి పురాణాన్ని నమ్మటం మూర్ఖత్వం. ఒక జాతి అనుభవసారాన్ని మతవిశ్వాస రూపంలో తెలియజేసేది పురాణం. ఒక పురాణగాథలో అనేక అభూత కల్పనలు ఉండవచ్చు; వాటి వెనకాల అంతర్లీనంగా ఒక సత్యం దాగి ఉంటుంది. ఆ సత్యాన్ని అర్థం చేసుకోవటం వల్ల చరిత్ర పూర్వకాలానికి చెందిన మనుషుల భౌతిక జీవితాన్నీ, విశ్వాసాలనూ, సామాజిక వ్యవస్థలనూ అంచనా వెయ్యవచ్చు.
 
ప్రపంచ పురాణాలన్నింటిలో అత్యంత ప్రాచీనమైనదీ, మొట్టమొదట లిపిబద్ధం చేయబడినదీ సుమేరియన్‌ నాగరికతకు చెందిన ‘గిల్‌గమెష్‌ పురాణం’. సుమేరియన్ల అతి ప్రాచీన నగరాలలో ‘ఉరుక్‌’ఒకటి. క్రీ.పూ. 2800 కాలంలో ఉరుక్‌ నగరాన్ని ‘గిల్‌గమెష్‌’ పాలించాడు. అతను చేసిన వీరోచిత సాహస కృత్యాలకు గాను మరణానంతరం అతనికి దైవత్వం ఆపాదించబడింది. అతని వీరగాథలు పద్య రూపంలో మౌఖికంగా వాడుకలోకి వచ్చాయి. క్రీ.పూ. 2000 నాటికి లిఖిత రూపంలోకి వచ్చాయి.

సుమేరియన్లను అకేడియన్లు ఓడించి సామ్రాజ్యాన్ని స్థాపించారు. గిల్‌గమెష్‌ గాథలు అకేడియన్‌ భాషలోకి మారాయి. ఆ తరువాత బాబిలోనియన్లు సామ్రాజ్యాన్ని స్థాపించారు. గిల్‌గమెష్‌ గాథలు బాబిలోనియన్‌ భాషలోనికీ వెళ్ళాయి. భాషలు వేరయినా సుమేరియన్లకూ, అకేడియన్లకూ, బాబిలోనియన్లకూ లిపి ఒక్కటే. అది సుమేరియన్ల ‘క్యూని ఫారం’ లిపి. గిల్‌గమెష్‌ గాథలన్నింటినీ క్రమబద్ధీకరించి ఒక సాధికార ప్రతిని తయారుచేసినవాడు సిన్‌–
 
లిక్‌–యునిన్ని (క్రీ.పూ. 1200).
సుమేరియన్‌ భాషలో గిల్‌గమెష్‌కు సంబంధించిన గా«థలు ఐదున్నాయి. బాబిలోనియన్‌ కాలానికి ఇవి (సాధికార ప్రతిలో) పన్నెండు భాగాలుగా వ్రాయబడ్డాయి. ఒక్కొక్కభాగం ఒక్కొక్క పెద్ద మట్టి ఫలకం (ఖ్చీbl్ఛ్ట) మీద వ్రాయబడి ఉంటుంది. అటువంటి ఫలకాలు సుమేరియన్‌ భాషలో, అకేడియన్‌ భాషలో వందల కొద్దీ దొరికాయి. వాటిలో ఏ ఒక్కటీ పూర్తిగా చెక్కు చెదరకుండా లభించలేదు. 
పురాణాలకు ఉండవలసిన ముఖ్యలక్షణాలన్నీ గిల్‌గమెష్‌ పురాణానికి ఉన్నాయి. చెడు మీద మంచి విజయం సాధించటమనేది దాదాపు అన్ని పురాణాల్లో కనిపించే ముఖ్య విషయం. కానీ ‘గిల్‌గమెష్‌ పురాణం’లో అటువంటిదేమీ ఉండదు.
 
గిల్‌గమెష్‌ చేసిన సాహసకృత్యాలు, స్నేహానికి అతనిచ్చిన ప్రాముఖ్యత, అమరత్వం పొందటానికి చేసిన విఫల ప్రయత్నం ఇందులో కనిపిస్తాయి. దీన్ని ప్రపంచపు మొట్టమొదటి ఆటౌఝ్చnఛ్ఛి (అన్నదమ్ములు లేక స్నేహితులు కలసి చేసే సాహసకృత్యాలు) అనవచ్చు. (రామాయణాన్ని కూడా ఆటౌఝ్చnఛ్ఛి అనవచ్చు.) ఇందులో మొత్తం పది పాత్రలు ఉన్నాయి. నేప«థ్యంలో కొన్ని పాత్రల ప్రస్తా్తవన ఉంటుంది కానీ వాటికి కథతో సూటిగా సంబంధం ఉండదు. గిల్‌గమెష్‌ ఈ పురాణానికి కేంద్ర బిందువు. ‘ఉరుక్‌’నగరంలో ‘ఇష్‌తార్‌’ దేవతకూ, ఆమె తండ్రి ‘అను’కూ ఆలయాన్ని నిర్మించినవాడు. ‘ఉరుక్‌’ నగర రక్షణ కోసం యువకుల చేత గోడల నిర్మాణం చేయిస్తుంటాడు. యువకులు నిరంతరం పనిచేస్తుండటంతో యువతులకు వివాహం కావట్లేదని నగర పెద్దలు ‘అను’ దేవుడికి గిల్‌గమెష్‌ గురించి ఫిర్యాదు చేస్తారు.   
 
రెండవ ముఖ్య పాత్ర పేరు ‘ఎంకిడు’. సుమేరియన్ల గాథల్లో ఇతను గిల్‌గమెష్‌ సేవకుడిగా పేర్కొనబడ్డాడు. అకేడియన్, బాబిలోనియన్‌ గాథల్లో ఇతను ప్రత్యేకంగా సృష్టించబడినట్లు చెప్పబడింది. బల పరాక్రమాలలో ఇతను గిల్‌గమెష్‌కు సమవుజ్జీ. వీరిద్దరూ మంచి స్నేహితులవుతారు. కలసి రెండు గొప్ప సాహసకృత్యాలు చేస్తారు. అయితే ఎంకిడు మరణం గిల్‌గమెష్‌ను కృంగదీస్తుంది. ఎంకిడు లాగా తను మరణించ కూడదనీ, మరణాన్ని జయించాలనీ నిర్ణయించుకొంటాడు. అమరత్వాన్ని సాధించటానికి అతను చేసిన ప్రయత్నం అతన్ని ‘ఉట్‌నపిస్తిమ్‌’ వద్దకు తీసుకువెళ్తుంది. బైబిల్‌లోని ‘నోవా’లాగా, హిందువుల పురాణాలలోని ‘మను’ లాగా ఇతను ప్రాణి కోటిని జలప్రళయం నుండి రక్షించినవాడు. అందువల్ల అమరత్వం పొందినవాడు. అమరత్వ రహస్యం తెలుసుకోవటానికి గిల్‌గమెష్‌ ఇతని లోకానికి వెళతాడు. 
 
ఈ పురాణంలోని స్త్రీ పాత్రలు పైకి కనిపించేది చాలా కొద్దిసేపయినా ఆ కాలంలో చోటు చేసుకొంటున్న మార్పులను అర్థం చేసుకోవటానికి ఉపయోగపడతాయి. స్త్రీ పాత్రలలో ముఖ్యమైనది ‘ఇష్‌తార్‌’ దేవత. ‘ఉరుక్‌’ నగర ప్రధానదేవత (్క్చ్టటౌn జౌఛీఛ్ఛీటట). ‘హుంబబ’ అనే భయంకర మృగంతో యుద్ధం చెయ్యటానికి వెళ్ళేటప్పుడు సహాయం కోసం గిల్‌గమెష్‌ ఈమెను ప్రార్ధించడు. సూర్యదేవుడైన ‘షమాష్‌’ సహాయం కోరతాడు. విజయం సాధిస్తే ‘షమాష్‌’ మహిమల్ని కీర్తిస్తాననీ, సింహాసనమెక్కిస్తాననీ అంటాడు. ‘హుంబబ’ మృగాన్ని గిల్‌గమెష్‌ వధించాక తనను వివాహం చేసుకొమ్మని అడుగుతుంది ‘ఇష్‌తార్‌’.
 
అతను నిరాకరిస్తాడు. ఆమె ఆగ్రహించి ‘ఉరుక్‌’ నగరాన్ని ధ్వంసం చెయ్యటానికి దైవ వృషభాన్ని పంపిస్తుంది. ఎంకిడు, గిల్‌గమెష్‌ కలసి దాన్ని వధిస్తారు. ‘ఇష్‌తార్‌’ దేవతను ‘ఎంకిడు’ అవమానిస్తాడు. ఆమె అతణ్ని శపిస్తుంది. ఆ తరువాత కొద్దికాలానికి ఎంకిడు వ్యాధిగ్రస్తుడై మరణిస్తాడు. తన నగరానికి ప్రధాన దేవత ఐన ‘ఇష్‌తార్‌’ను గిల్‌గమెష్‌ నిరాకరించటం ‘ఇష్‌తార్‌’ దేవతపైన ‘షమాష్‌’ ఆధిపత్యాన్ని నెలకొల్పే ప్రయత్నంగా భావించాలి. అయితే ఆ ప్రయత్నం ఆ కాలంలో విఫలమైంది. ‘ఇష్‌తార్‌’ దేవతను నిరాకరించినప్పటి నుండి గిల్‌గమెష్‌ చేసిన పనులేవీ సఫలం కావు.
 
‘ఇష్‌తార్‌’ దేవత ఆలయ పూజారిణి లేక వేశ్య పేరు ‘షమ్‌హత్‌’. సుమేరియన్‌ భాషలో ఈమె పేరు ‘హరిమ్‌’. అడవిలో ఉంటూ జంతువులలో జంతువుగా సంచరించే అనాగరికుడైన ‘ఎంకిడు’ను నాగరికుడిగా తీర్చిదిద్ది ‘ఉరుక్‌’ నగరానికి తీసుకువచ్చిన యువతి ఈమె. మానవజాతిని అనాగరిక దశ నుండి నాగరిక దశకు తీసుకు వచ్చింది మాతృస్వామ్యమని దీనివల్ల అర్థమౌతుంది. వ్యవసాయం వల్ల, పశుపోషణ వల్ల ఆహారాన్ని నిలువ చేయటం నేర్పిన తరువాతనే పితృస్వామ్యం ప్రారంభమయింది. ఇతరుల సంపదను (ధాన్యం, పశువులు) దోచుకొనే దోపిడి వ్యవస్థ ప్రారంభమైంది. 
 
‘సిధ్యురి’ మరొక ముఖ్య స్త్రీ పాత్ర. ‘ఉట్‌నపిస్తిమ్‌’ నివసించే ప్రాంతానికి ఎలా చేరుకోవాలో ఈమె గిల్‌గమెష్‌కు  తెలియజేస్తుంది. అయితే దారి తెలియచేసే ముందు అమరత్వం సాధించటం సాధ్యం కాదనీ, మనుషులు పరిశుద్ధంగా, ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలనీ చెబుతుంది. వివాహం చేసుకొని భార్యను సుఖపెట్టటం, పిల్లల్ని రక్షించటం మగవాడి విధి అని తెలియజేస్తుంది. ప్రపంచ సాహిత్యం మొత్తంలో దీన్ని మించిన హితబోధ లేదనటం అతిశయోక్తి కాదేమో! వివాహం చేసుకోవటం, సంతానాన్ని పొందటం మగవాడికి ముఖ్యమని గిల్‌గమెష్‌ తల్లి ‘నిన్‌సున్‌’ కూడా చెబుతుంది. కాని గిల్‌గమెష్‌ మాత్రం మరణించే వరకు వివాహం చేసుకోడు.
 
 
గిల్‌గమెష్‌ కాలం నాటికి (క్రీ.పూ. 2800) పితృస్వామ్యం ప్రారంభమై బలపడుతున్నది. రాజకీయ, సామాజిక వ్యవహారాలలో పురుషులు పెత్తనం దొరకబుచ్చుకొన్నారు. కాని పితృస్వామ్యాన్ని బలపరిచే తాత్విక చింతన, దాని చుట్టూ అల్లబడే మతసిద్ధాంతాలు ఏర్పడలేదు. స్త్రీ తన సంతానంలో తన పునర్జన్మని చూసుకుంటుంది. అమరత్వం సాధించిన తృప్తి పొందుతుంది. పురుషుడికి అటువంటి అవకాశం లేదు. కనుక అతను అమరత్వం పొందటానికి వేరే మార్గాలు అన్వేషిస్తాడు. పరమాత్మ, జీవాత్మ, పునర్జ్జన్మ, పరలోకం, మోక్షం మొదలైనవన్నీ ఆ అన్వేషణలో అతను ఏర్పరచుకున్న భ్రమలు. ఈ భ్రమలు గిల్‌గమెష్‌ పురాణంలో మచ్చుకి కూడా కనపడవు. అంటే పితృస్వామ్యం ప్రారంభ దశలో ఉందని అర్థం.

క్రైస్తవం, ఇస్లాం, హిందూ మతం, బౌద్ధం మొదలైనవన్నీ అసలు సిసలు పితృస్వామ్య మతాలు. ఇవన్నీ ఇహలోకానికి కాకుండా పరలోకానికి పెద్ద పీట వేస్తాయి (బౌద్ధం కాస్త మినహాయింపు). ఐదువేల సంవత్సరాలకు పూర్వం మాతృస్వామ్యం చెప్పిన సత్యాలు నిజమని ఇప్పుడు సైన్సు చెబుతున్నది. దైవసృష్టి సిద్ధాంతం, ఆత్మ సిద్ధాంతం, పరలోకం మొదలైనవన్నీ భ్రమలని ఆధారాలతో అది నిరూపిస్తున్నది. అయినా  మనం ఇంకా  పితృస్వామ్య ప్రవచిత తప్పుడు భ్రమలనే పట్టుకు వ్రేళ్ళాడుతున్నాం. పురాణాలను కాకుండా పుక్కిటి పురాణాలను నమ్మే మేధావులం కదా మనం!                                                                                                                                       ది ఫెమినిస్ట్‌ ప్రసాద్‌ 
9849828797 
 
మరిన్ని వార్తలు