తస్లిమాపై దాడి మాటేమిటి?

20 Oct, 2015 01:26 IST|Sakshi

ఎక్కడో ఎవరినో హత్యచేస్తే అది కాస్త ప్రధాని నరేంద్రమోదీయే కత్తి ఇచ్చి దగ్గరుండి మరీ ఆ హత్యకు ప్రేరేపించారనే చందంగా మన మేధావులు నెత్తీనోరూ బాదుకుంటున్నారు. ప్రజాస్వామ్యం కూలిపోయిందని, లౌకికరాజ్యం కాలిపోయిందని తెగ బాధపడి పోతున్నారు. కానీ బంగ్లాదేశ్‌నుంచి వెళ్లగొట్టిన ఆడ బిడ్డ తస్లిమా నస్రీన్ ఆశ్రయం కోరివస్తే పశ్చిమబెంగాల్ నుంచి ఆమెను వెంట బడి తరిమేసిననాడు మన సాహితీ వేత్తలు ఏం చేశారు? ఆమెను బెంగాల్ నుంచి తరిమేస్తే నేనున్నానంటూ గుజరాత్‌కు ఆహ్వానించిన నాటి రాష్ట్ర సీఎం నరేంద్ర మోదీని ఏ రచయితా ప్రశంసించకపోగా, విమ ర్శల తుఫాను కురిపించారు. ఎక్కడో ఎందు కు.. అదే తస్లిమాపై దేశ రెండో రాజధానిగా గర్వంగా చెప్పుకుంటున్న హైదరాబాద్ నడి బొడ్డులో ప్రెస్ క్లబ్‌లో దాడి జరిగితే, సాక్షాత్తూ ఒక ఎమ్మెల్యేనే ఆ దాడికి నాయకత్వం వహిస్తే, ఎవ్వరూ నోరెత్తలేదు.
 
 ఆరోజు ఆ ఆడబిడ్డ రక్త మోడుతూ తన ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ ప్రెస్ క్లబ్‌లో ఓ మూలన తలదాచుకున్న సంఘటనపై ఏ సాహిత్య వేత్తయినా నోరు తెరిచి ఖండించిన పాపాన పోయారా? లేదా ఆ ఘటనను ఖండించడానికి ఎవరికీ ధైర్యం సరిపోలేదా? ఇదే హైదరా బాద్‌కు చెందిన మరో ఎమ్మెల్యే భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తూ ఒక 15 నిమిషాలు పోలీసులు పక్కన జరగండి మా తడాఖా చూపిస్తామంటూ సవాల్ విసిరిన నాడు మన సాహితీ వేత్తలకు లౌకికత్వం గుర్తుకురాలేదా? ఎక్కడో ఏ మూలనో ఏదో ఒక ఘటన జరిగితే దాన్ని మోదీకి అంటగట్టి సాహితీ వేత్తలు అవార్డు లనే తిరిగి ఇచ్చేయడం సమంజసమేనా? ఎమ ర్జెన్సీ విధించిన రోజు కూడా ఈ అవార్డీలు ఇం తగా రెచ్చిపోలేదే? లౌకికవాదం పేరిట ఈ కప టత్వం ఎందుకో అందరూ ఒకసారి తమను తాను శల్యపరీక్ష చేసుకుంటే దేశానికి మంచిది.
- పగుడాకుల బాలస్వామి 9912975753

>
మరిన్ని వార్తలు